భారత్-పాక్ ప్రత్యక్ష చర్చలు: బాన్ కీ మూన్
న్యూయార్క్: భారత్- పాకిస్థాన్ ప్రత్యక్ష చర్చలకు రావాల్సిందిగా ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ కోరారు. ఇరు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితులను ప్రత్యక్ష చర్చల ద్వార పరిష్కరించుకోవాలని చెప్పారు.
తాము ప్రపంచంలోని అన్ని దేశాలను చాల క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, అన్ని మార్పులను గమనిస్తున్నామని గుర్తు చేశారు. పరిస్థితులు చెయ్యిదాటే వరకు ఉండకూడదని సూచించారు. భారత్, పాక్ దేశాలు అణ్వాయుధ సామర్థ్యం కలిగిన దేశాలు అన్నారు.
ఇరు దేశాల నాయకులు, అధికారులు వెంటనే చర్చలు మొదలు పెట్టాలని బాన్ కీ మూన్ చెప్పారని ఆయన అధికార ప్రతినిధి స్పెపానే దుజార్రిక్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆగస్టు 23, 24వ తేదీలలో భారత్, పాక్ చర్చలు జరపడానికి ఢిల్లీలో ఏర్పాట్లు చేశారు.
అయితే ఆ చర్చలు అనూహ్యంగా రద్దుకావడంపట్ల బాన్ కీ మూన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని ఆయన అన్నారు. ఇరు దేశాల సరిహద్దులలో పదే పదే కాల్పులు జరగడం వలన సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని తమ దృష్టికి వస్తున్నదని బాన్ కీ మూన్ చెప్పారని ఆయన అధికార ప్రతినిధి తెలిపారు.