పళ్లు రెండు నిమిషాలు తోముకుంటే చాలా? సైన్స్ ఏం చెబుతోంది?
రోజుకు రెండుసార్లు పళ్లు తోముకోవాలని డాక్టర్లు చెప్పడం మనం తరచూ వింటూ ఉంటాం. అది కూడా ప్రతిసారి రెండు నిమిషాల పాటు బ్రెష్ చేసుకోవాలని సూచిస్తూ ఉంటారు.
ఒక నిమిషం పాటు పళ్లు తోముకుంటే సరిపోతుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ డాక్టర్లు చెప్పినట్లు రెండు నిమిషాల పాటు తోముకున్నా సరిపోదని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
నోటిలో, పళ్లు, చిగుళ్లకు అంటుకుని ఉండే బ్యాక్టీరియా, ఫంగస్లు, వైరస్లను వీలైనంత ఎక్కువగా తొలగించుకోవాలంటే కనీసం మూడు, నాలుగు నిమిషాల పాటు బ్రెష్ చేసుకోవాలని తాజా అధ్యయనంలో తేలింది.
అంటే మనం బ్రెష్ వేసుకునే సమయాన్ని రెట్టింపు చేయాలి.
- లేటు వయసులో గర్భం దాలిస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి?
- మైక్రోవేవ్లో వండిన వంట ఆరోగ్యానికి మంచిదేనా?
రోజుకు రెండుసార్లు పళ్లు తోముకోవాలని దంత వైద్యులు 1970ల నుంచి సూచించడం మొదలుపెట్టారు.
1990ల నుంచి పళ్లు తోముకునే విధానం, టెక్నిక్, ఎలాంటి టూత్బ్రెష్ వాడుతున్నామన్న అంశాలపై చేసిన అధ్యయనం ఆధారంగా ఎక్కువసేపు బ్రెష్ వేయడం మంచిదనే అభిప్రాయానికి వచ్చారు.
అయితే రెండు నిమిషాల పాటు బ్రెష్ చేసుకున్నా నోటిలో ఉండే బ్యాక్టీరియా, ఫంగస్లను బాగానే (మరీ అంత ఎక్కువ కాదు) తొలగిస్తుందని ఈ అధ్యయనాలు చెబుతున్నాయి.
కానీ రెండు నిమిషాల కంటే ఎక్కువ సేపు పళ్లు తోముకోవడం వల్ల నోరు మరింత ఎక్కువ శుభ్రం అవుతుందని ఈ పరిశోధనలో వెల్లడైంది.
నాలుగు నిమిషాల పాటు బ్రెష్ చేయడం వల్ల మనకు ఎక్కువ సమయం రక్షణ లభిస్తుందా లేదా అన్నది తెలుసుకోవడానికి పరిశోధనలు ఇంకా జరగాల్సి ఉంది.
కానీ ప్రస్తుతానికైతే ఎక్కువ సేపు పళ్లు తోముకోవడం వల్ల నోరు మరింత ఎక్కువగా శుభ్రమవుతుందని తేలింది.
నోటిలో బ్యాక్టీరియా, ఫంగస్లు, ఇతర వైరస్లు వృద్ధి చెందేందుకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఇవి పళ్లు, చిగుళ్లకు పట్టుకుని ఉంటాయి. బ్రెష్ చేయడం వల్ల మాత్రమే వీటిని మనం తొలగించుకోగలుగుతాము.
నిజానికి బ్రెష్ వేసుకున్న కొన్ని గంటల్లోనే నోటిలో ఇవి మళ్లీ పెరుగుతాయి. అందుకే రోజుకు రెండుసార్లు బ్రెష్ వేసుకోవాలని చెబుతూ ఉంటారు.
సరిగా పళ్లు తోముకోకపోయినా, తగినంత సమయం బ్రెష్ చేసుకోకపోయినా నోటిలో బ్యాక్టీరియా, ఫంగస్లు, వైరస్లు పెరుగుతాయి. అవి అంతిమంగా మన రోగ నిరోధక శక్తిపై ప్రభావం చూపిస్తాయి. మంట, చిగుళ్లవాపు వంటి సమస్యలు వస్తాయి.
అయితే, ఈ ఇన్ఫ్లమేషన్ సాధారణంగా నొప్పి ఉండదు. కానీ పళ్లు తోముకుంటున్న సమయంలో చిగుళ్ల నుంచి రక్తం వస్తుంది. కొన్నిసార్లు నోటి నుంచి దుర్వాసన వస్తుంది. ఇవి కావిటీస్కు కూడా కారణం అవుతాయి.
- క్లిటోరిస్ అంటే ఏంటి? సెక్స్లో మహిళల లైంగిక ఆనందానికీ, దీనికీ లింకేంటి?
- 'ఈ ఆహారం తీసుకుంటే మతిమరుపు రాదు, మెదడు చురుగ్గా పని చేస్తుంది’
ప్రతి పంటిపై ఉన్న మలినాలను వీలైనంత ఎక్కువగా శుభ్రం చేసుకోవడం పళ్లు తోముకోవడం వెనకున్న అసలు లక్ష్యం.
