కుల్ భూషణ్ జాదవ్ కేసులో పాక్ మరో కుట్ర- రివ్యూ పిటిషన్ వద్దన్నారంటూ కొత్తవాదన..
గూడఛర్యం కేసులో అరెస్ట్ అయి పాకిస్తాన్ జైల్లో మగ్గుతున్న భారత నేవీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ వ్యవహారంలో పాకిస్తాన్ మరో కుట్రకు తెరలేపినట్లు కనిపిస్తోంది. గూఢచర్యం కేసులో తనకు విధించిన మరణశిక్షపై రివ్యూ పిటిషన్ వేసేందుకు ఆయన నిరాకరిస్తున్నట్లు పాకిస్తాన్ తాజాగా ప్రకటించడం సంచలనం రేపింది. కుల్ భూషణ్ మరణశిక్షను యావజ్జీవంగా మార్చాలని భారత్ కూడా పోరాడుతున్న తరుణంలో పాకిస్తాన్ తాజా వాదన చర్చనీయాంశంగా మారింది. కుల్ భూషణ్ విషయంలో ఇప్పటికే కఠినంగా వ్యవహరిస్తున్న పాకిస్తాన్ సర్కారు తాజా ప్రకటన కలకలం రేపుతోంది.

పాక్ మరో కుట్ర ?
గూఢచర్యం కేసులో భారత నేవీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ కు విధించిన మరణశిక్షపై పొరుగుదేశం పాకిస్తాన్ రోజుకో మాట మాట్లాడుతోంది. కుల్ భూషణ్ ను ఈ కేసులో ఎలాగైనా ఉరిశిక్ష వేసేందుకు సిద్ధమవుతున్న పాకిస్తాన్... తాజాగా మరో కొత్త వాదనకు తెరలేపింది. తనకు విధించిన మరణశిక్షపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసుకునేందుకు కుల్ భూషణ్ నిరాకరించినట్లు తాజాగా పాకిస్తాన్ చేసిన ప్రకటన సంచలనం రేపింది. నిజంగా కుల్ భూషణ్ రివ్యూ పిటిషన్ వేసేందుకు నిరాకరించారా అన్నది ఇంకా తేలలేదు. జూన్ 17న రివ్యూ పిటిషన్ వేసేందుకు కుల్ భూషణ్ నిరాకరించినట్లు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.

కుల్ భూషణ్ కు మరో అవకాశం...
ప్రస్తుతం పాకిస్తాన్ జైల్లో ఉన్న కుల్ భూషణ్ కు రివ్యూ పిటిషన్ దాఖలు చేసుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చినట్లు స్ధానిక మీడియా ఇవాళ వెల్లడించింది. ఆయనపై మోపిన ఆరోపణలు, విధించిన మరణశిక్షను పునస్సమీక్షించేందుకు అవకాశం కల్పించగా.. న్యాయపరంగా తనకు ఉన్న హక్కులను దృష్టిలో ఉంచుకుని రివ్యూ పిటిషన్ దాఖలు చేసేందుకు ఆయన నిరాకరించినట్లు పాకిస్తాన్ మీడియా చెబుతోంది. దీంతో అసలు రివ్యూ పిటిషన్ ను కుల్ భూషణ్ తిరస్కరించడం వెనుక గల కారణాలపైనా చర్చ సాగుతోంది.

క్షమాభిక్ష పైనే ఆశలు...
గూఢచర్యం కేసులో పాకిస్తాన్ చెబుతున్నట్లు కుల్ భూషణ్ జాదవ్ రివ్యూ పిటిషన్ వేసేందుకు నిరాకరించిన నేపథ్యంలో ఆయనకు మిగిలి ఉన్న అవకాశం క్షమాభిక్ష పిటిషన్ మాత్రమే. దీంతో ఆయన పాకిస్తాన్ ప్రభుత్వం తనకు క్షమాభిక్ష ప్రసాదిస్తుందని ఆయన గంపెడాశతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన కుటుంబ సభ్యులు కూడా భారత ప్రభుత్వం ద్వారా పాకిస్తాన్ పై ఒత్తిడి పెంచి క్షమాభిక్షకు అనుకూలంగా వ్యవహరించేలా చర్చలు జరుపుతారని ఆశిస్తోంది. ఇప్పటికే భారత్ అంతర్జాతీయ న్యాయస్ధానంలో ఈ కేసుపై గట్టిగా వాదించడంతో పాకిస్తాన్ తదుపరి విచారణకు అంగీకరించింది. అంతర్జాతీయ న్యాయస్ధానం తీర్పుకు కట్టుబడి ఉంటామని గతంలో పాకిస్తాన్ చేసిన ప్రకటనతో ఆయన కుటుంబ సభ్యులకు ఊరట లభించింది.












Click it and Unblock the Notifications