ట్రంప్ గారాలపట్టి ఇవాంకా చెలికత్తెకు కరోనా పాజిటివ్..!వైట్హౌస్లో ఉత్కంఠ పరిస్థితులు..!
వాషింగ్లన్/హైదరాబాద్ : అగ్రరాజ్య అధికారిక నివాసం ఉలిక్కి పడింది. ఈదేశం ఆదేశం, ఇక్కడ అక్కడ అనే భేదం లేకుండా కరోనా మొత్తం మడతెట్టేస్తోంది. అందులో భాగంగానే అమెరికాలో కరోనా వీరవిహారం చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ చెలికత్తె, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ప్రెస్ సెక్రటరీ, కార్యాలయ అధికార ప్రతినిధి కేటీ మిల్లర్కు కరోనా వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు అధికారులు తెలిపారు.
ఇవాంకా సహాయకురాలు గత కొన్ని వారాలుగా ఇంటి నుంచే వర్క్ చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలడంతో, ఇవాంక, ఆమె భర్త జరేడ్ కుష్నర్కు టెస్టులు నిర్వహించారు. ఈ ఫలితాల్లో నెగెటివ్ వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఇవాంకా చెలికత్తె దాదాపు రెండు నెలల నుంచి టెలీవర్కింగ్ ద్వారా అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ప్రకటన విడుదల చేశారు వైట్హౌస్ అధికారులు.
ఇదిలా ఉండగా అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ మీడియా ప్రతినిధిగా వ్యవహరిస్తున్న కేటీ మిల్లర్ అనే ఉద్యోగిణికి కూడా కరోనా సోకింది. ఈమె ట్రంప్ ముఖ్య ఉద్యోగి స్టీఫెన్ మిల్లర్కు భార్య. తాజా ఘటనతో శ్వేతసౌధంలో కరోనా బాధితుల సంఖ్య మూడుకి చేరింది. వైట్హౌస్లో నిర్వహించిన అనేక కీలక సమావేశాల్లో విధి నిర్వహణలో భాగంగా కేటీ మిల్లర్ పాల్గొన్నారు.
గురువారం కూడా ఆమె పాల్గొన్న ఒక బహిరంగ ప్రార్ధనా సమావేశంలో, ట్రంప్ సతీమణి మెలానియా, ఉపాధ్యక్షుడి భార్య సహా పదుల సంఖ్యలో ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ నేపథ్యంలో మెలానియా ట్రంప్, పెన్స్లకు కరోనా నిర్ధారణ టెస్టులు చెయ్యగా, వారికీ నెగిటివ్ అని తేలింది. ఇకనుంచి వీరిరువురికి ప్రతిరోజూ కరోనా టెస్టులు చేయనున్నట్టు అధికారులు చెప్తున్నారు. అధ్యక్షుడు ట్రంప్ విషయంలో అన్ని జాగ్రత్త చర్యలు తప్పనిసరిగా తీసుకుంటున్నామని వైట్హౌస్ అధికారులు వివరించారు.