Coronavirus : చైనాలో 170కి పెరిగిన మృతుల సంఖ్య, 24గంటల్లో 38 మంది మృతి..
కరోనా వైరస్ చైనాలో మృత్యు ఘంటికలు మోగిస్తూనే ఉంది. గురువారం నాటికి కరోనా మృతుల సంఖ్య 178కి చేరింది. గురువారం ఒక్కరోజే దేశంలో 38 మంది కరోనా వైరస్ కారణంగా మృతి చెందినట్టు చైనా నిర్దారించింది. కరోనా వైరస్ మృతుల సంఖ్య ఒక్కరోజులోనే ఈ స్థాయిలో ఉండటం ఇదే అత్యధికం అని చెబుతున్నారు. వైరస్ను నియంత్రించే వ్యాక్సిన్ కోసం చైనాలో తీవ్ర ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ 21 దేశాలకు పాకింది. చాలా దేశాలు చైనా పర్యటనను రద్దు చేసుకోవాల్సిందిగా ఇప్పటికే తమ దేశస్తులకు సూచించాయి. బుధవారం నుంచి చాలావరకు ఎయిర్లైన్స్ చైనాకు తమ సర్వీసులను రద్దు చేసుకున్నాయి. గురువారం ఆ సంఖ్య మరింత పెరిగింది.
కరోనా వైరస్పై ప్రపంచం మొత్తం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) హెచ్చరించింది. కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు చైనా చేస్తోన్న ప్రయత్నాలను డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి డా.మైక్ ర్యాన్ ప్రశంసించారు. ఇక అటు అమెరికాలోనూ మొదటిసారి మనిషి నుంచి మనిషికి వ్యాప్తి చెందిన కరోనా వైరస్ కేసును గుర్తించామని సంబంధిత అధికారులు వెల్లడించారు. భార్య నుంచి అతనికి కరోనా వైరస్ సంక్రమించినట్టుగా చెప్పారు. 60 ఏళ్ల ఆ మహిళ ఇటీవలే చైనాలోని వుహాన్ పట్టణం నుంచి వచ్చినట్టు చెప్పారు.
ఇండియాలోనూ కేరళలో మొట్టమొదటి కరోనా వైరస్ కేసు బయటపడింది. చైనాలోని వుహాన్ పట్టణం నుంచి ఇటీవలే కేరళలోని త్రిసూర్కు తిరిగొచ్చిన ఓ విద్యార్థికి కరోనా వైరస్ సోకినట్టు వైద్యులు నిర్దారించారు. అయితే ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉందన్న,వైద్యులు.. ఎప్పటికప్పుడు అతని ఆరోగ్యాన్ని గమనిస్తున్నట్టు చెప్పారు.
కాగా,చైనాలోని వుహాన్ పట్టణంలో ఉన్న ఓ సీ ఫుడ్ మార్కెట్ నుంచి వైరస్ వ్యాప్తి చెందినట్టుగా అనుమానిస్తున్నారు. అయితే గబ్బిలాలు లేదా పాములు వంటి వాటి నుంచి ఈ వైరస్ వ్యాప్తి చెంది ఉండవచ్చునన్న కథనాలు కూడా వస్తున్నాయి. అంతేకాదు,కరోనా వైరస్ను సృష్టించింది చైనాయే అన్న కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. వుహాన్ పట్టణంలోని వైరాలజీ ల్యాబ్లో ఈ వైరస్ను బయో వెపన్గా వృద్ది చేస్తున్న క్రమంలో.. అది బయటకు లీకైనట్టుగా అనుమానిస్తున్నారు. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు కరోనా వైరస్ వ్యాప్తి చెందడం.. గ్లోబల్ మెడికల్ ఎమర్జెన్సీని తలపిస్తోంది.