వ్యాక్సిన్ వేసుకుంటే కళ్లు చెదిరే ప్రైజ్ మనీ-కాలిఫోర్నియా బంపర్ ఆఫర్-ప్రపంచవ్యాప్తంగా ఇదే ట్రెండ్
అమెరికాలోని కాలిఫోర్నియాలో మాస్ వ్యాక్సినేషన్ను పెంచేందుకు అక్కడి గవర్నర్ గెవిన్ న్యూసొమ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజలను వ్యాక్సినేషన్ వైపు ఆకర్షించేందుకు 'లాటరీ' విధానాన్ని ఈ ప్రక్రియకు లింక్ చేశారు.దీని ప్రకారం వ్యాక్సిన్ తీసుకున్నవారు లాటరీలో పాల్గొనేందుకు అర్హులు. 'వ్యాక్స్ ఫర్ ది విన్' పేరుతో నిర్వహిస్తున్న ఈ లాటరీ ద్వారా విజేతలకు 116.5 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీని అందించనున్నారు. ఒక్క కాలిఫోర్నియా మాత్రమే కాదు అమెరికాలోని చాలా రాష్ట్రాలతో పాటు పలు దేశాలు కూడా ఇదే ట్రెండ్ను ఫాలో అవుతున్నాయి.
ప్రైజ్ మనీ ఇలా...
వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నవారిలో 10 మందికి 1.5మిలియన్ డాలర్లు చొప్పున,30 మందికి 50వేల డాలర్లు చొప్పున,మరో 20 లక్షల మందికి 50 డాలర్ల చొప్పున లాటరీ ద్వారా గిఫ్ట్ కార్డులు అందించనున్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా కాలిఫోర్నియాను వీలైనంత త్వరగా కరోనా బారి నుంచి బయట పడేసేందుకే ఈ లాటరీ విధానాన్ని తీసుకొచ్చినట్లు గవర్నర్ గెవిన్ తెలిపారు. ఇప్పటికే కాలిఫోర్నియాలో 46శాతం మంది కరోనా మొదటి డోసు తీసుకున్నారు. 42 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు. మొదటి డోసు,రెండు డోసు... ఈ రెండింటిలోనూ కాలిఫోర్నియా సగటు జాతీయ సగటుకు పైనే ఉంది.
ఇతర రాష్ట్రాల్లోనూ... స్కాలర్షిప్స్,ఫ్రీ ఫుడ్...
కాలిఫోర్నియా ఒక్క రాష్ట్రమే కాదు అంతకుముందు ఒహియా,కొలరాడో,ఒరెగాన్ తదితర రాష్ట్రాల్లోనూ ఇలాంటి లాటరీ విధానాన్ని తీసుకొచ్చారు. కొలరాడో,ఒరెగాన్,ఒహియా రాష్ట్రాల్లో లో 1 మిలియన్ డాలర్ లాటరీ ప్రైజ్ మనీగా ప్రకటించారు. న్యూయార్క్ లాంటి రాష్ట్రాల్లో వ్యాక్సిన్ వేసుకునే విద్యార్థులకు పబ్లిక్ యూనివర్సిటీల్లో స్కాలర్షిప్స్ ఇస్తామని ఆఫర్ చేస్తున్నారు.కొన్నిచోట్ల రెస్టారెంట్లు,బార్లు వ్యాక్సిన్ వేసుకున్నవారికి ఉచిత భోజనం,మద్యం ఆఫర్ చేస్తున్నాయి. ఇలాంటి చర్యల ద్వారా ప్రజలు వ్యాక్సినేషన్కు మొగ్గుచూపుతారని అక్కడి అధికారులు భావిస్తున్నారు.
Recommended Video
భారత్లో రూ.5వేలు నగదు ప్రోత్సాహకం
కోవిడ్ నేపథ్యంలో ప్రపంచంలో మొదటిసారిగా సెర్బియా దేశం వ్యాక్సిన్ తీసుకున్నవారికి నగదు ప్రోత్సాహకం అందించాలని నిర్ణయించింది. వ్యాక్సిన్ తీసుకున్న ఒక్కొక్కరికి 3వేల దినార్లు (రూ.2258) ఇస్తామని ప్రకటించింది.ఆ తర్వాత చాలా దేశాలు నగదు ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయం తీసుకున్నాయి. భారత్లోనూ కేంద్ర ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. వ్యాక్సిన్ తీసుకున్నవారు.. ఆ ఫోటోలకు చక్కని ట్యాగ్ లైన్ రాసి పంపిస్తే... అందులో బెస్ట్ ట్యాగ్ లైన్ ఇచ్చిన 10 మందిని ఎంపిక చేసి రూ.5వేలు నగదు ప్రోత్సాహకం అందిస్తామని స్పష్టం చేసింది. అయితే ఇలాంటి నగదు ప్రోత్సాహకాలపై నిపుణుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో రిస్క్ ఉండటం వల్లే నగదు ప్రోత్సహకాలు ఇస్తున్నారని ప్రజలు పొరబడే ప్రమాదం ఉందంటున్నారు.