డెల్టా తరహాలో కొవిడ్ కొత్త వేరియంట్.. పరిశోధకుల వార్నింగ్
కరోనా మరోసారి మానవాళిపై విరుచుకుపడబోతోంది. డెల్టా వేరియంట్ కానీ మరో వేరియంట్ కానీ ఇందుకు కారణం కావచ్చని ఇజ్రాయెల్ పరిశోధకులు హెచ్చరించారు. ఇజ్రాయెల్ లోని బెన్ గురియన్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు మురుగునీటిని సేకరించి పరిశోధనలు చేయగా డెల్టా, ఒమిక్రాన్ మధ్య పరస్పర చర్యలు జరుగుతున్నట్లు గుర్తించారు.
ఈసారి కరోనా విజృంభణకు డెల్టా వేరియంట్ కానీ కొత్త వేరియంట్ కారణం కావచ్చన్నారు. డెల్టా వేరియంట్ అంతకుముందున్న వైరస్ రకాలను తుడిచేసి బలంగా మారినప్పటికీ తర్వాత వచ్చిన ఒమిక్రాన్ డెల్టాను ఏమీ చేయలేకపోయిందన్నారు. ఒమిక్రాన్ కానీ, దాని ఉప వేరియంట్లుకానీ వాటంతటవే తెరమరుగవుతాయని, డెల్టా మాత్రం అంతర్గతంగా తన వ్యాప్తిని కొనసాగిస్తూ మరింత బలం చేకూర్చుకునే అవకాశం ఉందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. బలంగా ఉండే డెల్టా వైరస్ లాంటివి అంతకుముందున్న వైరస్ ల కంటే సమర్థవంతంగా మారి తమ ప్రభావాన్ని చూపిస్తాయన్నారు. దీన్నిబట్టి మరోసారి కొవిడ్ ఉధృతి తప్పదని హెచ్చరించారు.
మరోవైపు దేశంలో కరోనా కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3275 మందికి పాజిటివ్ గా తేలింది. తాజాగా పాటియాలాలోని రాజీవ్ గాంధీ లా యూనివర్శిటీలో 60 మంది విద్యార్థులకు పాజిటివ్ గా తేలడంతో అక్కడ కంటైన్మెంట్ జోన్ ప్రకటించారు. బాధితుల్లో స్వల్ప లక్షణాలు కనిపించాయని, వారిని ఐసోలేషన్ లో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు చెన్నై ఐఐటీ క్యాంపస్ లో విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో గత మూడురోజులుగా ఈ యూనివర్సిటీలో వైరస్ బారినపడ్డ విద్యార్థుల సంఖ్య 170కి చేరింది.
వైరస్ కట్టడికి భారత ప్రభుత్వం ప్రారంభించిన టీకా పంపిణీ కార్యక్రమంలో భాగంగా 189 కోట్ల మందికి టీకా డోసుల పంపిణీ జరిగింది. ఒక్క బుధవారం రోజే దేశవ్యాప్తంగా దాదాపు 14 లక్షల మందికి టీకా వేయించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖాధికారులు వెల్లడించారు.