కరోనావైరస్: కేరళలో ఐదేళ్ల చిన్నారి – ఆస్ట్రేలియాలో తల్లిదండ్రులు... ప్రయాణాలపై ఆంక్షలతో భారత్లో చిక్కుకున్న పిల్లలు
2019 నవంబరు నుంచి నా కూతురు భారత్లోనే ఉండిపోయింది. తనను విడిచి ఇన్ని రోజులు ఎప్పుడూ ఉండలేదు. - ఉద్వేగంతో తండ్రి దిలిన్ చెప్పిన మాటలివి.
అయిదేళ్ల జొహానా కోవిడ్ మహమ్మారి కారణంగా భారత్లో చిక్కుకుపోయిన 173 మంది పిల్లల్లో ఒకరు. ప్రస్తుతం జొహానా తన తాత, అమ్మమ్మలతో కలిసి ఉంటోంది.
జొహానా తల్లిదండ్రులు దృశ్య, దిలన్ ఆస్ట్రేలియాలో నివసిస్తున్నారు. ఆ పాపను ప్రభుత్వం ప్రత్యేకంగా నడిపిన విమానాల్లో సిడ్నీ తీసుకుని వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ తోడుగా వెళ్లడానికి ఎవరూ లేకపోవడంతో ఆ చిన్నారి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లడం కుదరలేదు. స్వదేశానికి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక విమానాల్లో 14 సంవత్సరాల లోపు పిల్లలను ఒంటరిగా అనుమతించరు. భారత్, ఆస్ట్రేలియాల మధ్య విమానాలు నడిపే కాంటాస్ విమానయాన సంస్థ కూడా మైనర్లను ఒంటరిగా ప్రయాణించడానికి అనుమతించదు.
ప్రస్తుత పరిస్థితుల్లో దృశ్య, దిలిన్లు భారత్కు వచ్చి, తమ కుమార్తెను తీసుకుని సిడ్నీ రావడానికి అనుకూల పరిస్థితులు లేవు. ఎందుకంటే రెండు దేశాల మధ్య పరిమిత సంఖ్యలోనే ప్రత్యేక విమానాలు నడుపుతున్నారు.
"మా చిన్నారి ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. పాప మాపై బెంగ పెట్టుకుంది" అని ఆయన శుక్రవారం ఆస్ట్రేలియా సెనేట్ కమిటీకి చెప్పారు.
- ఆంధ్రప్రదేశ్ వేరియంట్ 1000 రెట్లు స్పీడా... అందుకే ఏపీ ప్రజలంటే ఇతర రాష్ట్రాలు భయపడుతున్నాయా
- లాక్డౌన్ విధించడం గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్గా ఆలోచించాలి - సుప్రీంకోర్ట్
ఇక జొహానా తల్లితండ్రులకు మిగిలిన ఏకైక మార్గం ఎయిర్ ఇండియా విమానం లేదా ఏదైనా ప్రైవేటు విమానంలో ఆ పాపను వెనక్కి రప్పించుకోవాలి.
జొహానా తల్లిదండ్రులు చివరకు బెంగళూరు నుంచి సిడ్నీ వెళ్లే ఓ ఛార్టర్డ్ విమానంలో ఓ టికెట్ సంపాదించగలిగారు.
ఈ విమానం మే 6న సిడ్నీ చేరాల్సి ఉంది. కానీ, భారత్లో పెరిగిన కోవిడ్ కేసుల నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించింది.
తమకు ఇదే చివరి ఆశగా ఉండేదని దిలిన్ బీబీసీకి చెప్పారు. "ఒక్కోసారి ఆశ కలుగుతుంది. ఆ వెంటనే ఇలాంటి నిర్ణయాలు మా ఆశలను కూల్చేస్తాయి. మేం చాలా కృంగిపోయాం" అని ఆయన చెప్పారు.
దృశ్య, దిలిన్ వారి కథను ఆస్ట్రేలియా సెనేట్ కమిటీకి వినిపించారు. భారత్లో చిక్కుకుని ఉండిపోయిన ఆస్ట్రేలియా పౌరులను వెనక్కి రప్పించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఈ కమిటీ పరిశీలిస్తోంది.
