Nepal floods: 1000కు పైగా పెరిగిన మృతులు.. ఇంకా వేల మంది ఆచూకీ గల్లంతు..
నేపాల్ లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా ఇప్పటి వరకూ 1000 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. సెప్టెంబర్ 1 నాటికి 1,003 కు పైగా మృత దేహాలు లభ్యం అయినట్లు అధికారులు వెల్లడించారు. దాదాపు 4 వేల మందికి పైగా గల్లంతైనట్లు తెలిపారు. వరదల ధాటికి ఎనిమిది జిల్లాల్లోనే అధిక సంఖ్యలో తవ్వే కొద్దీ మృతదేహాలు లభ్యం అవుతున్నట్లు స్పష్టం చేశారు. ఇక ఇప్పటివరకూ 12 వేల మందికిపైగా ప్రజల్ని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్ మెంట్ అథారిటీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
నేపాల్- టిబెట్ సరిహద్దులో భోటేకోశీ నది ఉప్పొంగి వరదలు సంభవించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 26 న సంభవించిన ఈ వరదల కారణంగా నార్త్ అండ్ సెంట్రల్ నేపాల్ లోని పట్టణాలు, గ్రామాలు పూర్తిగా కొట్టుకుపోయాయి. అలాగే రోడ్లు మొత్తం ధ్వంసం అయ్యాయి. ఇళ్లు, వాహనాలు, బ్రిడ్జ్ లు, హైడ్రో పవర్ ప్రాజెక్ట్ లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇక చిత్వానా జిల్లాలో 321 మృత దేహాలను వెలికి తీశారు. నవాల్ పరాసీ జిల్లాలో 216 మృత దేహాలు, నవాల్ పరాసీ వెస్ట్ జిల్లాలో 170 మృత దేహాలు, నువాకోట్ లో 95, ఘోర్కాలో 65, ధాడింగ్ లో 57, రసువా 41, తనాహున్ లో 38 మృత దేహాలను వెలికి తీసినట్లు నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్ మెంట్ అథారిటీ ప్రకటించింది. ఇక దాదాపు 4 వేల మందికి పైగా గల్లంతైనట్లు తెలిపింది. వారిలో 583 మంది విదేశీయులు ఉన్నట్లు స్పష్టం చేసింది.
ఇక ఇప్పటివరకూ 11,814 మందిని రక్షించారు. వారిలో భారత్ లోని తమిళనాడుకు చెందిన 39 మంది యాత్రికులు కూడా ఉన్నారు. వాళ్లు తిరుప్పూర్ నుంచి మానససరోవర్ యాత్రకు వచ్చారు. ఇక నేపాల్ వరదల్లో చిక్కుకున్న వారిలో 158 మంది భారతీయులను నేపాల్ నుంచి స్వదేశానికి తీసుకొచ్చామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో 80 మంది ఇషా ఫౌండేషన్ సభ్యులు వరదల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అయితే అందులో హైదరాబాద్ కు చెందిన తన భార్య శ్రీదేవి వేజెళ్ల కూడా ఉందని తెలిసి అమెరికా పౌరుడు, భారతీయ సంతతికి చెందిన దీపక్ దండు తాజాగా కన్నీటిపర్యంతం అయ్యాడు. వరదల అనంతరం ఆమెతో సంబంధాలు తెగిపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆయన.. భార్య ఆచూకీ కోసం భారత్ కు బయలుదేరారు.

ఇక నేపాల్ లోని రుసువా జిల్లాలో ఇటీవల సంభవించిన వరదల కారణంగా మరణించిన విదేశీ పౌరుల మృతదేహాలను గుర్తించి.. వారి బంధువులకు అప్పగించే ప్రక్రియకు సంబంధించిన వివరాలను నేపాల్ అధికారులు విడుదల చేశారని ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాతే మృతదేహాలను అప్పగిస్తారని పేర్కొంది. పోలీస్ వెబ్ సైట్ లో ఉంచిన మృతుల ఫొటోలు, వివరాల ఆధారంగా బంధువులు ఎవరైనా గుర్తిస్తే.. తదుపరి ప్రక్రియల కోసం స్థానిక అధికారులతో సమన్వయం చేసేందుకు ఖాట్మండులోని రాయబార కార్యాలయ అధికారులు సహాయం అందిస్తారని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications