చిన్న ద్వీప దేశంలో 7.0 తీవ్రతతో పెను భూకంపం - సునామీ వార్నింగ్..!!
హొనియారా: ఇండోనేషియాలో సంభవించిన పెను భూకంపం మిగిల్చిన విషాదం నుంచి ఇంకా జనం తేరుకోలేదు. 162 మందిని బలి తీసుకున్న భూకంపం ఇది. 200 మందికి పైగా గాయపడ్డారు. పలువురు భవన శిథిలాల మధ్య చిక్కుకున్నారు. వారిని వెలికి తీస్తోన్న ప్రయత్నాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. జావా ద్వీపాన్ని అల్లకల్లోలానికి గురి చేసిందీ భూకంపం. భారీ భవనాలు నేలమట్టం అయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
మరింత తీవ్రతతో..
ఇండొనేషియాలో సహాయ, పునరావాస కార్యక్రమాలు ఇంకా కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. మరో పెను భూకంపం చోటు చేసుకుంది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.0గా నమోదైంది. ఇండోనేషియాకు సమీపంలోనే ఉన్న సొలొమన్ ఐలండ్స్లో తాజా భూకంపం సంభవించింది. రాజధాని హొనియారాకు నైరుతి దిశగా ఉన్న మలాంగోలో ఈ ఉదయం సరిగ్గా 7:33 నిమిషాలకు భూకంపం సంభవించినట్లు యూఎస్ జియాలాజికల్ సర్వే తెలిపింది.
అసలే ద్వీపదేశం..
మలాంగో 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాన్ని భూకంపం కేంద్రంగా గుర్తించినట్లు తెలిపింది. ఉపరితలం నుంచి 10.5 కిలోమీటర్ల దిగువన ఫలకాల్లో చోటు చేసుకున్న భారీ కదలికల వల్ల భూమి ప్రకంపించినట్లు పేర్కొంది. సొలొమన్ ఐలాండ్స్ చిన్న ద్వీప దేశం. పసిఫిక్ మహా సముద్రం దక్షిణ దిశలో ఓ చిన్న చుక్కలా ఉంటుంది. 7.0 తీవ్రతతో భూమి ప్రకంపించడం, చిన్న ద్వీపదేశం కావడం వల్ల సునామీ సంభవిస్తుందనే ఆందోళన వ్యక్తమౌతోంది.
సునామీ అలర్ట్..
దీనికి అనుగుణంగా సునామీ అలర్ట్ను కూడా జారీ చేశారు అక్కడి పసిఫిక్ వార్నింగ్ సెంటర్ అధికారులు. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రత్యేకించి- రాజధాని హొనియారా కూడా తీర ప్రాంతంలోనే ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ద్వీప దేశాన్ని వేలాది మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు. వారి కోసం తీర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రిసార్టులు వెలిశాయి. సునామీ వార్నింగ్ వెలువడిన వెంటనే ఆయా రిసార్టులను ఖాళీ చేయించడం మొదలు పెట్టారు అధికారులు.

ఇండోనేషియాలో..
జావా పశ్చిమ ప్రాంతంలో గల సియాంజుర్ రీజెన్సీలో ఈ ఉదయం 11:51 నిమిషాలకు ఈ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.6గా నమోదైంది. ప్రధాన భూకంపం తరువాత కూడా ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీని తీవ్రత రాజధాని జకార్తాపైనా పడింది. అక్కడా పలు భవనాలు కంపించాయి. వాటి కిటికీ అద్దాలు పగిలిపోయాయి. కొన్ని సెకెండ్ల పాటు ప్రకంపనాల తీవ్రత కనిపించినట్లు బదాన్ మెటెరాలజీ, క్లైమెటాలజీ, జియాలాజికల్ ఏజెన్సీ తెలిపింది.

భారీ నష్టం..
భూమి కంపించిన వెంటనే స్థానికులు తమ నివాసాలు, కార్యాలయాలను వదిలి పెట్టి బయటికి పరుగులు తీశారు. షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లను ఖాళీ చేయడం కనిపించింది. ప్రధాన భూకంపం తరువాత కూడా పలు ప్రకంపనలు నమోదు కావడంతో వెనక్కి వెళ్లడానికి ఇష్టపడలేదు. ఈ భూకంపంలో భారీగా ఆస్తినష్టం సంభవించింది. అదే స్థాయిలో ప్రాణనష్టం కూడా. 162 మంది మరణించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. శిథిలాలను తొలగించే కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి.












Click it and Unblock the Notifications