పిక్నిక్ అని చెప్పి.. ఐఎస్ఐఎస్లో చేరేందుకు వెళ్లిన యువతులు
లండన్: వందలాది మంది ప్రాణాలను తీస్తూ ఇరాక్, సిరియాలలో మారణహోమం సృష్టిస్తున్న ఐఎస్ఐఎస్ పట్ల ఆకర్షితులవుతున్న యువత సంఖ్య రోజుకు రోజుకు పెరుగుతోంది. తాజాగా లండన్కు చెందిన ముగ్గురు పాఠశాల విద్యార్థినులు ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్లో చేరేందుకు దేశం విడిచి వెళ్లారని బ్రిటన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
లండన్ నుంచి కదీజా సుల్తానా(16), షమీమా బేగం(15), మరో గుర్తు తెలియని (15) సంవత్సరాల అమ్మాయి దేశం వీడారని తెలిపింది. ఫిబ్రవరి 17న తాము పిక్నిక్ వెళ్తున్నామని చెప్పి, వీరు వారివారి ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత గాత్విక్ ఎయిర్ పోర్ట్ సిసిటీవీ కెమెరాల్లో వీరు ఇస్తాంబుల్ విమానం ఎక్కినట్లు తెలిసింది.
కాగా, ఉగ్రవాద సంస్థలో చేరేందుకు యువత ఆసక్తి చూపడం పట్ల బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామోరూన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు అరికట్టేందుకు బ్రిటన్లోని ముస్లిం సంఘాలు కల్పించుకోవాలని ఆయన కోరారు. ఈ ముగ్గురు యువతులను తిరిగి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
2014 ఆరంభం నుంచి కనీసం 3వేల మందికి పైగా ఇరాక్, సిరియాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఐఎస్ఐఎస్లో చేరుతున్న మహిళలు యుద్ధం పట్ల ఆకర్షితులై వెళ్తున్నారని, అలా కుదరకుంటే, జీహాదీలకు భార్యలుగా వుండిపోతున్నారని అధికారులు తెలిపారు.