‘పాక్లో ఉన్న గీత మా కూతురే.. ఆమె పేరు పూజ’
అమృత్సర్: పాకిస్థాన్లోని ఓ స్వచ్ఛంద సంస్థ సంరక్షణలో ఉన్న మూగ, చెవిటి యువతి గీత తమ కూతురేనని అమృత్సర్కు చెందిన ఓ దంపతులు ముందుకొచ్చారు. 13ఏళ్ల క్రితం పాకిస్థాన్లో తప్పిపోయి.. తన తల్లిదండ్రులను కలుసుకోవాలని మనోవేదనకు గురవుతున్న భారత యువతి కథనం ఇటీవల భారత్-పాకిస్థాన్ దేశాల మీడియానే కాకుండా పలువురి దృష్టిని ఆకర్షించింది.
ఈ నేపథ్యంలో ‘గీత మా కూతురే' అని అమృత్సర్కు చెందిన రాజేశ్కుమార్, రామ్దులారీ దంపతులు తమ కుమారుడు రాజు సహాయంతో ఓ ప్రైవేట్ టెలివిజన్ ఛానెల్ను ఆశ్రయించారు. దీంతో లైవ్ కవరేజీ ద్వారా దంపతులు, పాకిస్థాన్లోని ఈధీ ఫౌండేషన్ ప్రతినిధులతో టెలివిజన్ చానెల్ సంప్రదింపులు జరిపింది.
ఇప్పుడు గీతగా పిలవబడుతున్న అమ్మాయికి తాము పూజ అని పేరు పెట్టుకున్నామని, తాము పూజను ప్రేమగా గుడ్డీ అని కూడా పిలుచుకునేవారమని ఆ దంపతులు చెప్పారు. తమ పాప అమృత్సర్ రైల్వే స్టేషన్లో తప్పిపోయిందని తెలిపారు.
వీరి కుమారుడు రాజు మీడియాతో మాట్లాడుతూ.. తాము బీహార్ నుంచి అమృత్సర్ వచ్చామని, యాచకులుగా ఉంటూ.. చెత్త ఏరుకుంటూ జీవనం సాగించే వాళ్లమని చెప్పాడు. తమ కుమార్తెను తిరిగి తమ వద్దకు చేర్చాలని కోరుతూ.. ఆమె చిన్నప్పటి చిత్రాన్ని ఆ తల్లిదండ్రులు చూపారు.
కాగా, టెలివిజన్ ప్రత్యక్ష ప్రసారంలో అమృత్సర్కు చెందిన దంపతులను చూసి.. వారు తన తల్లిదండ్రులు కాదని గీత తేల్చేయడం ఈ వ్యవహారంలో కొసమెరుపు. తన తల్లి పంజాబీ సల్వార్ ధరించదని, చీరలే కడుతుందని గీత తెలిపినట్లు సమాచారం.
గీతను తమ కూతురంటూ ఓ దంపతులు స్పందించడం ఈ వ్యవహారంలో మంచి పరిణామమేనని పాక్ మానవహక్కుల నేత అన్సార్ బర్నీ అన్నారు. అమ్మాయిని అప్పగించే ముందు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని సూచించారు.