గాజాను చుట్టుముట్టిన ఇజ్రాయెల్- అయినా హమాస్ చెరలోనే 240 బందీలు..
ఇజ్రాయెల్ పై హమాస్ మెరుపుదాడులతో ప్రారంభమైన ఇరుదేశాల యుద్ధం ఇప్పుడు పతాకస్ధాయికి చేరుకుంది. ఇజ్రాయెల్ హమాస్ కేంద్రమైన గాజా నగరంపై ప్రతిదాడులకు దిగడం, ఆ తర్వాత భూమార్గంలో వెళ్లి నగరాన్ని చుట్టుముట్టడం నెల రోజుల్లోనే జరిగిపోయాయి. ఇప్పుడు తాము గాజా నగరాన్ని చుట్టుముట్టినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించుకుంది. దీనిపై హమాస్ తీవ్రంగా స్పందించింది. ఇజ్రాయెల్ సైనికుల్ని సంచుల్లోనే తిరిగి పంపిస్తామని హెచ్చరించింది.
హమాస్ ఉగ్రవాద సంస్థకు కేంద్రంగా ఉన్న గాజా నగరాన్ని ఇజ్రాయెల్ సైనికులు చుట్టుముట్టారని ఇజ్రాయెల్ మిలటరీ అధికార ప్రతినిధి డేనియల్ హగారి తెలిపారు. అలాగే కాల్పుల విరమణ అనేది తమ ఆలోచనల్లోనే లేదని కూడా స్పష్టం చేశారు. గాజాకు మానవతా సాయం అందించేందుకు మార్గాలు తెరవాలని ఓవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్ ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ సైన్యం ఈ ప్రకటన చేసింది.

మరోవైపు ఉత్తర గాజాలో పోరాటం కొనసాగుతుండగా, వందలాది మంది గాయపడిన విదేశీయులు, భిన్న దేశాల పౌరసత్వం కలిగిన వారు రఫా సరిహద్దు క్రాసింగ్ ద్వారా ఈజిప్ట్ కోసం జరిగిన యుద్ధంలో దెబ్బతిన్న ప్రాంతం నుండి తప్పించుకున్నారు. నిన్న రెండవ రోజున 21 మంది గాయపడిన పాలస్తీనియన్లు, 72 మంది పిల్లలతో సహా 344 మంది విదేశీ పౌరులు సరిహద్దు దాటినట్లు ఈజిప్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
మరోవైపు అక్టోబరు 7 దాడుల సమయంలో హమాస్ అదుపులోకి తీసుకున్న తమ పౌరులు, మిలిటరీ 240 మంది బందీలను విడిపించేందుకు ఇజ్రాయెల్ సైన్యం ప్రయత్నిస్తోంది. బందీలుగా ఉన్నవారిని కనుగొనే ప్రయత్నంలో అమెరికా గాజాపై డ్రోన్లను ఎగురవేస్తోంది. అయినా వారి జాడ దొరకడం లేదు. దీంతో ఇజ్రాయెల్ గాజాపై దాడుల విషయంలో అస్సలు పట్టువీడటం లేదు. అదే సమయంలో ఇజ్రాయెల్ సైనికులను మట్టుబెట్టేందుకు హమాస్ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తోంది.












Click it and Unblock the Notifications