అఫ్గానిస్తాన్: ప్రపంచం ఏమనుకున్నా 'ఆత్మాహుతి దాడి చేసేవారు మాకు హీరోలే' - తాలిబాన్లు
2011లో కాబుల్లోని ఫైవ్స్టార్ ఇంటర్కాంటినెంటల్ హోటల్పై తాలిబాన్లు ఆత్మాహుతి దాడి జరిపి తొమ్మిదేళ్లు అవుతోంది. ఇప్పుడు అదే ఫైవ్స్టార్ ఇంటర్కాంటినెంటల్ హోటల్కు ఆత్మాహుతి బాంబర్ల కుటుంబాలను ఆహ్వానించి వారికి నగదు పారితోషికం, బహుమతులు అందించింది తాలిబాన్.
ఈ వేడుకకు హాజరైన హక్కానీ నెట్వర్క్ అధిపతి, అఫ్గాన్ హోం మంత్రి సిరాజుద్దీన్ హక్కానీ ఆత్మాహుతి బాంబర్ల గురించి మాట్లాడుతూ.. "వారు దేశానికి, మాకు హీరోలు" అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.
ఆత్మాహుతి బాంబర్ కుటుంబాలకు 10,000 అఫ్గాన్ రూపాయలతోపాటు ప్లాట్లు ఇస్తామని తాలిబాన్లు హామీ ఇచ్చారు.
యుద్ధ వ్యూహాలలో ఆత్మాహుతి దళాలను ఉపయోగించడం తాలిబాన్లకు మాత్రమే పరిమితం కాదు. జపాన్ సైన్యంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా అనేక సైనిక, మిలిటెంట్ గ్రూపులు శత్రు దళాలపై ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డాయి.
తాలిబాన్లు తమ ఆత్మాహుతి బాంబర్లను బహిరంగంగా ప్రోత్సహించడం చాలా మందిని ఆశ్చర్యపరచగా, మరికొందరికి కోపం తెప్పించింది.
- '13 ఏళ్ల నా చెల్లెలిని బలవంతంగా పెళ్లి చేసుకుంటామని తాలిబాన్లు మెసేజ్ పంపించారు’
- పాకిస్తాన్ నుంచి అఫ్గానిస్తాన్కు డాలర్ల స్మగ్లింగ్ జరుగుతోందా... పాక్ రూపాయి పడిపోవడానికి అదే కారణమా?
వీరి ఆగ్రహానికి ప్రధాన కారణం ఈ ఆత్మాహుతి దాడులలో మరణించిన వారిలో ఎక్కువ మంది సాధారణ అఫ్గాన్ పౌరులున్నారు. 'హీరో ఆఫ్ ది నేషన్' అని పిలుస్తున్న తాలిబాన్ ఆత్మాహుతి బాంబర్లు హోటల్పై రెండుసార్లు దాడి చేశారు. వీరి దాడుల్లో డజన్ల కొద్ది అఫ్గాన్ పౌరులు మరణించారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను తాలిబాన్లు సోషల్ మీడియాలో పంచుకోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. వీరి దాడుల్లో విదేశీ సైనికులతో పాటు అనేక మంది పౌరులు కూడా మరణించారంటూ చాలా మంది అఫ్గాన్ పౌరులు తీవ్రంగా ప్రతిస్పందించారు. ఆత్మాహుతి దళాలను తాలిబాన్లు ప్రశంసించడం విచారకరమన్నారు.
అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత తాలిబాన్లు తమ ఆత్మాహుతి బాంబర్లను ఇలా ప్రశంసించడం ఇదే మొదటిసారి కాదు.
కాబూల్ను స్వాధీనం చేసుకున్న తర్వాత, తాలిబాన్ నాయకుడు అనాస్ హక్కానీ ఆత్మాహుతి బాంబర్ సమాధి వద్ద నివాళులు అర్పించారు. దీనికి సంబంధించి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
దీంతోపాటూ, దాడి చేసిన వారిని ప్రశంసిస్తూ తాలిబాన్ ఒక వీడియోను కూడా విడుదల చేసింది. ఇందులో తాలిబాన్ కోసం ఆత్మాహుతికి పాల్పడిన వారి ఫోటోలు, పేర్లు ఉన్నాయి. దీని తరువాత, తాలిబాన్తో సంబంధం ఉన్న సోషల్ మీడియా ఖాతాలో ఆత్మాహుతి దాడులకు ఉపయోగించిన జాకెట్లను చూపిస్తున్న వీడియో కూడా విడుదల చేశారు.
