కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామన్న ఆస్ట్రేలియా ప్రధాని - ఆక్స్ఫర్డ్తో ఒప్పందాలు
ప్రపంచవ్యాప్తంగా కరోనా ఇన్ఫెక్షన్ల సంఖ్య 2.2కోట్లు దాటింది. మరణాల సంఖ్య 8లక్షలకు చేరువైంది. వ్యాక్సిన్ కోసం ఇప్పటికే భారత్ సహా అరడజను దేశాలు తీవ్రంగా శ్రమిస్తుండగా.. తాజాగా ఆస్ట్రేలియా కూడా ఆ జాబితాలో చేరింది. అయితే మిగతా దేశాలకు భిన్నంగా తాము రూపొందించే వ్యాక్సిన్ ను దేశ ప్రజలందరికీ ఉచితంగా అందిస్తామని ఆసీస్ ప్రధాని స్కాట్ మారిసన్ ప్రకటించారు.
ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనికా కలిసి తయారు చేస్తున్న వ్యాక్సిన్ నే ఆస్ట్రేలియా సైతం అడాప్ట్ చేసుకోనుంది. ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ను భారత్ లో సీరం సంస్థ ఉత్పత్తి చేయనుండటం తెలిసిందే. ఆస్ట్రేలియాలో వ్యాక్సిన్ తయారీ, పంపిణీకి సంబంధించి మంగళవారం ఒప్పందాలు కుదిరాయని ప్రధాని మారిసన్ తెలిపారు.
ఆస్ట్రేలియా జనాభా 2.5కోట్లుకాగా, ఇప్పటిదాకా 23,773 పాజిటివ్ కేసులు, 438 మరణాలు నమోదయ్యాయి. అందులో 14,929 మంది వ్యాది నుంచి కోలుకున్నారు. కరోనాకు విరుగుడుగా రష్యా స్పుత్నిక్-వీ పేరుతో ఇప్పటికే వ్యాక్సిన్ ను లాంచ్ చేసినప్పటికీ దానిని స్వీకరించేందుకు ఆస్ట్రేలియా సుముఖత చూపలేదు. మొదటి నుంచీ మంచి ఫలితాలు రాబడుతోన్న ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ వైవే మొగ్గుచూపింది.