అగ్రరాజ్యాన్ని వెనక్కి నెట్టిన డ్రాగన్.. భారత్, అమెరికాలకు 6G సవాల్!
సాంకేతిక ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు చైనా శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే 5జీలో అగ్రగామిగా ఉన్న ఆ దేశం ఇప్పుడు 6జీ నెట్వర్క్ లాంచ్ దిశగా ప్రపంచ దేశాల కంటే ఒక అడుగు ముందే ఉంది. తాజాగా 6జీ టెక్నాలజీ ట్రయల్స్లో చైనా మొదటి దశను విజయవంతంగా పూర్తి చేయడమే కాకుండా.. రెండో దశను కూడా ప్రారంభించింది.
300 కీలక సాంకేతికతలు సిద్ధం
చైనా పరిశ్రమ, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. 6జీ తొలి దశ ట్రయల్స్లో 300 కంటే ఎక్కువ కీలకమైన సాంకేతికతలను భద్రపరిచారు. ఈ విజయంతో దేశంలోని సమాచార, కమ్యూనికేషన్ రంగం మరింత బలోపేతం కానుంది. ప్రస్తుతం చైనా నిర్మించిన ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రపంచంలోనే అతిపెద్దది, అత్యంత ఆధునికమైనది. 5G బేస్ స్టేషన్లు 4.838 మిలియన్లు(48 లక్షలకు పైగా) ఉన్నాయి. 5G వినియోగదారులు 1.2 బిలియన్లు (120 కోట్లు) దాటారు. 5Gకి సంబంధించిన ప్రపంచస్థాయి పేటెంట్లలో 42 శాతం వాటా చైనాదే కావడం గమనార్హం.

రెండో దశపై దృష్టి
మొదటి దశ విజయవంతం కావడంతో రెండో దశ సాంకేతిక పరీక్షలను చైనా ప్రభుత్వం ప్రారంభించింది. కేవలం నెట్వర్క్ వేగం మాత్రమే కాకుండా, అప్లికేషన్ ఆధారిత 'ఇండస్ట్రీ ఎకోసిస్టమ్'ను నిర్మించడంపై మంత్రిత్వ శాఖ దృష్టి సారించింది. అంటే పరిశ్రమల్లో 6G వినియోగాన్ని సులభతరం చేసేలా పరిశోధనలను వేగవంతం చేయనున్నారు.
అమెరికా, భారత్ పరిస్థితి ఏంటి?
చైనా దూకుడు చూస్తుంటే అమెరికా, భారత్ వంటి దేశాల కంటే ముందే 6జీని అందుబాటులోకి తెచ్చేలా కనిపిస్తోంది. భారత్, అమెరికా దేశాల్లో కూడా 6జీపై ముమ్మరంగా పరిశోధనలు జరుగుతున్నాయి. సాధారణంగా 6G నెట్వర్క్ 2030 నాటికి వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని నిపుణులు భావిస్తున్నారు. కానీ చైనా ప్రయత్నాలు చూస్తుంటే అంతకంటే ముందే ఆ దేశం 6Gని ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం ఉంది.
డేటా వేగంలో విప్లవం రాబోతోంది. 6G అందుబాటులోకి వస్తే ఇంటర్నెట్ వేగం ఊహించని రీతిలో ఉంటుంది. ఈ సాంకేతిక యుద్ధంలో అగ్రరాజ్యం అమెరికాను చైనా నిజంగానే వెనక్కి నెడుతుందా అనేది వేచి చూడాలి.












Click it and Unblock the Notifications