చెలరేగిన కిమ్ - 35 నిమిషాల్లో 8 క్షిపణి పరీక్షలతో : ఇక అణు పరీక్షలే..!!
ఉత్తర కొరియా మరోసారి చెలరేగింది. ఊహించని విధంగా వరుస బాలిస్టిక్ క్షిపణి పరీక్షలతో విజృంభించింది. 35 నిమిషాల వ్యవధిలో ఎనిమిది స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు నిర్వహించింది. రాజధాని ప్యాంగాంగ్కు సమీపంలోని సునన్ ప్రాంతంలో ఈ ప్రయోగాలు చేపట్టింది. ఇంత తక్కువ సమయంలో అత్యధిక బాలిస్టిక్ క్షిపణుల పరీక్షలు నిర్వహించడం ఇదే తొలిసారి. ఉత్తర కొరియా వ్యూహాత్మకంగానే ఈ పరీక్షలు నిర్వహించినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో అమెరికాకు హెచ్చరికగానే ఈ క్షిపణి పరీక్షలు చేపట్టినట్లు అంచనా వేస్తున్నారు.
దీంతో.. ఉత్తర కొరియా అణు పరీక్షలు సైతం నిర్వహించే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మధ్య కాలంలోనే అమెరికాకు చెందిన నావికా బలగాలు..దక్షిణ కొరియాతో కలిసి ఫిలిప్పీన్స్ సముద్రంలో సంయుక్త విన్యాసాలు నిర్వహించాయి. అందులో భాగంగా.. అమెరికా విమాన వాహక నౌక రోనాల్డ్ రీగన్ సైతం ఉండటంతో ఉత్తర కొరియా అప్రమత్తం అయింది. దీంతో.. దీనికి కౌంటర్ గానే ఉత్తరకొరియా క్షిపణి పరీక్షలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఉత్తర కొరియా క్షిపణుల పరీక్షలను నిశితంగా గమనిస్తున్న దక్షిణ కొరియా అవి ఎంత దూరం ప్రయాణం చేసాయనే అంశం పైన సమాచారం లేదని చెబుతోంది.
వరుస క్షిపణుల ప్రయోగంతో దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ప్రస్తుత పరిస్థితుల పైన చర్చించేందుకు జాతీయ భద్రతా మండలి సమావేశం నిర్వహించనున్నారు. జపాన్ సైతం కిమ్ దూకుడుపై ఆందోళన వ్యక్తం చేసింది. క్షిపణుల ప్రయోగం పైన పూర్తి సమాచారం పంపాలని ప్రధాని ఫ్యుమియో కిషిదా ఆదేశించారు. విమానాలు, నౌకలకు ఎలాంటి ప్రమాదం లేకుండా అప్రమత్తం అవ్వాలని ఆదేశించారు. ఈ ఏడాదిలో ఉత్తర కొరియా 18వ క్షిపణి పరీక్షలు గా ఇవి నమోదయ్యాయి. ఐదేళ్ల విరామం తర్వాత ఉత్తర కొరియా ఈ తరహా పరీక్షలు చేపట్టింది. ఈ పరీక్షల్లో ఖండాంతర బాలిస్టిక్ మిసైళ్లు సైతం ఉన్నాయి.