హైదరాబాదీ రాజా చారిని ఏరికోరి ఎంపిక చేసిన జో బైడెన్- కీలక పదవిలో అపాయింట్
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన అమెరికా అంతరిక్ష పరిశోధకుడు రాజా చారి. ఇంకో రెండేళ్ల తరువాత చందమామపై అడుగు పెట్టబోతోన్నారు. జాబిల్లిపై ప్రయోగాలను సాగించబోతోన్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా.. ఇదివరకే ప్రకటించిన తుది జాబితాలో ఆయనకు చోటు దక్కింది. 18 మందితో కూడిన తుది జాబితాలో రాజా చారి ఒకరు. సగం మంది వరకు మహిళలతో నిండి ఉన్న ఈ టీమ్.. 2024లో చంద్రుడిపైకి వెళ్లనుంది. నాసా తలపెట్టిన మానవ సహిత మిషన్ మూన్లో ఈ టీమ్ భాగస్వామ్యమైంది.
కంప్లీట్ లిస్ట్ ఇదే..
రాజా చారితో పాటు ఈ మిషన్ మూన్ టీమ్ లో జోసెఫ్ అకాబా, కాయ్లా బరూన్, మాథ్యూ డొమినిక్, విక్టర్ గ్లోవర్, వారెన్ హోబర్గ్, జానీ కిమ్, క్రిస్టియానా హ్యామ్కాక్ కచ్, కెల్ లిండ్గ్రెన్, నికోల్ ఎ. మన్, అన్నే మెక్క్లెయిన్, జెస్సికా మెయిర్, జాస్మిన్ మొఘ్బెలి, కేట్ రూబిన్స్, ఫ్రాంక్ రూబియో, స్కాట్ టింగిల్, జెస్సికా వాట్కిన్స్, స్టెఫానీ విల్సన్ ఉన్నారు. ఇదివరకే వారంతా శిక్షణ కూడా తీసుకున్నారు. 2024 మిషన్ మూన్ కోసం సన్నద్ధమౌతోన్నారు.
మరో కీలక పదవిలో..
తాజాగా రాజా చారి మరో ఘనతను సాధించారు. కీలక పదవిలో అపాయింట్ అయ్యారు. అమెరికా వైమానిక దళంలో అత్యంత కీలకమైన బ్రిగేడియర్ జనరల్ గా ఆయన నియమితులయ్యారు. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్.. ఓ ప్రకటన విడుదల చేసింది. రాజా చారిని యూఎస్ ఎయిర్ ఫోర్స్ బ్రిగేడియర్ జనరల్ గా నియమించడానికి ఉద్దేశించిన ఆర్డర్ పై అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేసినట్లు తెలిపింది.
టెక్సాస్ లో..
ప్రస్తుతం టెక్సాస్ లో ఆయన డెప్యూట్ అయ్యారు. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ లో ముగ్గురు సభ్యుల టీమ్ క్రూ-3కు కమాండర్ గా వ్యవహరిస్తోన్నారు. ఇదివరకు ఆయన ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ ద్వారా అంతరిక్షానికి వెళ్లొచ్చారు. స్పేస్ ఎక్స్ టీమ్ కు కమాండర్ గా బాధ్యతలను స్వీకరించారప్పట్లో.
హైదరాబాద్ మూలాలు..
రాజా చారి పూర్తి పేరు రాజా జాన్ వుర్పుతూర్ చారి. ఆయన తండ్రి శ్రీనివాసాచారి స్వస్థలం హైదరాబాద్. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. అనంతరం ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికాకు వెళ్లారు. అక్కడే స్థిరపడ్డారు. రాజా చారి అమెరికాలోనే పుట్టి పెరిగారు. ప్రతిష్ఠాత్మక మస్సాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోనాటికల్ ఇంజినీరింగ్ లో పీజీ చేశారు. యూఎస్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో ఆస్ట్రోనాటికల్ ఇంజినీరింగ్ అండ్ ఇంజినీరింగ్ సైన్స్ లో డిగ్రీ చేశారు.
2024 నాటికి మిషన్ మూన్..
రాజా చారి సహా మిషన్ మూన్ కోసం ఎంపికైన 18 మంది నాసా పర్యవేక్షణలో కొనసాగుతున్నారు. 2024 నాటికి మానవ సహిత స్పేస్ క్రాఫ్ట్ను నాసా చంద్రుడి మీదికి ప్రయోగించబోతోంది. ఈ మిషన్లో వారు భాగస్వామ్యులవుతారు. 1972 తరువాత చందమామ మీదికి మానవ సహిత ప్రయోగాలకు సిద్ధపడటం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. చంద్రుడిపై మరింత విస్తృత ప్రయోగాలను చేపట్టడానికి ఈ మిషన్ ఉపకరిస్తుందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇంకో రెండేళ్లే- సీఎంకు అన్నీ తెలుసు- ప్రశాంత్ కిశోర్ సంచలన స్టేట్మెంట్