భారత్ దెబ్బకు తోకముడిచిని నెదర్లాండ్స్: ‘రెస్పెక్ట్ యూన్’ ట్వీట్ డిలీట్ చేసిన డచ్ రాయబారి
న్యూఢిల్లీ: ఉక్రెయిన్-రష్యా సంక్షోభం విషయంలో భారత్కు ఉచిత సలహా ఇవ్వబోయి భంగపడ్డారు నెదర్లాండ్స్ రాయబారి కారెల్ వాన్ ఓస్టెరోమ్. ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర విషయంలో ఐక్యరాజ్యసమితి విధి విధానాలను గౌరవించాలంటూ కారెల్ చేసిన వ్యాఖ్యలకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డచ్ రాయబారి కారెల్ వాన్ చేసిన రెస్పెక్ట్ యూఎన్ ట్వీట్ను తొలగించారు.అంతకుముందు జరిగిన పరిణామాలు ఇలా ఉన్నాయి..
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం విషయంలో భారత్ అనుసరిస్తున్న తటస్ఠ వైఖరిని విమర్శిస్తూ నెదర్లాండ్స్ రాయబారి చేసిన వ్యాఖ్యలకు ఐక్యరాజ్యసమితి(యూనైటెడ్ నేషన్స్)కి భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తామేం చేస్తున్నామో తమకు తెలుసని, తమకు ఎవరూ సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.
ఉక్రెయిన్పై యుద్ధం కొసాగిస్తున్న రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, సాధారణ సభలో పలు తీర్మానాలు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ తీర్మానాలపై ఓటింగ్ కు భారత్ దూరంగా ఉంటూ తటస్థ వైఖరిని అవలంభిస్తోంది. ఈ నేపథ్యంలోనే అమెరికా సహా పలు దేశాలు విమర్శలు చేస్తున్నాయి. ఇటీవల యూకేకు నెదర్లాండ్స్ రాయబారి కారెల్ వాన్ ఓస్టెరోమ్ కూడా భారత్ పై విమర్శనాత్మక వైఖరిని ప్రదర్శించారు.
ఐక్యరాజ్యసమితి విధి విధానాలను భారత్ గౌరవించాలి.. జనరల్ అసెంబ్లీలో ఓటింగ్కు దూరంగా ఉండకూడదు అంటూ కారెల్ వాన్ ట్వీట్ చేశారు. ఉక్రెయిన్ వ్యవహారంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో బుధవారం జరిగిన సమావేశంలో తిరుమూర్తి ఈ ట్వీట్ గురించి ప్రస్తావిస్తూ డచ్ రాయబారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. భారత్కు ఎవరూ సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, తాము ఏం చేస్తున్నామో తమకు తెలుసని స్పష్టం చేశారు. యూఎన్ విధానాలు, అంతర్జాతీయ చట్టాలను తాము గౌరవిస్తామని, అదే సమయంలో అన్ని దేశాల సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రతకు గౌరవిస్తామని పేర్కొన్నారు.
At the UN Security Council meeting on #Ukraine this afternoon, I made the following statement ⤵️ pic.twitter.com/1ZMrEOzADB
— PR/Amb T S Tirumurti (@ambtstirumurti) May 5, 2022
అంతేగాక, ఉక్రెయిన్పై రష్యా దండయాత్రపై భారత్ తన స్పష్టమైన వైఖరిని ఇప్పటికే పలుమార్లు వెల్లడించిందని తిరుమూర్తి తెలిపారు. ఉక్రెయిన్ పై రష్యా దాడులు ప్రారంభించిననాటి నుంచి హింసను ఆపాలని, చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని భారత్ ఆ రెండు దేశాలకు సూచిస్తోందని పేర్కొన్నారు. బుచాలో పౌరుల హత్యను భారత్ తీవ్రంగా ఖండించిందని గుర్తు చేశారు. దీనిపై అంతర్జాతీయ దర్యాప్తు జరపాలన్న అభ్యర్థనలను కూడా సమర్థించిందని చెప్పారు.
ఉక్రెయిన్ కు అండగా ఉండేందుకు ఆ దేశానికి భారత్ మానవతా సాయం కూడా అందించిందని విషయాన్ని తిరుమూర్తి గుర్తు చేశారు. భారత్ ఎప్పుడూ శాంతి వైపే ఉంటుందని స్పష్టం చేశారు. పౌరుల ప్రాణాలను పణంగా పెట్టి యుద్ధం చేస్తున్న దేశాల్లో ఏ దేశం కూడా విజయాన్ని సాధించదని ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.