రావణరాజ్యంలో నరమేథం! 156 మంది బలి: మృతుల సంఖ్య అంతకంతకూ..!
కొలంబో: రావణరాజ్యం శ్రీలంక అట్టుడికిపోతోంది. అల్లకల్లోలంగా మారింది. క్రైస్తవ ప్రార్థనా సంస్థలు, హోటళ్లను లక్ష్యంగా చేసుకుని యథేచ్ఛగా సాగిన బాంబు దాడులు యావత్ ప్రపం్చాన్ని నివ్వెరగొలిపేలా చేశాయి. జీసస్ పునరుజ్జీవితుడౌతాడనే భావించే ఈస్టర్ సండే నాడు శ్రీలంకలో జరిగిన ప్రత్యేక కార్యక్రమాలకు తిలకించడానికి ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన పర్యాటకులే టార్గెట్ గా ఈ పేలుళ్లకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్దారించాయి ఆ దేశ భద్రతా బలగాలు. రాజధాని కొలంబోలని సెయింట్ ఆంథోని చర్చి, పశ్చిమ తీర ప్రాంతంలో ఉన్న నెగొంబోలని సెయింట్ సెబాస్టియన్ చర్చి, తూర్పు తీర ప్రాంతంలోని బట్టికలోవాలోని స్థానిక చర్చిలపై బాంబు పేలుడు సృష్టించారు. ఒక్క కొలంబో చర్చిలోనే 42 మందికి పైగా భక్తులు మృత్యువాత పడ్డారు. బట్టికలోవా చర్చిలో మరో 10 మంది దుర్మరణం పాలైనట్లు ప్రాథమికంగా అందిన సమాచారం. ఈ మూడు చర్చిలతో పాటు షాంగ్రిలా, సిన్నామన్ గ్రాండ్, కింగ్స్ బరి హోటళ్లపై బాంబుదాడులు చోటు చేసుకున్నాయి.
బౌద్ధదేశం..భీతావహం!
శ్రీలంకలో చోటు చేసుకున్న పేలుళ్ల సందర్భంగా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆరంభంలో 24 మంది మృతిచెందగా.. కొన్ని నిమిషాల వ్యవధిలో ఈ సంఖ్య 52కు చేరుకుంది. మరో రెండు గంటల వ్యవధిలో మృతుల సంఖ్య 156 కి చేరింది. 500 మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్షతగాత్రుల సంఖ్య వందల్లో ఉండటం వల్ల సరైన వైద్య చికిత్స దొరకట్లేదు. కొలంబో, బట్టికలోవాల్లోని అన్ని ఆసుపత్రులు, చివరికి స్థానిక క్లినిక్ లు కూడా గాయపడ్డ వారితో నిండిపోయాయి. చర్చిల్లో తెగిపడ్డ శరీర భాగాలు, ఛిద్రమైన మృతదేహాలతో అల్లకల్లోలంగా తయారైంది అక్కడి పరిస్థితి. క్షతగాత్రులు, వారి బంధుమిత్రుల రోదనలతో శ్రీలంకలో భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. అంబులెన్స్ ల సైరన్ లతో స్థానిక ప్రాంతాలన్నీ మారుమోగిపోతున్నాయి.
టార్గెట్..టూరిస్ట్!
శ్రీలంకలో ఇంత పెద్ద ఎత్తున మారణకాండ చోటు చేసుకోవడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. శ్రీలంకలో ప్రత్యేక దేశం కోసం లిబరేషన్ ఆఫ్ తమిళ టైగర్స్ ఈలం (ఎల్టీటీఈ) సాగించిన యుద్ధంలో వందలాది మంది హతమయ్యారు. అది గతం. తాజాగా చోటు చేసుకున్న మారణ హోమం వెనుక ఇస్లామిక్ ఉగ్రవాదం ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. శ్రీలంకపై ఇస్లామిక్ ఉగ్రవాదం విరుచుకుని పడిన ఘటనలు ఆ దేశంలో ఎప్పుడూ చోటు చేసుకోలేదు. ఈ సారి ఈస్టర్ సండేను దృష్టిలో పెట్టుకుని నరమేథాన్ని సృష్టించడం పట్ల ప్రపంచ దేశాలు ఆందోళనకు గురి అవుతున్నాయి. ఈస్టర్ సండే నాడు ఆ దేశంలో జరిగే కొన్ని ప్రత్యేక కార్యక్రమాలకు హాజరయ్యే విదేశీ పర్యటకులను టార్గెట్ గా చేసుకున్నారని అక్కడి పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. దాడుల తీరుతెన్నులు, ఉగ్రవాదులు ఎంచుకున్న ప్రదేశాలు ఇదే విషయాన్ని సూచిస్తున్నాయి.
ఈస్టర్ నాడు ఆరు ప్రార్ధనా స్థలాల్లో బాంబుపేలుళ్లతో దద్దరిల్లిన కొలంబో ..450 మందికి గాయాలు
రక్తమోడుతున్న బౌద్ధ దేశం..
శ్రీలంక- ప్రధానంగా బౌద్ధమతాన్ని అనుసరించే దేశం. సింహళీయుల్లో అధిక శాతం జనాభా బౌద్ధిజాన్ని అనుసరిస్తుంటారు. శాంతికాముకుడు గౌతమ బుద్ధుడు సూచించిన అహింసా మార్గంలో నడిచే దేశంగా శ్రీలంకకు ప్రపంచ దేశాల్లో గుర్తింపు ఉంది. అందుకే- లంకేయుల పేర్లల్లో భారతీయ తత్వం కనిపిస్తుంటుంది. కొంతకాలంగా అక్కడి సామాజిక పరిస్థితులు మార్పులు చోటు చేసుకుంటున్నాయని, ఇటీవలి కాలంలో- అక్కడ క్రైస్తవం విస్తృతమైందని అంతర్జాతీయ స్థాయి విశ్లేషకులు చెబుతున్నారు. సింహభాగం సింహళీయులు క్రైస్తవాన్ని స్వీకరిస్తున్నారు. శ్రీలంకలో నివసించే సంప్రదాయ ముస్లింలు కూడా క్రైస్తవాన్ని స్వీకరిస్తున్నారంటూ ఇదివరకు వార్తలొచ్చాయి. ఈ మత మార్పిడి వ్యవహారం ఇస్లాం ఉగ్రవాదం ఆగ్రహానికి కారణమై ఉండొచ్చంటూ అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈస్టర్ సండేను ఇస్లామిక్ ఉగ్రవాదం టార్గెట్ గా చేసుకోవడం వెనుక ప్రధాన కారణం మత మార్పిడులే అయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.