- ప్రాణభయంతో సోషల్ మీడియా ఖాతాలను డిలీట్ చేస్తున్న యూజర్లు
- తాలిబాన్లు రావడం సంతోషమే అంటున్న ఓ అఫ్గాన్ కుటుంబం
'ఆత్మాహుతి దాడి చేసేవారు మా హీరోలు'
ఒకవైపు బాధ్యతాయుత పాలనతో అంతర్జాతీయ సమాజం దృష్టిలో మిలిటెంట్ సంస్థ ఇమేజ్ని చెరిపేయడానికి అఫ్గాన్ తాలిబాన్ ప్రయత్నిస్తోంది. మరోవైపు ఉగ్రదాడులకు సంకేతంగా భావించే ఆత్మాహుతి దాడులు చేసేవారిని ప్రశంసించడం వారికి ఇబ్బందులను తెచ్చిపెట్టేలా ఉంది.
విదేశీ సైన్యాలతో జరిగిన యుద్ధంలో ఎందరో తాలిబాన్ల ప్రాణ త్యాగాల కారణంగానే తాము ఈ విజయం సాధించగలిగామని తాలిబాన్ హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఖారీ సయీద్ ఖోస్తీ అన్నారు.
"ఈ ఆత్మాహుతి బాంబర్లు మన హీరోలు, మన హీరోలను ప్రశంసించడం మన కర్తవ్యం. ఇది మన అంతర్గత విషయం. కాబట్టి మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదు" అని అన్నారు.
ఆత్మాహుతి బాంబర్లను ప్రశంసించడంపై వస్తున్న విమర్శలను ఖారీ సయీద్ తోసిపుచ్చారు. వీరి దాడుల్లో అఫ్గాన్ పౌరులు చనిపోలేదని పేర్కొన్నారు.
కాగా, 2011లో కాబూల్లోని ఇంటర్కాంటినెంటల్ హోటల్పై జరిగిన ఆత్మాహుతి దాడిలో 11 మంది అఫ్గాన్ పౌరులు మరణించారు. 20 సంవత్సరాల పాటు జరిగిన యుద్ధంలో వందలాది ఆత్మాహుతి దాడులు జరిగాయి. వందలాది మంది అఫ్గాన్ పౌరులు మరణించారు.
- తాలిబాన్లతో ట్రంప్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందమే అఫ్గానిస్తాన్ ప్రస్తుత సంక్షోభానికి కారణం: అమెరికా రక్షణ అధికారులు
- బ్యాంకులలో డబ్బు మొత్తం విత్డ్రా చేసుకుంటున్నారు
బహిరంగంగా ప్రశంసించడం వల్ల ప్రయోజనం ఏంటి?
"ఆత్మాహుతి బాంబర్లకు తాలిబాన్లు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. సిరాజుద్దీన్ హక్కానీ కూడా వేడుకలో ప్రసంగిస్తూ, అమెరికా దాని మిత్రదేశాలపై తాలిబాన్ విజయానికి ఆత్మాహుతి బాంబర్లు నిజమైన ఆయుధాలు అని పేర్కొన్నారు.
కాబట్టి, ఇది తాలిబాన్ల నుంచి వారి పోరాట యోధులకు ఇచ్చే ఒక సందేశంలాంటిది. వారు మనుగడలో లేకపోయినా, తాలిబాన్ నాయకత్వం పట్ల వారికి ఇప్పటికీ అపారమైన విలువ, గౌరవం ఉంది" అని నిపుణులు అబ్దుల్ సయీద్ పేర్కొన్నారు.
హత్యకు గురైన ఆత్మాహుతి బాంబర్లందరి కుటుంబాలకు తాలిబాన్ ప్రత్యేక కార్డులను అందజేస్తుందని, తద్వారా దేశంలో వారిని ప్రత్యేక గౌరవంతో చూస్తామని హక్కానీ చెప్పారు.
తాలిబాన్ల ఈ చర్య, ప్రభుత్వం గుర్తింపు కోసం చేసే ప్రయత్నాలను దెబ్బతీసేదిలా ఉందని అబ్దుల్ సయీద్ చెప్పారు.
