అమెరికా కాన్సులేట్పై ఇరాన్ మిస్సైళ్ల దాడి: క్షిపణుల విధ్వంసం: రష్యా ఉక్రెయిన్ యుద్ధం వేళ
వాషింగ్టన్: రష్యా.. తన పొరుగు దేశం ఉక్రెయిన్పై ఎడతెగని యుద్ధాన్ని కొనసాగిస్తోంది. 18 రోజులుగా తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తూ వస్తోంది. ఉక్రెయిన్లోని దాదాపు అన్ని రీజియన్లపైనా రష్యా బాంబుల మోత మోగిస్తోంది. ఇప్పటికే పలు నగరాలు రష్యా సైనిక బలగాల ఆధీనంలోకి వెళ్లాయి. తూర్పు ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నట్టే కనిపిస్తోంది. రాజధాని కీవ్ను సొంతం చేసుకోవడానికి రష్యా చేస్తోన్న ప్రయత్నాలను ఉక్రెయిన్ సైన్యం- సమర్థవంతంగా అడ్డుకుంటోంది. మిగిలిన రీజియన్లు, నగరాల్లో ఈ తరహా పరిస్థితులు కనిపించట్లేదు.
ఉక్రెయిన్కు అండగా ఉన్నవేళ..
ఉక్రెయిన్పై దండెత్తిన రష్యాను నిలువరించడానికి అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా సహా యూరోపియన్ యూనియన్ దేశాలు అన్ని రకాలుగా ఆంక్షలను విధించాయి. ఆ దేశంతో అన్ని సంబంధాలను తెంచుకున్నాయి. రష్యాను ధీటుగా ఎదిరించడానికి అవసరమైన ఆయుధ సామాగ్రిని సమకూర్చుతున్నాయి. ఆర్థికంగా ఆదుకుంటోన్నాయి. యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలన్నీ ఉక్రెయిన్కు అండగా నిలిచాయి. తమ ఆయుధ సంపత్తిని అందజేస్తోన్నాయి. ఫలితంగా- ఉక్రెయిన్ ఊహించినంత తేలిగ్గా రష్యాకు లొంగట్లేదనేది స్పష్టమౌతోంది.
అమెరికాను రెచ్చగొట్టేలా ఇరాన్..
ఈ పరిణామాల మధ్య ఇరాన్- అనూహ్య చర్యకు దిగింది. ఏకంగా అగ్రరాజ్యం అమెరికాను రెచ్చగొట్టింది. ఇరాక్లోని అమెరికా కాన్సులేట్పై మిస్సైళ్లతో దాడి చేసింది. డజనుకు పైగా క్షిపణులను సంధించింది. ఈ తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకుంది. దీన్ని అమెరికా రక్షణ శాఖ అధికారులు ధృవీకరించారు. ఇరాన్ భూభాగంపై నుంచి 12 బాల్లిస్టిక్ మిస్సైళ్లు ఇరాక్లోని తమ కాన్సులేట్ కార్యాలయం వైపు దూసుకొచ్చాయని నిర్ధారించారు.
ఇర్బిల్లోని అమెరికన్ కాన్సులేట్పై..
ఇరాక్ ఉత్తర ప్రాంతంలోని ఇర్బిల్ సిటీలో ఉంటుంది అమెరికన్ కాన్సులేట్. ఇరాన్, టర్కీ దేశాల సరిహద్దులకు సమీపంలో ఉంటుందీ ఇర్బిల్ నగరం. కుర్దిస్తాన్ రీజియన్లోని అతి పెద్ద నగరం ఇదే. సుమారు 15 లక్షల వరకు జనాభా ఉంటుందీ నగరంలో. ఇక్కడున్న అమెరికన్ కాన్సులేట్ను లక్ష్యంగా చేసుకుని ఈ తెల్లవారు జామున ఇరాన్.. మిస్సైళ్లతో విరుచుకుపడింది. వరుసబెట్టి 12 మిస్సైళ్లను సంధించింది.
ప్రాణాపాయం లేనప్పటికీ..
ఈ ఘటనలో ప్రాణాపాయం సంభవించలేదని అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఆస్తి నష్టం కూడా సంభవించలేదని, మిస్సైళ్లు ఎక్కడ పడ్డాయనే విషయంపై ఆరా తీస్తున్నామని పేర్కొన్నారు. ఇరాక్ సైన్యాధికారుల వాదన మరోలా ఉంది. అమెరికన్ కాన్సులేట్, పరిసర ప్రాంతాలు ధ్వంసం అయ్యాయని నిర్ధారించారు. ఎలాంటి ముందస్తు సంకేతాలు లేకుండా ఇరాన్ భూభాగంపై నుంచి మిస్సైళ్లు ఇర్బిల్లోని అమెరికన్ కాన్సులేట్ వైపు దూసుకొచ్చాయని స్పష్టం చేశారు.
ఇరాన్ గార్డ్స్పై దాడికి ప్రతీకారమా?
సిరియాలోని ఇరాన్ రివాల్యూషనరీ గార్డ్స్ కార్ప్ప్ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ ఇటీవలే వైమానిక దాడులను సాగించిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో ఇద్దరు రివాల్యూషనరీ గార్డ్స్ మరణించారు. ఈ దాడికి ప్రతీకారాన్ని తీర్చుకుంటామని అప్పుడే హెచ్చరించిందీ ఇరాన్ మద్దతు ఇస్తోన్న రివాల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్. ఆ తరువాతే- ఇరాన్ తాజాగా బాల్లిస్టిక్స్ మిస్సైళ్లతో అమెరికన్ కాన్సులేట్ కార్యాలయంపై దాడికి దిగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.