భారత్-అమెరికా చారిత్రక రక్షణ ఒప్పందం- అందుబాటులో హైఎండ్ టెక్నాలజీ-చైనా సమస్య వేళ...
చైనాతో సరిహద్దు ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ భారత్కు అమెరికా ఆపన్నహస్తం చాచింది. తమ వద్దనున్న అత్యున్నత రక్షణ పరిజ్ఞానాన్ని భారత్తో పంచుకునేందుకు అమెరికా సిద్ధమైంది. ఈ మేరకు చారిత్రక రక్షణ ఒప్పందంపై ఇరుదేశాల రక్షణమంత్రులు, ఉన్నతాధికారులు సంతకాలు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ చోటు చేసుకున్న ఈ కీలక పరిణామం అంతర్జాతీయంగానూ ఆసక్తి రేపుతోంది.
Recommended Video
భారత్-అమెరికా మధ్య జరుగుతున్న మూడో దశ టూ ప్లస్ టూ చర్చల్లో భాగంగా ఇరుదేశాల రక్షణ మంత్రులు రాజ్నాధ్ సింగ్, మార్క్ ఎస్పర్, జై శంకర్, మైకేల్ పాంపియో ఈ రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశారు. ముందుగా భారత్-అమెరికా మధ్య రెండు దశాబ్దాలుగా ద్వైపాక్షిక సంబంధాలు స్ధిరంగా ఎలా కొనసాగుతున్నాయో విదేశాంగమంత్రి జైశంకర్ వివరించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో ఇరుదేశాలు కలిసి ఎలా పనిచేస్తున్నాయో కూడా తెలిపారు.
దీనికి స్పందనగా మాట్లాడిన అమెరికా మంత్రి మైకేల్ పాంపియో.. ప్రపంచంలోనే రెండు గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్ధలు కలిసి ఎదిగేందుకు ఇదో చక్కటి అవకాశమన్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రపంచ స్వేచ్ఛ, భద్రతకు విసురుతున్న సవాళ్లు ఎదుర్కొనేందుకు కరోనా వేళ కూడా ఇరుదేశాలు కలిసి పనిచేసినట్లు పాంపియో తెలిపారు. ఆసియా ఖండంలో శాంతిని, స్ధిరత్వాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా భారత్తో ఈ ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు పాంపియో వివరించారు.
భారత్-అమెరికా మధ్య కుదిరిన చారిత్రక రక్షణ ఒప్పందాన్ని బేసిక్ ఎక్స్ఛేంజ్ అండ్ కో ఆపరేషన్ అగ్రిమెంట్ (బెకా)గా పిలుస్తున్నారు. అగ్రరాజ్యంతో రక్షణ సహకారాన్ని అందుకునే క్రమంలో భారత్తో కుదిరిన చివరి, నాలుగో ఒప్పందం ఇది. ఇది అమల్లోకి వస్తే భారత్కు అమెరికా నుంచి అత్యున్నత స్ధాయి రక్షణ సాంకేతిక, మిలిటరీ పరిజ్ఞానం, జియో స్పేషియల్ మ్యాప్లు, లాజిస్టిక్ సహకారం అందుతుంది. దీంతో ఈ ఒప్పందానికి చాలా ప్రాధాన్యత ఉందని నిపుణులు చెబుతున్నారు.