జొహానా రావల్సిన విమానంలో ఆ పాపతో పాటు మరో ఏడుగురు పిల్లలు ఉన్నారని దృశ్య ఈ కమిటీకి చెప్పారు.
ఈ దంపతులు తమ లాంటి సమస్యను ఎదుర్కొంటున్నవారితో సోషల్ మీడియాలో సంప్రదించారు. కొంత మంది జొహానా కంటే చిన్న వయసు పిల్లలు కూడా ఉన్నారు.
"అలాంటి పిల్లలందరినీ... ఎవరూ తోడు లేకపోయినా ప్రత్యేక విమానాల్లో కాని, ప్రైవేటు ఛార్టర్డ్ విమానాల్లో కాని వెనక్కి తీసుకుని రావాలని వారందరి తరపునా నేను అభ్యర్ధిస్తున్నాను" అని దిలిన్ అన్నారు.
- ఆంధ్రప్రదేశ్లో రెమ్డెసివిర్ బ్లాక్ మార్కెట్ విక్రయాలకు ప్రభుత్వమే కారణమా
- కరోనా సెకండ్ వేవ్: తెలంగాణలో మృతుల సంఖ్యలో తేడాలకు శ్మశానాలే సాక్ష్యాలా?
https://twitter.com/tegangeorge/status/1390553139607003137
కేవలం పిల్లల కోసమే విమానం పంపడం గురించి ఇంకా ఆలోచించలేదని సీనియర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ అండ్ ట్రేడ్ (డీఎఫ్ఏటీ) అధికారి లినెట్ వుడ్ చెప్పారు.
అయితే, ఆ పిల్లలను వెనక్కి తెచ్చేందుకు ఆ పిల్లల కుటుంబాలతో కలిసి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన చెప్పారు.
డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఎవరూ తోడు లేని 20 మంది మైనర్లను ఆస్ట్రేలియాకు తీసుకుని వచ్చినట్లు భారత్లో ఆస్ట్రేలియా హై కమిషనర్ బ్యారీ ఓ ఫారెల్ చెప్పారు.
దృశ్య, దిలన్ ఆస్ట్రేలియాకు వెళ్లక ముందు మలేసియాలో నివసించే వారు. మలేసియాలో ఉండగానే కేరళలో ఉండే తాతయ్య ఇంట్లో జొహానాను వదిలి వెళ్లారు.
ఆ తర్వాత కొన్ని నెలలకు వీరు మలేసియా నుంచి సిడ్నీ వెళ్లారు.
జొహానాను సిడ్నీ తీసుకుని వెళ్దామని అనుకునే లోపు గత ఏడాది భారత్లో కోవిడ్ వ్యాప్తి మొదలైంది. దీంతో అంతర్జాతీయ విమాన ప్రయాణాలను భారత్ రద్దు చేసింది.
దాంతో జొహానా భారత్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. జొహానా... మలేసియా వీసా కూడా గడువు దాటిపోయింది.
"జొహానా చాలా పెద్దదై ఉంటుంది. తనను మళ్లీ ఎప్పుడు చూస్తామో తెలియట్లేదు. మేం కోల్పోయిన సమయం తిరిగి రాదు" అని సెనేట్ కమిటీకి దిలిన్ చెప్పారు.
"మేం మా కూతురు బాల్యాన్ని దగ్గరగా చూసే అవకాశాన్ని కోల్పోయాం. ఇప్పటికే సంవత్సరం దాటింది" అంటూ ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ చెప్పారు.
దృశ్యకు తన కూతురు గుర్తొచ్చి నిద్ర పట్టక రాత్రంతా ఏడుస్తూనే ఉంటారు.
"మా అమ్మాయి పడుతున్న మానసిక బాధ మాకు అర్థమవుతుంది. పుస్తకాలు లాంటివి కొంటూ తనను సంతోషంగా ఉంచడానికి మేం ప్రయత్నిస్తున్నాం. కానీ, తల్లిదండ్రుల లోటును ఇంకేదీ తీర్చలేదు" అని దిలిన్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- భారత్ సాయం లేకుండా ప్రపంచ కోవిడ్ వ్యాక్సీన్ కల నెరవేరదు... ఎందుకంటే...
- తీరా కామత్: రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఈ పాపాయిని కాపాడుతుందా?
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- సెక్స్కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)