ఘోరం: నైజీరియాలో మనిషి మాంసం వడ్డించిన రెస్టారెంట్ మూసివేత
హైదరాబాద్: మనిషి మాంసంతో వంటకాలు తయారుచేస్తున్న నైజీరియాలోని ఓ రెస్టారెంట్ను ఆదివారం నాడు పోలీసులు మూసివేశారు. దీనికి సంబంధించిన ఓ వార్తాకథనాన్ని బీబీసీ స్వాహిలీ ప్రచురించింది. అందులో పేర్కొన్న కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
మనిషి మాంసంతో వంటకాలు చేసి వడ్డిస్తున్నారంటూ సమాచారం అందడంతో నైజీరియాలోని అనంబ్ర ప్రాంత పోలీసులు ఒక హోటల్పై దాడి చేశారు. దాడి సమయంలో హోటల్లోని రెస్టారెంట్లో కనిపించిన వాస్తవిక దృశ్యాలు చూసిన వారు ఆశ్చర్యపోయారు.
గదిలో ప్లాస్టిక్ బ్యాగుల్లో పెట్టిన రెండు మనిషి తలలున్నాయి. అవి తాజావి అనడానికి గుర్తుగా వాటినుంచి రక్తం ఇంకా కారుతోందని పోలీసులు వెల్లడించారు. తాము వెళ్లేటప్పటికి ఆ హోటల్ సిబ్బంది మనిషి మాంసం కోస్తుండటాన్ని గమనించి వారు నిర్ఘాంతపోయామన్నారు.
వెంటనే పోలీసులు అక్కడున్న పది మందిని అరెస్టుచేసి ఆగమేఘాల మీద ఆ హోటల్ను మూసివేశారు. రెస్టారెంట్లో భోజనం చేసిన ఒక మతగురువు ఒకసారి తనకు 700 నైరాల బిల్లు (సుమారు రూ.220) వేశారని, అంత బిల్లు ఎందుకైందని అడిగితే తన భోజనంలో వడ్డించిన మాంసం ముక్క ఖరీదైనదని చెప్పారని వివరించారు.
అంతేకాదు తనకి వడ్డించిన మాంసం మనిషి మాంసం అని తెలియగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ‘అయితే అది మనిషి మాంసం అని నాకు నిజంగా తెలియదు' అని ఆయన వెల్లడించారు. స్థానికులు సైతం ఆ హోటల్ పరిసరాలు భయం గొలిపేలా ఉంటాయని పేర్కొన్నారు.
రెస్టారెంట్ యజమాని, అందులో పనిచేసేవారు ఎప్పుడూ అనుమానాస్పదంగా కనిపిస్తారని పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు. ఇంటర్నెట్లో తనకు పరిచయమైన వాలంటీర్ని చంపి తిన్నందుకు గాను జర్మనీకి చెందిన ఓ వ్యక్తికి జీవిత ఖైదు విధించారు.