పిలిప్పైన్స్ మరుభూమి, మృతులు 10వేలకు పైనే
టాక్లోబన్ (ఫిలిప్పైన్స్): టైఫూన్ తుఫాను పిలిప్పైన్స్ను మరుభూమిగా మార్చింది. బీభత్సం సృష్టించింది. ఈ హయన్ తుఫాను బీభత్సానికి పది వేల మందికి పైగా మృత్యువాత పడినట్లు అంచనా వేస్తున్నారు. దేశంలోని పట్టణాలను తుడిచెపెట్టేసింది. కాగా, తుఫాను బాధితుల సంఖ్య కూడా లక్షల్లోనే ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
సహాయ పునరావాస చర్యలను ముమ్మరం చేయడంతో మృతులు, బాధితుల సంఖ్య మరింత పెరుగుతోంది. తుఫాను సమయంలో సునామీ తరహా అలలు విరుచుకుపడ్డాయి, భీకర సుడిగాలులు ఇళ్లను సైతం సర్వనాశనం చేశాయి. ఫిలిప్పైన్స్కు అన్ని రకాల సహాయం అందిస్తామని, మిలటరీని పంపిస్తామని అమెరికా ప్రకటించింది. "టాక్లోబన్ పూర్తిగా ధ్వంసమైంది. పట్టణమంతా ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. కొంతమంది కుటుంబ సభ్యులను కోల్పోయి పిచ్చివాళ్లుగా మారిపోయారు'' అని హైస్కూల్ టీచర్ ఆండ్య్రూ పోమెడా తెలిపారు.

ఆకలికి తట్టుకోలేక ప్రజలు హింసకు దిగుతున్నారని, చిన్నారులకు పాలు, ఆహారం కోసం వ్యాపార సంస్థలను, మాల్స్ను లూటీ చేస్తున్నారని వివరించారు. వారం రోజుల్లో కేవలం ఆహారం కోసమే ఒకరిని మరొకరు చంపుకుంటారేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. టాక్లోబన్ పట్టణంలో ఇప్పటి వరకు అధికారిక అంచనాల ప్రకారమే పది వేలకు పైగా మరణించారని చీఫ్ సూపరింటెండెంట్ ఎల్మర్ సోరియా తెలిపారు.
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో 70-80 శాతం ఇళ్లు, ఇతర నిర్మాణాలు తుడిచిపెట్టుకుపోయాయని తెలిపారు. హయన్ తుఫాను తొట్టతొలిగా సామర్ పట్టణాన్నే తాకిందని, మరో 2000 మంది గల్లంతయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. మిగిలిన పట్టణాల్లోనూ పదుల సంఖ్యలోనే మృతులు ఉండవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదిలావుంటే, హయన్ తుఫాను నష్టాన్ని గణనీయంగా తగ్గించడానికి చైనా ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. ఆ దేశ వాతావరణ విభాగంలో రెండో అతి పెద్ద హెచ్చరిక ఇదే. మరోవైపు, ఈ ఏడాదిలో చైనా తీరాన్ని తాకిన 30వ.. అతి భారీ తుఫాను ఇదే. ఇక, ఫిలిప్పైన్స్ బీభత్సం నేపథ్యంలో వియత్నాం ముందే జాగ్రత్తపడింది. ఏకంగా ఆరు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది.












Click it and Unblock the Notifications