పసికందును ఫ్రిజ్ లో పెట్టి చంపిన తల్లి
న్యూయార్క్: పసికందును రిఫ్రిజిరేటర్ లో పెట్టిన ఓ తల్లి తన కుమారుడిని హత్య చేసిన సంఘటన దక్షిణ కరోలినాలో జరిగింది. ఎంజెలా బ్లాక్ వెల్ (27) అనే మహిళ తన నాలుగు రోజుల పసికందు విలియం డేవిడ్ బ్లాక్ ను హత్య చేసిందని పోలీసులు చెప్పారు.
విలియం డేవిడ్ ను మూడు గంటల పాటు ఫ్రిజ్ లో పెట్టడం వలన అతను హైపోథెర్మియా బారిన పడి ప్రాణాలు విడిచాడని దర్యాప్తు జరిపిన పోలీసు అధికారులు తెలిపారు. గత ఆరు నెలల నుంచి కేసు దర్యాప్తు చేశారు.
దర్యాప్తు పూర్తి అయిన తరువాత విలియం డేవిడ్ ను అతని తల్లి ఎంజెలా హత్య చేసిందని నిర్దారించామని పోలీసు అధికారులు తెలిపారు. అందుకే ఆమెను కోర్టు ముందు హాజరుపరిచామని పోలీసులు చెప్పారు.
విచారణ కోసం, ఆధారాల కోసం తాము ఇంత సమయం తీసుకున్నామని ఎంజెలా హత్య చేసిందని నిర్దారించిన తరువాతే అరెస్టు చేసి తీసుకు వచ్చామని పోలీసులు కోర్టులో చెప్పారు. న్యాయస్థానం ప్రశ్నిస్తున్న సమయంలో ఎంజెలా మౌనంగా ఉన్నారు.
న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు ఆమె తల మాత్రం ఊపుతూ సమాధానం ఇచ్చారు. నవంబర్ 10వ తేదిన ఎంజెలాను కోర్టు ముందు హాజరు పరచాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై బాలుడి తాత (ఎంజెలా మామ) స్పందించారు.
ఎంజెలా తల్లి అయిన సందర్బంలో ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. అలాంటి తన కోడలు కన్న కొడుకును చంపిందని తాను నమ్మలేకున్నానని, ఎవరో కావాలనే ఇలా చేసి ఆమెకు శిక్షపడేలా చేస్తున్నారని వాపోయారు.