Afghanistan: రోజుల తరబడి పడిగాపులు-ఇక ఆఫ్గన్ను వీడలేమని తెలిసి-అక్కడి మహిళల పరిస్థితి ఎంత దయనీయం...
ఆఫ్గనిస్తాన్లో తాలిబన్ల రాజ్య స్థాపన తర్వాత అక్కడి జనజీవనం కకావికలమైంది. గూడు చెదిరిన పక్షుల వలె ఆఫ్గనిస్తానీలు దిక్కుతోచని స్థితిలో చిక్కుకుపోయారు. దేశం దాటి పారిపోయేందుకు వేలాది మంది కాబూల్ విమానాశ్రయం వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం... ఆఫ్గనిస్తానీలంతా ఇప్పటికిప్పుడు శరణార్థులుగా ఏ దేశానికి వెళ్లేందుకైనా సిద్ధంగా ఉన్నారు. కానీ అంతమందిని ఏ దేశం అక్కున చేర్చుకోవాలి... అది సాధ్యపడేదేనా... కచ్చితంగా కాదనే చెప్పాలి. ఇక తాము దేశం వీడటం అసాధ్యమని గ్రహించిన కొంతమంది ఆఫ్గనిస్తానీలు... ఇక చావైనా,బతుకైనా అక్కడే తేల్చుకునేందుకు సిద్ధపడుతున్నారు. అలా కాబూల్ విమానాశ్రయాన్ని వీడి స్వగ్రామానికి వెళ్లిన ఇద్దరు మహిళలు అంతర్జాతీయ మీడియా రాయిటర్స్తో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

షిరిన్ తబ్రీక్కి ఎదురైన చేదు అనుభవం...
ఆఫ్గనిస్తాన్కు చెందిన మహిళా టీచర్ షిరిన్ తబ్రిక్(43) దేశాన్ని వీడేందుకు ఐదు రోజుల క్రితం కాబూల్లోని హమీద్ కర్జాయ్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆ ఐదు రోజులు పగలు,రాత్రీ అక్కడే గడిపారు. రోజులు గడుస్తున్న కొద్ది ఆమెకు నమ్మకం సన్నగిల్లింది. ఇక తాను ఆఫ్గనిస్తాన్ను వీడటం అసాధ్యమని అర్థమైపోయింది. దీంతో ఇక అక్కడ వేచి ఉండటం కంటే చావో,బతుకో దేశంలోనే ఉండిపోవాలని నిర్ణయించుకుంది. అలా అక్కడి నుంచి నేరుగా తన స్వగ్రామానికి చేరుకుంది.

ఆఫ్గన్లను ఒకలా... విదేశస్తులను మరోలా...
'విదేశీయుల చేత అవమానించబడటం,వారు తమను చెత్తలా ట్రీట్ చేయడం కంటే ఆఫ్గనిస్తాన్లో తాలిబన్ల పాలనలోనే నేను ఉండిపోవాలనుకుంటున్నాను. అమెరికన్లు ఆఫ్గనిస్తానీలందరినీ అవమానిస్తున్నారు. నేనో మర్యాదస్తుల కుటుంబం నుంచి వచ్చాను. కానీ ఐదు రోజుల పాటు పగలు,రాత్రి కాబూల్ విమానాశ్రయం వద్ద వీధుల్లో గడపాల్సి వచ్చింది. మహిళలు,చిన్నారులంటే ఏమాత్రం గౌరవం లేని వారిని తమను రక్షించమని అడుక్కున్నట్లు అనిపించింది. నిజానికి పాకిస్తాన్ వెళ్లేందుకు అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ నా వద్ద ఉన్నాయి.కానీ కాబూల్ విమానాశ్రయం వద్ద విదేశీయులను ఒకలా... ఆఫ్గనిస్తానీలను మరోలా చూస్తున్నారు.' అని తబ్రీక్ వాపోయారు.
Recommended Video

కాబూల్ విమానాశ్రయం వద్ద పరిస్థితి ఎలా ఉందంటే...
'కాబూల్ విమానాశ్రయం వద్ద పరిస్థితి ఎలా ఉందంటే... అక్కడ విదేశీయులెవరినీ ఎవరూ అడ్డుకోవట్లేదు. వారిని అడ్డుకునే ప్రయత్నం ఎక్కడా కనిపించలేదు.కానీ చట్టబద్దంగా అన్ని డాక్యుమెంట్స్ ఉన్న నన్ను అమెరికా ఎందుకు అడ్డుకుంది.అసలు నన్ను అడ్డుకోవడానికి,ఆపడానికి వారెవరు...' అని తబ్రీక్ పేర్కొన్నారు. అందుకే విసిగిపోయి.. ఇక అక్కడ వేచి ఉండటం కన్నా స్వగ్రామానికి వెళ్లడమే బెటర్ అని డిసైడ్ అయ్యాను. 'మా గ్రామంలో మేము మంచిగా బతకగలమని అనుకుంటున్నాం.అక్కడ మాకు కొంత వ్యవసాయ భూమి ఉంది. అందులో గోధుమలు,వివిధ రకాల పండ్లు పండిస్తాం. మాకు అన్ని విధాలా అక్కడ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇక మాకింకేమీ అక్కర్లేదు. అమెరికన్లంతా ఇక్కడి నుంచి వెళ్లిపోవచ్చు. ఇక వారిని మరోసారి నా దేశంలో చూడకూడదని కోరుకుంటున్నాను.' అని తబ్రీక్ తెలిపారు.

