భారత్ తో ట్రంప్ బిగ్ డీల్..! తొలిసారి మనకు అమెరికా గ్యాస్..!
ఓవైపు రష్యా డిస్కౌంట్ చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్ యుద్దానికి ఆజ్యం పోస్తున్న కారణంగా భారత్ పై 50 శాతం సుంకాలు విధించిన అమెరికా.. ఇప్పుడిప్పుడే పునరాలోచనలో పడుతోంది. తాజాగా భారత్ కు చెందిన ఆహార దిగుమతులపై సుంకాల తగ్గింపుకు అంగీకరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మరో విషయంలో భారత్ కు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నారు. దీంతో భారత్ కూడా వెంటనే స్పందించి అమెరికాతో ఒప్పందాలపై సంతకాలు చేసేసింది.
అమెరికా నుంచి ద్రవరూప పెట్రోలియం గ్యాస్ (ఎల్బీజీ) దిగుమతి చేసుకునేందుకు వీలుగా ఇరు దేశాల మధ్య తాజాగా ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఏడాదికి 2.2 మిలియన్ టన్నుల ఎల్బీజీని గల్ఫ్ తీరం నుంచి భారత్ దిగుమతి చేసుకోనుంది. ఇది ఇరు దేశాల మధ్య తొలి నిర్మాణాత్మక, దీర్ఘకాలిక ఎల్బీజీ ఒప్పందం. దీంతో ఇంధన రంగంలో ప్రపంచవ్యాప్తంగా అస్థిరత పెరుగుతున్న సమయంలో మన చమురు వనరుల్ని వైవిధ్యపరిచేందుకు ఉపయోగపడనుంది.

2026 కాంట్రాక్ట్ సంవత్సరానికి అమెరికా గల్ఫ్ తీరం నుండి సంవత్సరానికి 2.2 మిలియన్ టన్నుల ఎల్బీజీని దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వ చమురు కంపెనీలు ఒక సంవత్సరం ఒప్పందాన్ని ఖరారు చేశాయని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటించారు. ఇది భారత ఎల్బీజీ దిగుమతుల్లో 10 శాతం ఉంటుందని అంచనా వేశారు. అలాగే ఇది దేశ సోర్సింగ్ వ్యూహంలో ఒక ప్రధాన మార్పుగా కూడా భావిస్తున్నారు.

భారత్ లోని ప్రధాన చమురు సంస్థలైన ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ అధికారుల బృందం కొన్ని నెలలుగా అమెరికా ఎల్బీజీ ఉత్పత్తి దారులతో జరిపిన చర్చలు ఫలించడంతో ఈ ఒప్పందం కుదిరింది. ఇదో చారిత్రక ఒప్పందం అని, ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎల్బీజీ మార్కెట్లలో ఒకటి ఇప్పుడు అధికారికంగా అమెరికా సరఫరాలకు తెరుచుకుంటుందని కేంద్రమంత్రి హర్దీప్ పూరీ తెలిపారు. దేశ ప్రజలకు సురక్షితమైన, చౌకైన ఎల్జీపీని అందించే ప్రయత్నాల్లో భాగంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన వెల్లడించారు.












Click it and Unblock the Notifications