'కిమ్' మరో అరాచకం... ఫిషింగ్ బోట్ కెప్టెన్ బహిరంగ హత్య...ఆ రేడియో ప్రసారాలు విన్నందుకే...
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరో దారుణానికి ఒడిగట్టాడు. నిషేధిత రేడియో ప్రసారాలను విన్నందుకు ఓ ఫిషింగ్ బోట్ కెప్టెన్ని బహిరంగంగా కాల్చి చంపించాడు. ఈ ఏడాది అక్టోబర్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే... ఉత్తరకొరియాకు చెందిన చొయ్ అనే ఓ వ్యక్తి (40)కి 50 నౌకలు ఉన్నాయి. చాలాకాలంగా అతను ఫిషింగ్ చేస్తున్నాడు. అంతకుముందు అతను ఉత్తర కొరియా మిలటరీలో రేడియో ఆపరేటర్గా పనిచేశాడు. ఆ సమయంలో విదేశీ రేడియో ప్రసారాలను వినడం అతనికి అలవాటైంది. మిలటరీ నుంచి బయటకొచ్చాక కూడా అదే అలవాటును కొనసాగించాడు. సముద్రంలో నౌకలపై సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేసేటప్పుడు విదేశీ రేడియో ప్రసారాలకు సంబంధించిన ఫ్రీక్వెన్సీని ట్యూన్ చేసుకుని ఆ వార్తలు వినేవాడు.
అలా ఆర్ఎఫ్ఏ అనే సంస్థ రేడియో ప్రసారాలను చొయ్ చాలాకాలంగా వింటున్నాడు. చొయ్ వ్యవహారం ప్రభుత్వ అధికారుల దృష్టికి వెళ్లడంతో అతన్ని అరెస్ట్ చేసి విచారించారు. విచారణలో చొయ్ తాను గత 15 ఏళ్లుగా విదేశీ రేడియో ప్రసారాలను వింటున్నట్లు అంగీకరించాడు. దీంతో దాదాపు 100 మంది ఫిషింగ్ కెప్టెన్స్,మేనేజర్స్ సమక్షంలో పోలీసులు అతన్ని బహిరంగంగా కాల్చి చంపేశారు. చొయ్ అంటే గిట్టని ఓ వ్యక్తి ప్రభుత్వ అధికారులకు ఈ సమాచారాన్ని చేరవేశాడని మరికొన్ని కథనాలు కూడా వచ్చాయి.
ఆర్ఎఫ్ఏ(రేడియో ఫ్రీ ఏసియా) స్టేషన్ కార్యాలయం ఒకటి దక్షిణ కొరియా రాజధాని సియోల్లో ఉంది. ఈ సంస్థకు అమెరికా నుంచి నిధులు అందుతున్నట్లు తెలుస్తోంది. అసలే అమెరికా,దక్షిణ కొరియా అంటే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్కి ఏమాత్రం పడదు. పైగా ఉత్తరకొరియాలో ప్రభుత్వ మీడియాను మాత్రమే జనం ఫాలో కావాలి. కాదని ఎవరైనా అక్రమంగా విదేశీ టీవీ ప్రసారాలను వీక్షించినా.. విదేశీ రేడియో ప్రసారాలను విన్నా వారికి కఠిన శిక్షలు తప్పవు. నిన్న మొన్నటివరకూ కేవలం ఒకే ఒక్క టీవీ ఛానెల్ మాత్రమే ఆ దేశంలో ప్రసారమయ్యేది. అధ్యక్షుడు అనుమతించిన కార్యక్రమాలు,వార్తలు మాత్రమే అందులో ప్రసారం చేస్తారు. ఇటీవలి కాలంలో ఉత్తరకొరియా మరో మూడు ఛానెల్స్కు కూడా అనుమతినిచ్చింది. దీంతో అక్కడి ప్రజలు చాలా సంతోషపడిపోతున్నారు. ఈ మూడు చానెళ్ల ప్రసార కార్యక్రమాలను కూడా ప్రభుత్వమే నియంత్రిస్తుంది. ప్రభుత్వం సూచించిన కార్యక్రమాలనే ఇందులో ప్రసారం చేస్తారు.