ట్రంప్కు ఇండియా నుంచి వెయ్యి రాఖీలు: హర్యానా చెల్లెళ్లకు ఆయనే పెద్దన్నయ్య?
ఈ సంస్థ ఆధ్వర్యంలోనే ఇక్కడి బాలికలు, మహిళలు కలిసి 1001రాఖీలను ట్రంప్ కు పంపించారు.
హర్యానా: రాఖీ పండుగను పురస్కరించుకుని హర్యానాలోని ఓ గ్రామానికి చెందిన మహిళలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు రాఖీలు పంపించారు. అలాగే భారత ప్రధానమంత్రి మోడీని కూడా నేరుగా కలిసి రాఖీలు కట్టనున్నారు.
హర్యానాలోని వెనుకబడి ప్రాంతమైన మెవాట్ ప్రాంతంలోని మరోరా గ్రామ ప్రజలు తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈ గ్రామాన్ని సులభ్ స్వచ్చంద సంస్థ దత్తత తీసుకుంది. ఈ సంస్థ ఆధ్వర్యంలోనే ఇక్కడి బాలికలు, మహిళలు కలిసి 1001రాఖీలను ట్రంప్ కు పంపించారు.

కాగా, సులభ్ ఇంటర్నేషనల్ సంస్థ(ఎస్ఐఎస్ఎస్ఓ) అధినేత బిందేశ్వర్ పాఠక్ ఇటీవలే మరోరా గ్రామానికి ట్రంప్ విలేజ్ గా పేరు పెట్టారు. అయితే ఈ పేరు నిబంధనలకు విరుద్దమంటూ అధికారులు అభ్యంతరం తెలపడంతో.. ట్రంప్ విలేజ్ అన్న సూచిక బోర్డులను తొలగించారు.
పున్ హానా తహశీల్ పరిధిలోని ఈ గ్రామ జనాభా 1800లో ఎక్కువమంది ముస్లింలే. ట్రంప్, మోడీలను ఇక్కడి మహిళలు పెద్దన్నయ్యలుగా భావిస్తారని సులభ్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అందుకే మోడీ ఫోటోలతో 501రాఖీలను, ట్రంప్ ఫోటోలతో 1001రాఖీలను తయారుచేసి పంపిస్తున్నారని వివరించారు.
గ్రామానికి చెందిన కొంతమంది మహిళలు ప్రధానిని నేరుగా కలిసి రాఖీ కట్టేందుకు ఢిల్లీ బయలుదేరారు. ఇదిలా ఉంటే, ఈ గ్రామంలో 140ఇళ్లు ఉండగా.. అందులో కేవలం 45ఇళ్లకు మాత్రమే టాయిలెట్స్ ఉండేవి. కానీ సులభ్ సంస్థ ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్న తర్వాత మిగతా 95ఇళ్లకు కూడా టాయిలెట్లను నిర్మించి ఇచ్చారు. అలాగే పలు సంక్షేమ కార్యక్రమాలను కూడా ఈ సంస్థ అమలు చేస్తోంది.












Click it and Unblock the Notifications