ఎప్పుడైనా అణుదాడి, అమెరికాలో కోట్లాది మంది మరణిస్తారు: ఉ.కొరియా హెచ్చరిక
ఉత్తర కొరియా అమెరికాకు మరోసారి సవాల్ చేసింది. అగ్రదేశానికి హెచ్చరికలు జారీ చేసింది. అణుబాంబుతో దాడిచేస్తే అమెరికాలో కోట్ల మంది ప్రజలు మరణిస్తారని తాజాగా హెచ్చరించింది.
వాషింగ్టన్: ఉత్తర కొరియా అమెరికాకు మరోసారి సవాల్ చేసింది. అగ్రదేశానికి హెచ్చరికలు జారీ చేసింది. అణుబాంబుతో దాడిచేస్తే అమెరికాలో కోట్ల మంది ప్రజలు మరణిస్తారని తాజాగా హెచ్చరించింది.
ఉత్తరకొరియా అధికార ప్రతినిధి రోడాంగ్ సిన్మన్ ఓ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికాపై ఏ క్షణంలోనైనా అణుదాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఉత్తర కొరియా నుంచి ప్రకటన విడుదలైంది.
ఇటీవల జరిపిన డ్రిల్ యుద్ధానికి ప్రారంభం లాంటిదని, అమెరికా పూర్తిగా నాశనమవుతుందని, యుద్ధం జరిగితే కోట్ల మంది అమెరికన్లు అణుదాడిలో మరణిస్తారని, ఆ దేశ స్వరూపమే మారిపోతుందని హెచ్చరించారు.
అమెరికాలో ప్రాణాలతో మిగిలిన వారికి కనీసం షెల్టర్ కూడా దొరకదని, ఇకనైనా దక్షిణ కొరియాలో ఉన్న వారి భద్రత గురించి అమెరికా ఆలోచించడం మానుకోవాలని, తమ దేశంలోని ప్రజలను ఎలా కాపాడుకోవాలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని పేర్కొంది.
ఉత్తర కొరియాకు చెందిన మరో మీడియాలో.. యుద్ధవినాశనం నుంచి తప్పించుకోవాలంటే అమెరికాకు ఒకే ఒక్క దారి ఉందని, ద.కొరియా నుంచి వారి మిలిటరీని, ప్రజలను స్వదేశానికి తీసుకెళ్లాలని పేర్కొంది.
ఉ.కొరియా చర్యలను అడ్డుకునేందుకు అమెరికా ద.కొరియాలో తమ మిలిటరీ బలగాలను సిద్ధం చేసిందని, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుచరులు కొరియా సరిహద్దులో పాగా వేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ హెచ్చరించింది.