ట్రంప్ ఓ పిరికిపంద, ఉరితీసినా తప్పులేదు: ఉ.కొరియా తీవ్ర వ్యాఖ్యలు
ప్యాంగ్యాంగ్: అమెరికా, ఉత్తరకొరియా మధ్య విమర్శల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇరు దేశాధ్యక్షులు యుద్ధానికి సై అంటే సై అంటూ ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకు దారితీస్తున్నారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ఉత్తరకొరియా తీవ్ర విమర్శలు చేసింది.
భయపడేది లేదు! మొత్తం సైనిక శక్తి దించుతాం: ఉ.కొరియాకు ట్రంప్ తీవ్ర హెచ్చరిక
ట్రంప్ ఓ పిరికిపంద
తమ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ను అవమానిస్తే సహించేది లేదని ఉత్తరకొరియా హెచ్చరించింది. అంతేగాక, ట్రంప్ మరణశిక్షకు అర్హుడని.. కొరియా సరిహద్దులో పర్యటన రద్దు చేసుకున్న పిరికివాడని ఉత్తర కొరియా పత్రిక రొడొంగ్ సిన్ముణ్ తన కథనంలో పేర్కొంది.
ట్రంప్ వర్సెస్ ఉన్
ఇటీవల ఆసియా పర్యటనలో భాగంగా ట్రంప్ జపాన్, చైనాతోపాటు దక్షిణకొరియాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. కిమ్ జోంగ్ ఉన్పై విమర్శలు చేశారు. తగిన రీతిలో బుద్ధి చెబుతామంటూ హెచ్చరించారు. దీనిపై ఉత్తరకొరియా కూడా తీవ్రంగా స్పందించింది. ట్రంప్ దక్షిణ కొరియా పర్యటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
మరణశిక్షే..
‘మా దేశ నాయకుడిపై విమర్శలు చేస్తూ.. ఆయనను అవమానించడం తీవ్ర నేరంగా పరిగణిస్తాం. క్షమాభిక్ష కూడా లేనంత పెద్ద నేరం అది. అందువల్ల ఆయన మరణశిక్షకు అర్హుడు' అని ఉత్తరకొరియా పత్రిక తన కథనంలో పేర్కొంది.
నాటి నుంచే అవమానిస్తూ..
ట్రంప్ అమెరికా అధ్యక్షుడైనప్పటి నుంచి తమ నేతని అవమానిస్తూ మాట్లాడుతున్నారని పత్రిక ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉత్తరకొరియా, దక్షిణకొరియా మధ్య ఉన్న సరిహద్దుకు కూడా రావడానికి భయడిన ట్రంప్ పిరికివాడని ఎద్దేవా చేసింది. అయితే, తాజాగా, ట్రంప్ మాట్లాడుతూ.. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్తో స్నేహం చేసేందుకు కూడా తమకు అభ్యంతరం లేదని చెప్పడం గమనార్హం.