అమెరికాలో విషాదం: పోలీసు శాఖలో పనిచేసే భారత సంతతి వ్యక్తిని కాల్చిచంపిన దుండగుడు
అమెరికాలోని కాలిఫోర్నియాలో విషాదం చోటుచేసుకుంది. భారత సంతతికి చెందిన ఓ అమెరికా పోలీసు అధికారి దారుణ హత్యకు గురయ్యాడు. ట్రాఫిక్ స్టాప్లో విధులు నిర్వర్తిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. వివరాల్లోకి వెళితే... న్యూమ్యాన్ పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీసుగా పనిచేస్తున్న రోనిల్ సింగ్ అనే వ్యక్తిని ట్రాఫిక్ స్టాప్ దగ్గర తుపాకులతో కాల్చి చంపారు దుండగులు. కాల్చిన తర్వాత తనను ఎవరో కాల్చారని వాకీ టాకీలో సందేశం ఇచ్చాడు. సమాచారం అందుకున్న సంస్థలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. రక్తపు మడుగులో పడిపోయిన రోనిల్ సింగ్ను దగ్గరలోని ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. చికిత్స పొందుతూ రోనిల్ మృతి చెందాడని వైద్యులు ధృవీకరించారు.
క్రిస్మస్ సందర్భంగా ఓవర్టైమ్ చేశారు రోనిల్ సింగ్. విధులు నిర్వర్తిస్తుండగా అక్కడికి చేరుకున్న గుర్తుతెలియని వ్యక్తులు రోనిల్ పై కాల్పులు జరిపి ఆయన వాహనంలో ఘటనా స్థలం నుంచి పారిపోయారని అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి విచారణ చేస్తున్న అధికారులు ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీలను విడుదల చేశారు. దీనికి సంబంధించి ఎవరి దగ్గరైనా సమాచారం ఉంటే తమకు తెలియజేయాల్సిందిగా పోలీసులు ప్రజలను కోరారు. ఇదిలా ఉంటే దుండగుడిని స్పెయిన్ లేదా లాటిన్ దేశాలకు చెందినవాడై ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇక బాధితుడు రోనిల్ సింగ్ న్యూమ్యాన్ పోలీస్ శాఖలో ఏడేళ్ల క్రితం బాధ్యతలు చేపట్టాడు. రోనిల్ సింగ్కు భార్య అనామికతో పాటు 5నెలల అబ్బాయి ఉన్నాడు. ఫిజీ దీవుల నుంచి అమెరికాకు వలస పోయాడు. అతని మరణం పోలీస్ డిపార్ట్మెంట్కు తీరని లోటు అని న్యూయార్క్ పోలీసు శాఖ ట్విటర్ ద్వారా పేర్కొంది.