శ్రీలంక మాజీ అధ్యక్షుడు రాజపక్సే ఆదేశ ప్రధాని అయ్యారు
కొలంబో: నాటకీయ పరిణామాల మధ్య శ్రీలంకలో రాజకీయాలు మరో మలుపుతీసుకున్నాయి. మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్సే శుక్రవారం శ్రీలంక ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. రణిల్ విక్రమసింఘే యునైటెడ్ నేషనల్ పార్టీతో తెగదెంపులు చేసుకుని మహిందా రాజపక్సే పార్టీతో సిరిసేన పార్టీ యునైటెడ్ ఫ్రీడం అలయన్స్ జట్టుకట్టింది.
దేశ వ్యవసాయశాఖ మంత్రి యూపీఎఫ్ఏ నేత తమ పార్టీ మహిందా రాజపక్సే పార్టీతో జట్టుకట్టినట్లు చెబుతూ మహిందాను ప్రధానిగా ఎన్నుకున్నట్లు పార్లమెంటుకు చెప్పారు. ఇక మైత్రిపాల సిరిసేన రణిల్ విక్రమసింఘేలు 2015లో యూనిటీ ప్రభుత్వాన్ని స్థాపించారు. ఇందులో భాగంగా రణిల్ విక్రమసింఘే మద్దతుతో సిరిసేన దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో పదేళ్ల రాజపక్సే పాలనకు చరమగీతం పాడారు. రాజపక్సే కేబినెట్లో ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన మైత్రిపాల సిరిసేన అతనితో విబేధాలు వచ్చి సొంత కుంపటి పెట్టుకున్నారు.
ఇదిలా ఉంటే రాజపక్సేను ప్రధానిగా నియమించడం రాజ్యాంగ విరుద్ధం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మెజార్టీ సభ్యుల ఆమోదం లేకుండా రణిల్ విక్రమసింఘేను ప్రధాని పదవి నుంచి ఎలా తప్పిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. రణిల్ విక్రమసింఘే, సిరిసేనల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరడంతో సిరిసేన ప్రభుత్వం యూనిటీ ప్రభుత్వం నుంచి తప్పుకుంది. శ్రీలంకలో ఫిబ్రవరిలో జరిగిన స్థానిక ఎన్నికల్లో రాజపక్సే పార్టీ భారీ మెజార్టీతో గెలిచింది. ఈ ఎన్నికలను యూనిటీ ప్రభుత్వ పాలనకు రెఫరెండంగా భావించారు.