మెహుల్ చోక్సీకి షాక్: భారత్కు అప్పగిస్తామన్న ఆంటిగ్వా ప్రధాని
ఆంటిగ్వా: పంజాబ్ నేషనల్ బ్యాంకుకు కొన్నివేల కోట్లు కుచ్చుటోపీ పెట్టి దేశం విడిచి ఆంటిగ్వాలో తలదాచుకుంటున్న ప్రముఖ వ్యాపారి మెహుల్ చోక్సీకి షాక్ ఇచ్చింది ఆంటిగ్వా ప్రభుత్వం. భారత్కు అప్పగించాలని ఆదేశ ప్రధానికి అభ్యర్థించడంతో చోక్సీని ఇండియాకు పంపుతామని చెప్పారు. ఇందుకోసం న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తున్నామని ఆంటిగ్వా ప్రధాని గాస్టన్ బ్రౌన్ తెలిపారు.
చోక్సీకి పౌరసత్వం ఇలా కల్పించాం
కరేబియన్ దీవుల్లోని ట్విన్ స్టేట్స్గా పిలువబడే ఆంటిగ్వా బార్బుడా రాష్ట్రాల్లో మెహుల్ చోక్సీ పెట్టుబడులు పెట్టారన్న దాంతో వివాదాస్పద సిటిజెన్షిప్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ కింద నవంబర్ 2017లో మెహుల్ చోక్సీకి పౌరసత్వం కల్పించారు. మెహుల్ చోక్సీకి పౌరసత్వం ఇచ్చిన మాట వాస్తవమే అని అయితే అతని గురించి తెలిశాక ముందుగా అతని పాస్పోర్ట్ను రద్దు చేస్తున్నామని త్వరలో భారత్కు అప్పగిస్తామని ప్రధాని గాస్టన్ బ్రౌన్ తెలిపారు. మరోవైపు నేరగాళ్లకు ఆంటిగ్వా ఎట్టి పరిస్థితుల్లో ఆశ్రయం కల్పించబోదని ప్రధాని బ్రౌన్ తెలిపారు. అందులోను ఆర్థిక నేరాలకు పాల్పడిన వారిని అస్సలు ఎంటర్టెయిన్ చేయమని చెప్పారు.
ఆంటిగ్వా నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు
ఇదిలా ఉంటే మెహుల్ చోక్సీ విషయమై తమ వద్ద ఎలాంటి అధికారిక సమాచారం లేనందున ఇప్పుడిప్పుడే స్పందించలేమని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ తెలిపారు.మెహుల్ చోక్సీ పౌరసత్వం రద్దుపై ఆంటిగ్వా ప్రభుత్వం నుంచి అధికారికంగా సమాచారం అందాల్సి ఉందని భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అదేసమయంలో చోక్సీ పౌరసత్వం రద్దు చేసే అంతర్గ ప్రక్రియ ప్రారంభం కోసం భారత్ ఎదురుచూస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాతే మెహుల్ చోక్సీని భారత్కు తీసుకువచ్చే ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు. అంతవరకు ఆంటిగ్వా ప్రభుత్వంతో భారత్ టచ్లో ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
మెహుల్ హెల్త్ రిపోర్టు తమముందు ఉంచాలన్న కోర్టు
ఇదిలా ఉంటే మెహుల్ చోక్సీ ఆరోగ్యానికి సంబంధించిన డాక్యుమెంట్లు జూలై 1లోగా తమ ముందు ఉంచాలని మెహుల్ చోక్సీ తరపున లాయరును కోరింది బాంబే హైకోర్టు. అంతేకాదు ఎయిర్ అంబులెన్స్ ద్వారా చోక్సీని భారత్కు తీసుకురావచ్చా అని జేజే హాస్పిటల్ను బాంబే హైకోర్టు ప్రశ్నించింది. అంతకుముందు తను చట్టం నుంచి పారిపోవడం లేదని ఆరోగ్యసమస్యల కారణంగానే రాలేకపోతున్నాని చోక్సీ న్యాయస్థానానికి తెలిపారు. 2018 జనవరిలో తాను బైపాస్ సర్జరీ కోసం భారత్ను వదిలి విదేశాలకు వచ్చినట్లు చోక్సీ వెల్లడించాడు.