ఎక్కువ సమయం బ్రెష్ చేసుకోవడం అంటే మన పళ్లను మరింత ఎక్కువగా శుభ్రం చేసుకోవడంకిందే లెక్క.
అలాగని తరచుగా పళ్లు తోముకోవడం కూడా మంచిది కాదు. అలాగే, గట్టిగా ఒత్తిపట్టి బ్రెష్ చేయకూడదు. గరుకుగా ఉండే (కొందరు ఇటుక పొడితో) పేస్ట్ వాడకూడదు. బ్రెష్ చివర్లు గట్టిగా ఉండకూడదు. టూత్బ్రెష్ మృదువుగా ఉండాలి. లేదంటే అవి మీ దంతాలను, చిగుళ్లను పాడు చేస్తాయి.
పళ్లు తోముకోవడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. వాటిలో వైద్యులు 'బాస్' టెక్నిక్ను ఎక్కువగా సిఫార్సు చేస్తుంటారు. బ్యాక్టీరియా, ఫంగస్లు, వైరస్లు ఎక్కువగా ఉండే చిగుళ్ల దిగువ భాగాన్ని శుభ్రం చేసుకోవడమే బాస్ టెక్నిక్.
బ్రెష్ చేసుకునే సమయంలో పళ్లపై ఎక్కువ ఒత్తిడి కలిగించకూడదు. అయితే, ఎంత బలంగా పళ్లు తోముకోవాలన్న దానిపై సమగ్ర ఆధారాలు లేవు. నోటి లోపల ఉండే సున్నితమైన చర్మం, చిగుళ్లు దెబ్బతినకుండా మృదువుగా బ్రెష్ చేసుకోవాలి.
అయితే, మీరు వాడే బ్రెష్ రకం, టూత్పేస్ట్ రకం లాంటి ఎన్నో అంశాలపై ఇది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు సోడాలు ఎక్కువగా తాగే వారి పళ్లు బలహీనంగా ఉంటాయి.
మరొక విధానం పళ్ల సందుల్లో శుభ్రం చేయడం.. బ్రెష్ చేసుకోవడంతో పాటు పళ్ల సందుల్లో కూడా శుభ్రం చేసుకోవాలని డాక్టర్లు సూచిస్తూ ఉంటారు. దీన్ని ఫ్లాసింగ్ అని పిలుస్తుంటారు.
ఇలా చేయడం వల్ల దంతక్షయం, చిగుళ్ల వాపు తగ్గుతుందని అధ్యయనాల్లో తేలింది.
మనం రోజుకు రెండుసార్లు, రెండు నిమిషాల చొప్పున పళ్లు తోముకోవాలన్న సూచన పాటించొచ్చు. అయితే, నోటిని సరిగ్గా, పూర్తిగా శుభ్రం చేసుకోవడంపై కూడా మనం దృష్టి సారించడం చాలా ముఖ్యం.
రెండు నిమిషాల కంటే ఎక్కువ సేపు బ్రెష్ చేయడం వల్ల నోటిలో ఉండే బ్యాక్టీరియా, ఫంగస్లను ఎక్కువగా తొలగించుకునే అవకాశం ఉంది. దాంతో దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. నోరు కూడా పరిశుభ్రంగా ఉంటుంది.
(జోసెఫిన్ హైర్ష్ఫెల్డ్.. బ్రిటన్లోని బర్మింగ్హమ్ యూనివర్శిటీలో రిస్టొరేటివ్ డెంటిస్ట్రీ ప్రొఫెసర్. ఈ కథనం ముందుగా 'ది కన్వర్సేషన్'లో ప్రచురితమైంది. క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ కింద ఈ కథనాన్ని ఇక్కడ అందిస్తున్నాం)
ఇవి కూడా చదవండి:
- ''మోదీ లేకున్నా బీజేపీ దశాబ్దాలపాటు ఉంటుంది. రాహుల్కు ఇది అర్ధం కావడం లేదు'' అని ప్రశాంత్ కిశోర్ ఎందుకన్నారు?
- 'మెటా': ఫేస్బుక్ కంపెనీకి కొత్త కార్పొరేట్ పేరు.. ఫేస్బుక్ యాప్ పేరులో మార్పు లేదు
- త్రిపురలో ముస్లింలపై దాడులు.. కారణమేంటి
- హైదరాబాద్: మూడు గంటలపాటు ఆపరేషన్, ఒకే కాన్పులో నలుగురు పిల్లలు
- డికాక్: 'మోకాళ్లపై నిలబడనందుకు క్షమాపణలు.. నేను జాత్యాహంకారిని కాదు’
- చేతిలో ఏకే-47, వెంట 100 మంది సాయుధ సైన్యం.. అయినా ఈ బందిపోటు ఎందుకు లొంగిపోయాడు
- COP26: వాతావరణ లక్ష్యాలకు భారత్ ఎంత దూరంలో ఉంది
- వైట్ మ్యారేజ్: ఈ ధోరణి ఏమిటి.. ఇలాంటి జంటలకు పుట్టే పిల్లలను అధికారికంగా గుర్తించరా
- హైదరాబాద్: మూడు గంటలపాటు ఆపరేషన్, ఒకే కాన్పులో నలుగురు పిల్లలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)