మరో మహిళకు ఎదురైన చేదు అనుభవం...
షగుఫ్తా దస్తక్గిర్ అనే ఓ నర్సు కూడా దాదాపుగా తబ్రీక్ లాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. దస్తక్గిర్ వెల్లడించిన వివరాల ప్రకారం... ఆఫ్గనిస్తాన్లోని మజర్ ఇ షరీఫ్కి చెందిన ఆమె ఇంగ్లీష్,జర్మనీలో బాగా మాట్లాడగలదు. ఓ జర్మనీ ఎన్జీవో సంస్థ తరుపున చాలాకాలం ఆమె నర్సుగా పనిచేశారు. ఒకవేళ ఆఫ్గనిస్తాన్లో శాంతిభద్రతలు దిగజారితే... దస్తక్గిర్ సహా 20 మంది తమ స్టాఫ్ను జర్మనీకి తరలిస్తామని గతేడాది ఆ ఎన్జీవో సంస్థ వారికి మాట ఇచ్చింది. కానీ ప్రస్తుతం వారి నుంచి ఆమెకు సహాయం కరువైంది. గత నెలలో తాలిబన్లు మజర్ ఇ షరీఫ్ను ఆక్రమించుకున్నప్పుడే ఆమె ఆ సంస్థ యాజమాన్యాన్ని ఫోన్ ద్వారా సంప్రదించింది. పదుల సార్లు మెయిల్స్ చేసింది. కానీ అటు వైపు నుంచి ఎటువంటి స్పందన రాలేదు.

నాలుగు రోజుల పడిగాపులు... నిరాశతో వెనుదిరిగి...
ఇక ఆమె,అతని సోదరుడు,తండ్రి కలిసి మజర్ ఇ షరీఫ్ నుంచి కాబూల్కి బయలుదేరారు. అప్పటికే తాలిబన్లు రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ తుపాకులతో సంచరిస్తున్నారు.భయపడినట్లుగానే ఓచోట తాలిబన్లు వారి కారును ఆపారు. కాబూల్లో తమ బంధువుల ఇంటికి వెళ్తున్నామని వారు చెప్పగానే తాలిబన్లు బిగ్గరగా నవ్వారు.మూర్ఖులారా దేశాన్ని విడిచి పారిపోతున్నారా అంటూ నవ్వారు. ఎలాగోలా అక్కడి నుంచి బయటపడి కాబూల్ విమానాశ్రయానికి చేరుకోగలిగారు. దస్తక్గిర్ నాలుగు రోజుల పాటు అక్కడే పగలు,రాత్రీ గడిపారు.కానీ విమానం ఎక్కేందుకు ఆమెకు అవకాశం రాలేదు. దీంతో ఆమె వెనుదిరిగే ఆలోచనలో ఉన్నారు.

'ప్రపంచం మమ్మల్ని వదిలేసింది...'
'త్వరలోనే నేను మళ్లీ మజర్ ఇ షరీఫ్కు చేరుకుంటాను. నాకిప్పుడు ఎవరిపైనా కోపం లేదు. నేను అలసిపోయాను. నేను జర్మన్లను చాలా గౌరవించేదానిని. కానీ విదేశీ శక్తుల మరో కోణాన్ని ఇప్పుడు చూస్తున్నాను.' అని పేర్కొన్నారు. కాబూల్ విమానాశ్రయం వద్ద పరిస్థితిని చూశాక.. ప్రపంచం తమను వదిలేసినట్లు అనిపించిందన్నారు. ఆ అల్లాకు తెలుసు... ఆఫ్గన్ పౌరులెవరూ ఏ దేశానికి నష్టం చేయలేదని పేర్కొన్నారు.
ఈ పరిస్థితి జర్మన్ దౌత్యవేత్త ఒకరు మాట్లాడుతూ... ఇప్పుడున్న పరిస్థితుల్లో కాబూల్ నుంచి జర్మనీకి వచ్చేవారికి పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతినివ్వగలమని చెప్పారు. గురువారం(ఆగస్టు 26) నాటికే జర్మనీ ఆఫ్గనిస్తాన్ నుంచి తరలింపు ప్రక్రియను ముగించింది. ఇప్పటివరకూ ఆఫ్గనిస్తాన్ నుంచి 12,500 మందిని తరలించినట్లు అమెరికా ప్రకటించింది. ఆగస్టు 31 డెడ్ లైన్ కన్నా ముందు గానే తరలింపు ప్రక్రియను పూర్తి చేయాలనే ఆలోచనలో ఉంది. మరో ఉగ్రదాడికి అవకాశం ఉండటంతో అమెరికా వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేసే పనిలో నిమగ్నమైంది.












Click it and Unblock the Notifications