తాలిబన్ల చేతిలో భారతీయ జర్నలిస్ట్ దానిష్ సిద్ధికి హతం-రాయిటర్స్ చీఫ్ ఫొటోగ్రాఫర్-అఫ్గాన్ అశాంతికి పాక్ ఆజ్యం
అమెరికా సేనల నిష్క్రమణ తర్వాత తాలిబన్ సేనల ఆక్రమణలోకి వెళుతోన్న అఫ్గానిస్థాన్ లో అశాంతి రాజ్యమేలుతున్నది. అక్కడి పరిస్థితిని ప్రపంచానికి చూపించడానికి వెళ్లిన భారతీయ ఫొటో జర్నలిస్ట్ దానిష్ సిద్ధికి(41) విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్ సరిహద్దును ఆనుకుని ఉండే కాందహార్ లో కవరేజీకి వెళ్లిన ఆయన తాలిబన్ల చేతిలో హతమయ్యారు.
ప్రఖ్యాత న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ సంస్థలో చీఫ్ ఫొటోగ్రాఫర్ గా పనిచేస్తోన్న దానిష్ సిద్ధికి కొద్ది రోజులుగా అఫ్గానిస్థాన్ లోనే ఉంటూ, అక్కడి ప్రజల వెతలను కవర్ చేస్తున్నారు. అమెరికా సైన్యాలు వెళ్లిపోయిన తర్వాత మళ్లీ జడలు విప్పిన తాలిబన్లు ఒక్కొక్కటిగా ప్రాంతాలను కైవసం చేసుకుంటుండగా, అఫ్గాన్ సేనలు వారిని నిలువరించే ప్రయత్నం చేస్తున్నాయి. అఫ్గాన్ సైన్యంతో కలిసి ప్రయాణిస్తూ దానిష్ అక్కడి దృశ్యాలను ప్రపంచం దృష్టికి తీసుకొచ్చేవారు.

దక్షిణ అఫ్గాన్ లోని కాందహార్ ఫ్రావిన్స్, స్పిన్ బోల్డాక్ జిల్లా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న దానిష్ సిద్ధికి.. అఫ్గాన్ సైన్యానికి, తాలిబన్లకు మధ్య జరిగిన ఘర్షణలో గాయపడి మరణించారు. ఈ విషయాన్ని అఫ్గాన్ సేనలు, ఆ దేశ అధికారిక మీడియా టోలో న్యూస్ తోపాటు దానిష్ పనిచేస్తోన్న రాయిటర్స్ సంస్థ కూడా ధృవీకరించింది. నిజానికి
గత నెల(జూన్)13న వెంట్రుకవాసిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు జర్నలిస్ట్ దానిష్ సిద్ది. ఆయన ప్రయాణిస్తోన్న వాహనం(అఫ్గాన్ సైన్యానికి చెందినది)పై తాలిబన్లు రాకెట్లను ప్రయోగించడం, తక్కువ తీవ్రత గల ఆ రెకెట్ల ధాటికి వాహనం దెబ్బతినడం, లోపలున్న దానిష్ ఆ దృశ్యాలను చిత్రీకరించి పోస్ట్ చేశారు. ఆ వీడియోలు, అఫ్గాన్ లో ఆయన విధుల తాలూకు ఫొటోలు వైరల్ అవుతున్న క్రమంలో ఇప్పుడాయనే ప్రాణాలు కోల్పోవడం విషాదకరం.

ముంబైకి చెందిన దానిష్ సిద్ధికి చాలా ఏళ్లుగా రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీలో ఫొటోజర్నలిస్టుగా పనిచేస్తున్నారు. ఇరాక్ సైన్యం-ఐసిస్ ఉగ్రవాదుల మధ్య జరిగిన మోసుల్ యుద్ధాన్ని, నేపాల్ భూకంపం, రోహింగ్యాల ఊచకోత, వలసలు, ఢిల్లీ ఘర్షణలు తదితర సందర్భాల్లో దినేశ్ తీసిన ఫొటోలు సంచలనం రేపాయి. జర్నలిస్టుల నోబెల్ పురస్కారంగా భావించే పులిట్జర్ అవార్డును సైతం సిద్ధికి గెలుచుకున్నారు. ప్రపంచ స్థాయి సంస్థలో పనిచేస్తోన్న భారతీయ జర్నలిస్టుల్లో ప్రముఖుడిగా పేరున్న దానిష్ సిద్దికి విధినిర్వహణలోనే తాలిబన్ల చేతులో చనిపోవడంపై జర్నలిస్టు లోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కాగా,

ఫొటో జర్నలిస్ట్ దానిష్ సిద్ధికి ప్రాణాలు కోల్పోయిన కాందహార్ ప్రాంతం చాలా వరకు ఇప్పటికే తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. పాకిస్తాన్ సరిహద్దును సైతం తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా, తాలిబన్లకు అవసరమైన ఆయుధాలు, మందుగుండును చేరవేస్తూ అఫ్గాన్ అశాంతికి పాకిస్థాన్ మరింత ఆజ్యం పోస్తున్నది.












Click it and Unblock the Notifications