అక్కడి ప్రజలకు బిగ్ షాక్.. నీరు, గ్యాస్, విద్యుత్ బంద్..!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అలాగే కొనసాగుతున్నాయి. ఇరాన్- అమెరికా యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలు సంక్షోభంలో మునిగిపోయాయి. ప్రపంచ రవాణాకు కీలకంగా ఉన్న హార్మూజ్ జలసంధిపై ఇరాన్ ఆంక్షలు విధించిన నేపథ్యంలో పేద, మధ్య తరగతి దేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్న.. అభివృద్ధి చెందిన దేశాలు సైతం తీవ్ర ఇబ్బందులను చవిచూస్తున్నాయి. అసలే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న పాకిస్థాన్ పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా పెనం నుంచి పొయ్యిలో పడినట్లుగా అయింది. ఇప్పటికే ఇంధన, గ్యాస్ సంక్షోభాన్ని అధిగమించేందుకు పాకిస్థాన్ లో లాక్ డౌన్ తరహా ఆంక్షలను విధించిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా ముస్లింలకు ముఖ్యమైన పండగ ఈద్ ఉల్ అజ్హా(బక్రీద్) వేళ అక్కడి ప్రజలకు బిగ్ షాక్ తగిలింది. పాకిస్థాన్ ఆర్థిక రాజధాని అయిన కరాచీ నగరంలో సంక్షోభం తలెత్తింది. తీవ్రమైన ఎండల కారణంగా నీటి కొరత ఏర్పడింది. గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. అలాగే విద్యుత్ కోతల కారణంగా మిలియన్ల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన గ్యాస్ కొరత ఉంది. పండగ వేళ వంటలు చేసుకోవడానికి చాలామంది ప్రైవేట్ గ్యాస్ సిలిండర్లను అద్దెకు తెచ్చుకుంటున్నారు. మరికొంతమంది వండుకోవడానికి వీలులేక ప్రైవేట్ రెస్టారెంట్లకు వెళ్లి భారీ మొత్తంలో డబ్బులు చెల్లించి మాంసం వండించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కరాచీతోపాటు దేశ రాజధాని ఇస్లామాబాద్ లోనూ నీటి సమస్య అధికంగా ఉంది. పండగ వేళ నీరు లేక రూ. 8000 కు పైగా ఖర్చు చేసి ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లను కొనుగోలు చేస్తున్నారు ప్రజలు. ఇక ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్ ను గంటలపాటు నిలిపివేస్తున్నారు. దాంతో ప్రజలు ఎండలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు మున్సిపల్ సేవలు అందించడంలో వైఫల్యం అయినప్పటికీ గ్యాస్, విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని ఆయా సంస్థలు ప్రకటిస్తున్నాయి. దాంతో ఆగ్రహించిన స్థానికులు పలు ప్రాంతాల్లో రోడ్లను దిగ్బంధించి మున్సిపల్ అధికారులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసనలు చేపట్టారు.












Click it and Unblock the Notifications