ఇస్లామిక్ జిహాద్ గ్రూప్పై దాడులు.. 400కు పైగా రాకెట్లు
గాజాపట్టీపై ఇజ్రాయెల్ తన దాడులను ఆపలేదు. పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ గ్రూప్ నకు (పీఐజే) చెందిన మిలిటెంట్ నాయకులను టార్గెట్ చేసుకొని ఈ దాడులు జరుగుతున్నాయి. మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటివరకు 28 మంది మరణించినట్లు తెలుస్తోంది. వీరిలో పీఐజే నాయకులు తైసీర్ జబారీ, ఖలీద్ మన్సూర్ ఉన్నారు. దాడుల్లో ఆరుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని మిగిల్చింది. గాజా వైపు నుంచి రెండురోజులుగా 400కు పైగా రాకెట్లు, మోర్టార్ షెల్స్ ను ఇజ్రాయెల్ పైకి ప్రయోగించారు. దీంతో తీవ్ర ముప్పు పొంచి ఉండటంతో ఈ ఆపరేషన్ చేపట్టినట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు.
ఇజ్రాయెల్ - గాజా మధ్య 2021 మే తర్వాత చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు ఇవే కావడం గమనార్హం. అప్పుడు జరిగిన హింసలో 200 మంది పాలస్తీనా వాసులు, 12 మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులు మృత్యువాత పడ్డారు. ఇజ్రాయెల్ దళాలు బ్రేకింగ్ డౌన్ పేరిట ఈ ఆపరేషన్ చేపట్టగా వారం రోజులకు పైగా కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో జరిగిన ఆపరేషన్ లో రఫాలోని పీఐజే సీనియర్ నాయకుడు ఖలీద్ మన్సూర్ ఇంటిని దళాలు ధ్వంసం చేశాయి. గతంలో ఖలీద్ ను మట్టుబెట్టేందుకు ఇజ్రాయెల్ దళాలు ఐదుసార్లు ప్రయత్నించినా తప్పించుకున్నాడు. గాజాలో మిలిటెంట్ ఆపరేషన్లకు ఇతడే బాధ్యుడని తెలుసుకొని తాజా దాడిలో అతణ్ని మట్టుబెట్టారు. వెస్ట్ బ్యాంక్ లోని ఇజ్రయెల్ దళాలు వేర్వేరు దాడులు నిర్వహించి 19 మంది పీఐజే సభ్యులను అదుపులోకి తీసుకున్నాయి.