పుల్వామా ఉగ్రదాడిపై విషం చిమ్మిన పాక్ మీడియా... భారత్ ఉగ్రవాదం రంగు పులుముతోందంటూ రాతలు
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడికి తెగబడిన సంఘటనలో పాక్ మీడియా విషం చిమ్మింది. భారత ఆక్రమిత కశ్మీర్లో భారత్ ఆగడాలు హద్దుమీరుతుండటంతో పాక్ సమరయోధుడు భారత బలగాలను మట్టుబెట్టి తన ప్రాణాలను కూడా త్యాగం చేశాడని పనికిమాలిన రాతలు రాసుకొచ్చింది పాక్ దినపత్రిక దినేషన్.

పుల్వామా ఉగ్రదాడిపై విషం చిమ్మిన పాక్ మీడియా
జమ్మూ కశ్మీర్లో సీఆర్పీఎఫ్ బలగాలపై జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ దాడి చేయడంతో 40కి పైగా జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఈ ఘటనను నీచాతి నీచంగా చూపించి చెప్పే ప్రయత్నం పాకిస్తాన్ మీడియా చేస్తోంది. జర్నలిజం విలువలకు తిలోదకాలిచ్చి భారత్పై ఎంత విషం చిమ్మాలో అంతకంటే ఎక్కువగానే చిమ్మింది. అంతేకాదు అంతమంది జవాన్లను అదిల్ అనే ఉగ్రవాది ఆత్మాహుతి దాడి చేసి హత్యకు పాల్పడితే... ఘటనకు భారత ప్రభుత్వం ఉగ్రవాదం రంగు అద్దుతోందని పత్రికలో కథనం రాసుకొచ్చింది. అంతేకాదు ఘటనకు తామే బాధ్యులమని జైషే మహ్మద్ చెప్పినప్పటికీ ఈ తోకపత్రిక మాత్రం భారత ప్రభుత్వం జైషేమహ్మద్పైకి నెట్టేసే ప్రయత్నం చేస్తోందనే పిచ్చి రాతలు రాసింది. అంతేకాదు ఈ దాడికి పాల్పడింది కశ్మీర్కు చెందిన యువకుడు అయితే అతనికి క్రెడిట్ ఇవ్వకుండా నెపం జైషేమహ్మద్ ఉగ్రవాద సంస్థపై నెడుతోందని రాసింది.

పచ్చి అబద్దాలు రాసిన ది నేషన్ పత్రిక
ప్రపంచం మొత్తం పాక్ వైఖరిని తప్పుబడుతున్నప్పటికీ... ది నేషన్ పత్రిక మాత్రం తనకేమీ పట్టనట్లుగా అన్ని అవాస్తవాలే రాసుకొచ్చింది. గురువారం జరిగిన దాడి అతిపెద్ద దాడి అయితే... అంతకుముందు 2002లో కొందరు పాకిస్తాన్ యోధులు 31 మంది భారత జవాన్లను మట్టుబెట్టారని అది జమ్మూలోని కాలుచక్ ప్రాంతంలో జరిగిందని పత్రిక కథనం రాసుకొచ్చింది.

కశ్మీర్ స్వాతంత్ర్యం కోసమే జరిగిన యుద్ధం
భారత ఆక్రమిత కశ్మీర్లో ఉండే జర్నలిస్టు బషీర్ మంజార్... బీబీసీతో మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. మొన్న జరిగిన దాడి చాలామంది యోధులను తయారు చేస్తుందంటూ వ్యాఖ్యానించారు. కశ్మీర్లో ప్రశాంత వాతావరణం నెలకొందని భారత ప్రధాని చెప్పడం తగదని ఆయన అన్నారు. భారత ఆక్రమిత కశ్మీర్లో జరిగిన పేలుడులో ఓ విద్యార్థి మృతి చెందగా మరో 28 మంది గాయపడ్డారు. ఇది జరిగిన ఒకరోజుకే భారత జవాన్లపై ఉగ్రవాదులు తెగబడటం విశేషం. మరోవైపు వేర్పాటు వాది సయ్యద్ అలి గిలానీ మరియు హురియత్ ఫోరమ్ ఛైర్మెన్ మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్లు వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన, ఆ వెంటనే భారత జవాన్ల కాన్వాయ్పై జరిగిన ఘటనలను చూస్తే ఏదో కుట్రదాగి ఉందనే అనుమానాలు వ్యక్తం చేశారు. కశ్మీర్ స్వాతంత్ర్యం కోసం జరిగిన యుద్ధంలా కనిపిస్తోందని గిలానీ వ్యాఖ్యానించారు.

మైనస్ 20 డిగ్రీల వాతావరణంలో భారత సైనికుడి పహారా
కశ్మీర్లోయలో మైనస్ 20 డిగ్రీల వాతావరణంలో అతితీవ్ర చలిలో రాత్రంతా అలా కదలకుండా నిలబడి అక్కడ ఒక మనిషి ఉన్నాడనే అనుమానం కూడా రాకుండా భారత సైనికుడు కాపలా కాస్తుంటే... ఇలాంటి వారిపై దాడికి తెగబడిన పాకిస్తాన్ ఉగ్రవాదులపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. పాకిస్తాన్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని అగ్రదేశాలు చెబుతున్నప్పటికీ కూడా ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయకుండా... వారికి వంత పాడటం పై ప్రపంచ దేశాలు కన్నెర్ర చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications