ఉత్తర కొరియా నియంతకు ఏమైంది? చావు బతుకుల మధ్య ఉన్నారంటూ రిపోర్ట్స్: సర్జరీ ఎందుకు?
న్యూయార్క్: ఆధునిక నియంతగా ప్రపంచ దేశాల్లో గుర్తింపు తెచ్చుకున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్కు ఏమైంది? ఆయన చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారా? ఇటీవలే ఆయన చేయించుకున్న సర్జరీ తిరగబెట్టిందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానాన్ని ఇస్తోంది అమెరికా నిఘా విభాగం.. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. ఆయన గ్రేవ్ డేంజర్లో ఉన్నారని అనుమానిస్తోంది. దీనిపై సీఎన్ఎన్ వెబ్సైట్ ఓ కథనాన్ని ప్రచురించింది.
Recommended Video
అమెరికా దారులు మూసుకుపోయినట్టే: ఇమిగ్రేషన్లను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్: పెద్ద కథే
అధికారిక వేడుకలకు గైర్హాజర్ కావడంతో..
కిమ్ జోంగ్ నాలుగు రోజులుగా ఎలాంటి అధికారిక సమావేశాలకు హాజరు కావట్లేదని సీఐఏ వెల్లడించింది. ఈ నెల 15వ తేదీన తన తాత జయంతి వేడుకల్లో కూడా ఆయన పాల్గొనలేదని స్పష్టం చేసినట్లు సీఎన్ఎన్ తన కథనంలో పేర్కొంది. ఈ పరిణామాలన్నీ కిమ్ జోంగ్ ఆరోగ్యంపై వదంతులు వ్యాప్తి కావడానికి కారణమైనట్లు పేర్కొంది. ఈ నెల 12వ తేదీన కిమ్ జొంగ్ కార్డియో వాస్కులర్ ప్రొసీజర్కు గురయ్యారని డైయిలీ ఎన్కే అనే దక్షిణ కొరియా ఆన్లైన్ న్యూస్ పేపర్ వెల్లడించినట్లు స్పష్టం చేసింది.
కార్డియో వాస్కులర్కు గురైన కిమ్.. సర్జరీ..
విపరీతంగా పొగతాగడం, భారీ శరీరం కావడం వల్ల కార్డియో వాస్కులర్కు గురై ఉండొచ్చని అభిప్రాయపడింది. దీనితో ఆయన హ్యూయంగ్సాన్లోని ఓ విల్లాలో సర్జరీ చేశారని చెబుతున్నారు. వారం రోజులపాటు ఆ విల్లాలోనే విశ్రాంతి తీసుకున్న తరువాత కిమ్ జోంగ్ రాజధాని ప్యాంగ్యాంగ్కు తిరిగి వచ్చారని, అనంతరం అబ్జర్వేషన్లోకి వెళ్లారని డెయిలీఎన్కే ఆన్లైన్ న్యూస్ పేపర్ను ఉటంకిస్తూ సీఎన్ఎన్ స్పష్టం చేసింది.
చివరిసారిగా ఈ నెల 11న
ఈ సమాచారాన్ని ఎక్కడా బయటికి పొక్కకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని చెబుతున్నారు. ఇన్ని రోజుల పాటు కిమ్ జొంగ్ ఎలాంటి అధికారిక సమావేశాల్లో పాల్గొనకపోవడం, అంతకుముందే కార్డియో వాస్కులర్ సర్జరీ చేయించుకోవడం వంటి కారణాల వల్ల ఆయన ఆరోగ్య పరిస్థితులు దిగజారి ఉండొచ్చంటూ అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. చివరిసారిగా కిమ్ జొంగ్ ఈ నెల 11వ తేదీన మీడియా ముందు కనిపించారు. ఆ తరువాత సర్జరీ చేయించుకున్నారు.
వ్యవస్థాపకుడి జయంతి వేడుకల్లో కనిపించని కిమ్
ఉత్తర కొరియా చరిత్రలో ఏప్రిల్ 15వ తేదీకి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఏప్రిల్ 15వ తేదీని జాతీయ సెలవుదినంగా ప్రకటించారు. ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు, జాతిపితగా ఆరాధించే కిమ్ సుంగ్ జయంతి సందర్భంగా కూడా జోంగ్ కనిపించకపోవడం పట్ల మరిన్ని అనుమానాలు వ్యక్తమౌతున్నాయని తెలుస్తోంది. ఉత్తర కొరియా సారధ్య బాధ్యతలను చేపట్టిన తరువాత గానీ, అంతకుముందు గానీ.. తన తాత జయంతి ఉత్సవాలకు కిమ్జొంగ్ ఏనాడూ గైర్హాజరు కాలేదని అంటున్నారు.
నిరాధారమంటోన్న అంతర్జాతీయ మీడియా..
డెయిలీ ఎన్కేను ఉటంకిస్తూ సీఎన్ఎన్ ప్రచురించిన ఈ కథనాన్ని ఖండిస్తున్నాయి కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు. ఆయనకు సర్జరీ జరిగిన మాట వాస్తవమే అయినప్పటికీ.. అది తిరగబెట్టిందని, తీవ్ర అనారోగ్యానికి గురయ్యారంటూ వచ్చిన వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొన్నాయి. ఆయన కోలుకుంటున్నారని వెల్లడించాయి. త్వరలోనే కిమ్ జొంగ్ అధికారిక సమావేశాల్లో పాల్గొంటారని స్పష్టం చేస్తున్నాయి.