చైనా అధ్యక్షుడి విమానం స్పెషాలిటీస్: ఎయిర్ ఫోర్స్ వన్ కూడా దిగదుడుపే
అమెరికా, చైనా, రష్యా వంటి వివిధ దేశాల అధినేతలు విదేశీ పర్యటనలు చేసే సమయంలో ఉపయోగించే ప్రత్యేక విమానాలు ఎప్పుడూ చర్చనీయాంశమౌతూనే ఉంటాయి. జనం నోళ్లల్లో నానుతూనే ఉంటాయి. ఓ సాధారణ పౌర విమానం కంటే అత్యాధునిక ఉంటాయవి. ఎటువంటి సంక్లిష్టమైన పరిస్థితుల్లో రక్షణ వ్యూహాలను పర్యవేక్షించేలా ఇవి అధునాతన మొబైల్ మిలిటరీ కమాండ్ కేంద్రాలుగా పనిచేస్తాయి.
తాజాగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్.. భారత్ కు రావడానికి ఉపయోగించే ప్రత్యేక విమానానికి సంబంధించి అనేక భిన్న కథనాలు వెల్లువెత్తుతోన్నాయి. ఈ విమానం బోయింగ్ 787-8 మోడల్. ఎయిర్ చైనా ఆధ్వర్యంలో నడిచే అత్యాధునిక విమానం అది. బీ-2479 అనే ప్రత్యేక రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుంది దీనికి. 2014 లో ఎయిర్ చైనా సంస్థ ఆధీనంలోకి వచ్చింది. 2016 నాటికి జిన్ పింగ్ అధికారిక విదేశీ ప్రయాణ అవసరాలకు అనువుగా ఇందులో మార్పులు చేర్పులు చేశారు.

బయటి నుంచి చూస్తే సాధారణ ప్రయాణికుల విమానం లాగే కనిపించే ఈ బోయింగ్ 747-8 లోపలి అమరికలు మాత్రం విస్మయం కలిగిస్తాయి. చైనా అధ్యక్షుడి కోసం ఇందులో అధునాతన సదుపాయాలతో కూడిన ఆఫీస్, మంత్రులు, సైనిక అధికారులతో అత్యవసర సమీక్షలు నిర్వహించడానికి వీలుగా ఓ కాన్ఫరెన్స్ హాల్, పర్సనల్ బెడ్రూమ్ వంటి సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. శత్రువుల కళ్లు గప్పే యాంటీ రాడార్ సిస్టమ్ ఈ విమానం ప్రత్యేకత.
ఈ విమానం మొత్తం పొడవు సుమారు 76 మీటర్లు. రెక్కల వెడల్పు దాదాపు 68 మీటర్లుగా ఉంటుంది. బరువు 4,47,700 కిలోలు. జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ రూపొందించిన జీఈఎన్ఎక్స్-2బీ 67 రకానికి చెందిన నాలుగు శక్తివంతమైన ఇంజన్లను ఇందులో అమర్చారు. గగనతలంలో అమితవేగంతో ప్రయాణిస్తోన్న సమయంలో కూడా ఏ మాత్రం కుదుపులకు గురికాని విధంగా విమానాన్ని అద్భుతంగా కంట్రోల్ చేయగలవు ఈ ఇంజిన్లు.
ఒకసారి పూర్తిగా ఇంధనం నింపిన తర్వాత ఈ విమానం నిరంతరాయంగా దాదాపు 14,000 కిలోమీటర్ల దూరం నాన్స్టాప్గా ప్రయాణించగలదు. దీనివల్ల షీ జిన్పింగ్ సుదూర ఖండాంతర ప్రాంతాలకు ప్రయాణించినా ఎక్కడా మధ్యలో ఇంధనం కోసం ఆగాల్సిన అవసరం రాదు. అధ్యక్షుడు ఆమోదం తెలిపిన అధికారులు, భద్రతా సిబ్బంది, పరిమిత సంఖ్యలో టెక్నికల్ టీమ్ కు మాత్రమే లోపలికి అనుమతి ఉంటుంది.
సురక్షిత ప్రయాణం కోసం అత్యాధునిక ఏవియానిక్స్ కమాండ్ ప్యానెల్ కలిగిన ఈ విమానంలో శత్రు దేశాలు, ఉగ్రవాదుల క్షిపణి దాడుల నుంచి రక్షించుకోవడానికి మిలిటరీ స్థాయి మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ పొందుపరిచారు. విమానం వైపు దూసుకొచ్చే ఎలాంటి క్షిపణినైనా అల్లంత దూరంలోనే గుర్తించడం, వాటిని అప్పటికప్పుడు నిర్వీర్యం చేసే టెక్నాలజీ ఇందులో ఉంటుంది. రేడియో ధార్మికత, అణు విస్ఫోటనం సంభవించినప్పుడు వెలువడే విద్యుదయస్కాంత కిరణాల నుంచి కాపాడే ప్రత్యేక రక్షణ కవచం దీని సొంతం.
అమెరికా అధ్యక్షుడి విమానం ఎయిర్ ఫోర్స్ వన్తో పోల్చినప్పుడు చైనా అనుసరించే విధానాలు కొంత భిన్నంగా కనిపిస్తాయి. ఎయిర్ ఫోర్స్ వన్ బోయింగ్ 747-200బీ, వీసీ-25ఏ విమానాల్లో వైట్ హౌస్ ఓవల్ తరహా ఆఫీస్, అధునాతన శాటిలైట్ కమ్యూనికేషన్స్ ఏర్పాట్లు ఉంటాయి. ఇటువంటి సౌకర్యాలతో విమానం తయారవుతుంది. రక్షణ పరంగా అత్యంత దుర్భేద్యమైన వ్యవస్థలు కలిగిన ఎయిర్ ఫోర్స్ వన్ విమానానికి గగనతలంలోనే ఇంధనం నింపే ప్రత్యేక సదుపాయం ఉంటుంది. రక్షణ శాఖ పర్యవేక్షణలో ఉంటుందీ ఫ్లైట్.
చైనా ఇందుకు భిన్నం. తమ దేశాధినేత కోసం సాధారణ ఎయిర్ చైనా విమానాన్నే వినియోగిస్తారు. ప్రత్యేకంగా తయారు చేయించరు. ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చిన తర్వాత అధ్యక్షుడి అవసరాలకు అనుగుణంగా ఇందులో మార్పులు చేర్పులు చేస్తారు. దీని వల్ల నిర్వహణ వ్యయాన్ని తగ్గడంతో పాటు భద్రతా పరంగా తమకు అనుకూల వ్యవస్థలను ఇందులో అమర్చుకోవడానికి వీలు ఉంటుంది.
గతంలో తమ దేశాధినేతల కోసం విదేశాల నుండి కొనుగోలు చేసిన విమానాలలో కొన్ని చిప్స్, రహస్యంగా డేటా నిల్వ చేసే మైక్రోఫోన్లు వంటి గూఢచర్య వస్తువులు బయటపడిన సంఘటనల ఆధారంగా చైనా ఈ నిర్ణయం తీసుకుంది. సాధారణ విమానానికి మార్పులు చేర్పులు చేస్తుంది. సొంతంగా తమకు తామే ఈ విమానంలో మార్పులు చేసుకోవాల్సి రావడం వల్ల భద్రతపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవని చైనా నమ్ముతోంది.














Click it and Unblock the Notifications
