కూలిన విమానం: 295 మంది మృతి, పేల్చివేత?
ఉక్రెయిన్: నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్ డామ్ నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్ వస్తున్న మలేషియా ఎయిర్లైన్స్ విమానం ఉక్రెయిన్లో కూలిపోయింది. విమానంలో 295 మంది ఉన్నారు. వారంతా మరణించి ఉంటారని అనుమానిస్తున్నారు. క్షిపణితో విమానాన్ని పేల్చి వేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
వెంటనే సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి పది గంటల సమయానికి వంద మృతదేహాలు సంఘటనా స్థలంలో ఉన్నాయి. గ్రాబోవో గ్రామం వద్ద ఈ సంఘటన జరిగింది. విమానం శకలాలు దాదాపు 15 కిలోమీటర్ల చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.
విమానంలో ఉన్నవారిలో 280 మంది ప్రయాణికులతో పాటు విమానం సిబ్బంది కూడా మృత్యువాత పడ్డారని భావిస్తున్నారు. ఉక్రెయిన్ అధికారులకు సహకరించాలని అమెరికా శ్వేత సౌధం తన దేశం అధికారులను ఆదేశించింది. రష్యా సరిహద్దుల్లో ఈ ప్రమాదం సంభవించింది.
నాలుగు నెలల క్రితం మలేషియా ఎయిర్లైన్స్ ఎంహెచ్ విమానం అదృశ్యమైన విషయం తెలిసిందే. ఈ విమానంలో 295 మంది ఉన్నారు. వారి జాడ కనిపించలేదు. విమానంలోని 280 మంది ప్రయాణికులు, 15 మంది విమాన సిబ్బంది కూడా మరణించినట్లు మలేషియా హోం శాఖ నిర్ధారించింది. ఎంహెచ్ - 17 విమానంతో సంబంధాలు తెగిపోయాయని, ఆ తర్వాత కూలిపోయినట్లు తెలిసిందని, అందులో ఉన్నవారంతా మరణించారని మలేషియన్ ఎయిర్లైన్స్ సంస్థ కూడా తెలిపింది.
స్థానిక కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్న గం.12.14 నిమిషాలకు బయలుదేరిన ఈ విమానం శుక్రవారం ఉదయం గం.6.10 నిమిషాలకు కౌలాలంపూర్ చేరుకోవాల్సి ఉంది. ఈలోపే ప్రమాదం సంభవించింది. ఈ బోయింగ్ విమానం గంటకు 950 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఇరు ప్రాంతాల మధ్య దూరం ఎక్కువ కాబట్టి ఈ విమానాన్ని ఉపయోగిస్తారు. ప్రమాద విషయాన్ని రష్యా వార్తా సంస్థ ఇంటర్ ఫాక్స్ తొలుత బయటపెట్టింది. ఆ తర్వాతనే మలేషియా ఎయిర్లైన్స్ నిర్ధారించింది.