"ఈ వేడుకను నిర్వహించినందుకు సిరాజుద్దీన్ హక్కానీని తాలిబాన్ మద్దతుదారులు ప్రశంసిస్తున్నారు. కానీ మరో వైపు బయటి ప్రపంచం నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామాలు రాజకీయంగా ఇరుకునపెట్టేవిగా ఉండే అవకాశం ఉంది" అని అబ్దుల్ సయీద్ తెలిపారు.
''తమతో సోదరభావంతో వ్యవహరించాలని ప్రపంచాన్ని ఒప్పించేందుకు తాలిబాన్లు ప్రయత్నిస్తున్నారు. దీని కోసం తాలిబాన్లు తమ హింసాత్మక గతం నుంచి బయటపడాలని ప్రపంచం ఆశిస్తోంది''అని ఆయన చెప్పారు. ''కానీ వారి విజయంలో కీలకంగా మారి మానవ బాంబుల పాత్ర పోషించిన వారితో సంబంధాలు తెంచుకోవడం తాలిబాన్లకు సాధ్యం కాదు'' అన్నారు.
తాలిబాన్ దాని హింసాత్మక గతాన్ని చూసి గర్విస్తున్నప్పుడు అఫ్గాన్ను బాధ్యతాయుతమైన దేశంగా అంగీకరించవచ్చా? అంటూ తాలిబాన్ల చర్యలపై పాశ్చాత్య మీడియాలో అనేక ప్రశ్నలు వస్తున్నాయి.
- తాలిబాన్ల ప్రభుత్వాన్ని పాకిస్తాన్, చైనా, రష్యా ఎందుకు గుర్తించట్లేదు? 7 కీలక ప్రశ్నలు, సమాధానాలు..
- ఆరుగురు పిల్లల తల్లిని మిలిటెంట్లు సెక్స్ బానిసగా తీసుకెళ్లారు, సైన్యం రక్షించింది
''తాలిబన్ల వైఖరి మిలిటెంట్లలా ఉంది''
తాలిబాన్లో మూడు రకాల గ్రూపులు ఉన్నాయని అఫ్గానిస్తాన్కి చెందిన రాజకీయ విశ్లేషకులు అజీజ్ అమిన్ చెప్పారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఒక వర్గం ఉదారవాదులు. వీరు దోహాలో రాజకీయ సంప్రదింపులు, దౌత్యంలో నిమగ్నమై ఉండేవారు. రెండో వర్గం హక్కానీ నెట్వర్క్తో సహా తీవ్రవాదులు. వీరి విజయానికి తమ యుద్ధ వ్యూహాలే కారణమని నమ్ముతారు. కాబట్టి తాలిబాన్లు వారి కరుడుగట్టిన వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం లేదనుకుంటారు.
మూడవ వర్గం ఈ రెండింటి బలాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించి, తద్వారా సరైన సమయం వచ్చినప్పుడు, ఎవరికి మద్దతు ఇవ్వాలో నిర్ణయించుకుంటారు.
"ఒక వర్గం అఫ్గాన్ తాలిబాన్లు తమను దౌత్యం ద్వారా ప్రపంచానికి ఉదారవాద, శాంతి-ప్రేమగల దేశంగా చూపించుకోవాలని ప్రయత్నిస్తుండగా, మరొక సమూహం దాని సిద్ధాంతం ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటోంది. దీన్నిబట్టి తాలిబాన్ల మధ్య ఒకే విధానంపై ఏకాభిప్రాయం లేదని అర్థమవుతోంది" అని అజీజ్ అమిన్ పేర్కొన్నారు.
"తాలిబాన్ల చర్యలు వారి విశ్వసనీయతపై ప్రభావం చూపినప్పటికీ, ఇది వారి యోధులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం మాత్రమే" అని అజీజ్ అమిన్ చెప్పారు.
"తాలిబాన్ వైఖరి పాలకుల వైఖరి కాదు. మిలిటెంట్లే ఇలా చేస్తారు. కాబట్టి ఇది సాధారణ ప్రజలను ఎంత బాధపెడుతుందో వారు పట్టించుకోరు, ఎందుకంటే ఈ దాడులలో మరణించిన వారిలో ఎక్కువ మంది అఫ్గాన్ పౌరులు" అని అమీన్ అన్నారు.
- అఫ్గానిస్తాన్: తమకు శిక్షలు విధించిన మహిళా జడ్జిలను వెంటాడుతున్న తాలిబాన్లు
- అఫ్గానిస్తాన్ యుద్ధంతో వేల కోట్లు లాభం పొందిన 5 కంపెనీలు ఇవే..
