చైనా కుటిలబుద్ధి: సాయం చేస్తామంటూనే భారత్కు కార్గో విమానాల రద్దు, ఆక్సిజన్ ధరల పెంపు
బీజింగ్: చైనా మరోసారి తన కుటిలబుద్ధిని చాటుకుంది. కరోనా మహమ్మారిపై పోరాటంలో భారత్కు సహాయ, సహకారాలు అందిస్తామని చెబుతున్నా.. చైనా పనులు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. భారతదేశానికి చైనా నుంచి ఆక్సిజన్, ఔషధాలు సరఫరా కాకుండా అడ్డుకుంది.
చైనా ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే సిచువాన్ ఎయిర్లైన్స్ సంస్థ భారత్కు 15 రోజులపాటు కార్గో విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో చైనా నుంచి భారత్కు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, వైద్య పరికరాలు చేరవేయడం ప్రైవేటు రవాణాదారులకు కష్టంగా మారింది.
అంతేగాకుండా చైనాలోని ఆక్సిజన్ తయారీదారులు.. వాటి ధరలను 35-40 శాతం పెంచారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సరుకు రవాణా ఛార్జీలనూ చైనా ప్రభుత్వం 20 శాతానికి పెంచిందని సినో గ్లోబల్ లాజిస్టిక్స్కు చెందిన సిద్ధార్థ్ సిన్హా తెలిపారు.
సిచువాన్ ఎయిర్లైన్స్ కార్గో విమానాల రద్దుతో భారత్కు ఆక్సిజన్ ను సరఫరా చేయడం సవాలుగా మారిందని చెప్పారు. సింగపూర్ లేదా ఇతర దేశాల మీదుగా వేరే ఎయిర్ లైన్స్ ద్వారా భారత్ కు రవాణా చేయాల్సి వస్తుందని, దీని వల్ల చాలా ఆలస్యమవుతుందని తెలిపారు.
Recommended Video
ఇది ఇలావుంటే, శ్రీలంకలోని చైనా రాయబార కార్యాలయం ఇందుకు భిన్నంగా ప్రకటన చేయడం గమనార్హం. హాంకాంగ్ నుంచి ఢిల్లీకి సోమవారం 800 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు విమానంలో పంపామని, మరో వారంలో 10 వేల కాన్సంట్రేటర్లు చేరుకుంటాయని తెలిపింది. కాగా, మరోసారి భారత్కు అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తామంటూ చైనా తాజాగా ప్రకటించడం గమనార్హం.