ప్రజలపై దమనకాండ: అన్నంత పని చేసిన అమెరికా: పొరుగు దేశంపై
వాషింగ్టన్: సైనిక పాలనలోకి వెళ్లిన మయన్మార్పై అగ్రరాజ్యం అమెరికా.. ఉక్కుపాదం మోపింది. అక్కడ చెలరేగుతోన్న హింసాత్మక పరిస్థితులు, హత్యాకాండను చూస్తూ ఊరుకోబోమంటూ హెచ్చరికలను జారీ చేస్తూ వచ్చిన అమెరికా అన్నంత పని చేసింది. తాజాగా మయన్మార్ను బ్లాక్లిస్ట్లో ఉంచింది. ఇప్పుడున్న హింసాత్మక వాతావరణాన్ని, ఆందోళనకారులపై కొనసాగిస్తోన్న దమనకాండకు వెంటనే నిలిపివేయకపోతే మున్ముందు మరిన్ని తీవ్ర పరిణామాలను ఎదర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. మరోవంక బ్రిటన్ ప్రభుత్వం కూడా మయన్మార్లో చోటు చేసుకుంటోన్న పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేసింది.
మయన్మార్లో సైనిక పాలనను వ్యతిరేకిస్తూ, అంగ్సాను సూకీ సారథ్యంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలంటూ కొద్దిరోజులుగా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాలను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. గత ఏడాది నిర్వహించిన ఎన్నికల్లో ఎన్ఎల్డీ పార్టీ.. అక్రమాలకు పాల్పడి అధికారంలోకి వచ్చిందనే కారణంతో కిందటి నెల 1వ తేదీన అక్కడి సైన్యాధికారులు తిరుగుబాటు చేశారు. ఎన్ఎల్డీ ప్రభుత్వాన్ని కుప్ప కూల్చారు. సైనిక ప్రభుత్వాన్ని నెలకొల్పారు. ఈ పరిణామాల అనంతరం మయన్మార్లో పెద్ద ఎత్తున ప్రజాందోళనలు, ఉద్యమాలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి.
వాటిని నిర్దాక్షిణ్యంగా అణచి వేస్తోంది అక్కడి సైనిక ప్రభుత్వం. ఉద్యమకారులపై కాల్పులకు తెగబడుతోంది. బుల్లెట్ల వర్షాన్ని కురిపిస్తోంది. బుధవారం నాడు జరిపిన కాల్పుల్లో 38 మంది ప్రదర్శనకారులు మరణించారు. దీని తరువాత..పరిస్థితులు మరింత దిగజారాయి. వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని అమెరికా ప్రభుత్వం దశలవారీగా ఆంక్షలను విధిస్తూ వచ్చింది. ఈ సారి ఏకంగా బ్లాక్లిస్ట్లో ఉంచింది. ఈ మేరకు అమెరికా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ప్రదర్శనకారులపై కాల్పుల పట్ల అమెరికా తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది.
సైనిక ప్రభుత్వం ఏర్పాటైన తరువాత చోటు చేసుకున్న పరిణామాల్లో రక్తసిక్తమైన రోజు (bloodiest day)గా అభివర్ణించింది. మయన్మార్ రక్షణ, హోం మంత్రిత్వ శాఖలు, సైనిక ప్రభుత్వం ఆధీనంలో ఉన్న మయన్మార్ ఎకనమిక్ కార్పొరేషన్, మయన్మార్ ఎకనమిక్ హోల్డింగ్స్ పబ్లిక్ కంపెనీలను బ్లాక్లిస్ట్లో ఉంచినట్లు వెల్లడించింది. బ్యూరో ఆఫ్ ఇండస్ట్రీ అండ్ సెక్యూరిటీపైనా కఠిన ఆంక్షలను విధించింది. ఈ ఆంక్షలు ఇక్కడితో ఆగేవి కావని తేల్చి చెప్పింది. ప్రజా ప్రభుత్వాన్ని పునరుద్ధరించకపోతే మరిన్ని తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది. మయన్మార్లో నెలకొన్న తాజా పరిస్థితుల పట్ల బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సైతం ఆందోళన వ్యక్తం చేశారు.