ట్రంప్ మరో దుస్సాహసం-ఏకంగా అంతర్జాతీయ కోర్టుపైనే ఆంక్షల కొరడా..!
రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ అధికార దర్పం ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా బలం ప్రపంచానికి చూపిస్తానంటూ ఇప్పటికే పలు దూకుడు నిర్ణయాలు తీసుకుంటున్న ట్రంప్.. ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ కోర్టునే టార్గెట్ చేశారు. అమెరికాతో పాటు తన మిత్రదేశం ఇజ్రాయెల్ ను టార్గెట్ చేస్తున్న అంతర్జాతీయ కోర్టుపై ఆంక్షలు విధిస్తూ ట్రంప్ ఓ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. దీంతో ప్రపంచం నివ్వెరపోతోంది.

మంగళవారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో భేటీ అయిన డొనాల్డ్ ట్రంప్ .. ఈ సందర్బంగా గాజాలో తాజా పరిస్దితులపై చర్చించారు. వీరిద్దరి భేటీలో అంతర్జాతీయ న్యాయస్థానం నెతన్యాహుపై జారీ చేసిన అరెస్ట్ వారెంట్ కూడా ప్రస్తావనకు వచ్చింది. దీంతో ట్రంప్ అంతర్జాతీయ న్యాయస్థానం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అంతర్జాతీయ న్యాయస్దానంపై ఆంక్షలు విధిస్తూ ఆదేశాలపై సంతకం చేసేశారు.
ఈ కార్యనిర్వాహక ఉత్తర్వులో ట్రంప్.. అమెరికాతో పాటు తమ సన్నిహిత మిత్రదేశం ఇజ్రాయెల్ ను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్న అంతర్జాతీయ కోర్టుపై ఆంక్షలు విధిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకు ఆధారంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై నిరాధారంగా అంతర్జాతీయ కోర్టు జారీ చేసిన అరెస్ట్ వారెంట్ ను చూపారు. అంతర్జాతీయ న్యాయస్దానం తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ ట్రంప్ ఆరోపించారు.
ఆఫ్ఘనిస్తాన్లోని యుఎస్ సర్వీస్ సభ్యులు, గాజాలోని ఇజ్రాయెల్ దళాలపై ఆరోపించిన యుద్ధ నేరాలపై అంతర్జాతీయ కోర్టు విచారణలను ప్రస్తావిస్తూ .."అమెరికా, మా సన్నిహిత మిత్రదేశమైన ఇజ్రాయెల్ను లక్ష్యంగా చేసుకుని చట్టవిరుద్ధమైన, నిరాధారమైన చర్యల్లో ట్రిబ్యునల్ నిమగ్నమైందని పేర్కొన్నారు. దీంతో అంతర్జాతీయ కోర్టు విచారణకు సహకరించినట్లు భావించే వారితో పాటు కోర్టు అధికారులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులపై ఆస్తుల స్తంభన, ప్రయాణ నిషేధాలను విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.












Click it and Unblock the Notifications