తిరుగుబాటుకు ఆజ్యం
ఈ కార్యక్రమానికి హక్కానీ నెట్వర్క్ అధినేత సిరాజుద్దీన్ హక్కానీ హోస్ట్గా వ్యవహరించారు. హక్కానీ నెట్వర్క్ను అమెరికా, ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఉగ్రవాద సంస్థగా గుర్తించిన అంశం తెలిసిందే. అఫ్గానిస్తాన్లో జరిగిన 20 సంవత్సరాల యుద్ధంలో నాటో, అమెరికా దళాలపై అత్యంత వినాశకరమైన దాడుల వెనుక హక్కానీ నెట్వర్క్ పాత్ర ఉంది.
దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా మిలిటెంట్లు, ఆత్మాహుతి బాంబర్లకు శిక్షణనిచ్చి వారిని ఉపయోగించుకోవడంలో హక్కానీ నెట్వర్క్ ప్రసిద్ధి చెందింది. ఒసామా బిన్ లాడెన్, అబ్దుల్లా యూసుఫ్ అజ్జాం వంటి మిలిటెంట్లు కూడా హక్కానీ నెట్వర్క్ ద్వారా శిక్షణ పొందినవారే.
ఆత్మాహుతి బాంబర్లను తాలిబన్లు బహిరంగంగా ప్రశంసిస్తే ఈ ప్రాంతంలో అతివాదాన్ని ప్రోత్సహించినట్టు అవుతుందని ఉగ్రవాద నిరోధక నిపుణులు అబ్దుల్ సయీద్ చెప్పారు. మిలిటెంట్ గ్రూపులు తమ అంగబలం పెంచుకోవడానికి, సభ్యుల విశ్వాసాన్ని చూరగొనడానికి ఇలాంటి చర్యలు ఎంతో ఉపయోగపడతాయని అబ్దుల్ సయీద్ అభిప్రాయపడ్డారు.
"ఆత్మాహుతి బాంబర్లను గర్వించదగిన హీరోలుగా ప్రశంసిస్తున్నారు. ఇతర యువకులపై కూడా దీని ప్రభావం ఉంటుంది. సమాజంలో లేదా స్నేహితుల వద్ద అలాంటి గౌరవాన్ని పొందాలనే ఆలోచనను రేకెత్తిస్తుంది. ముఖ్యంగా అన్ని రకాలుగా జీవితంలో నిరుత్సాహంగా ఉన్న యువత వీరివైపు సులభంగా ఆకర్షితులవుతారు" అని అబ్దుల్ సయీద్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఐఐటీ ప్రవేశ పరీక్షలో టాపర్ తమ వాడేనంటూ శ్రీచైతన్య, నారాయణ సంస్థల ప్రకటనలు, అసలు మృదుల్ అగర్వాల్ ఎక్కడ చదువుకున్నారు?
- ఆపరేషన్ తర్వాత గాలిని ఇంజెక్ట్ చేసి నలుగురిని చంపేశాడు
- పెట్రోల్, గ్యాస్ ఉత్పత్తి పెరగడంపై ఆందోళన ఎందుకు?
- India vs Pakistan: 'అభిమానుల్లో ఇదివరకటిలా ఆవేశం లేదు.. కానీ థ్రిల్ మాత్రం కొనసాగుతోంది’
- దట్టమైన అడవిలో రూ .55,000 కోట్ల విలువైన వజ్రాల గనుల వేట
- సమంత కేసు: యూట్యూబ్ చానళ్లలో ఎవరినైనా, ఏమైనా అనేయొచ్చా? నిబంధనలు ఏం చెబుతున్నాయి
- తైవాన్పై చైనా దాడి చేస్తే అమెరికా ఏం చేస్తుందో చెప్పిన జో బైడెన్
- ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 'బూతు’ సంస్కృతి
- 197 దేశాలు 12 రోజుల పాటు స్కాట్లాండ్లో ఎందుకు సమావేశమౌతున్నాయి? ఈ సదస్సుతో సాధించేదేమిటి?
- ఆంధ్రాలో లేటరైట్ ఖనిజం కోసం అనుమతులు తీసుకుని బాక్సైట్ తవ్వేస్తున్నారా? ఇది ఎలా జరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)