చేతులెత్తి నమస్కరిస్తున్నా: ఇండియన్స్పై ఒబామా, పాక్కు హెచ్చరిక
న్యూఢిల్లీ/వాషింగ్టన్: పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పీకివేయాలని పాక్కు అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా గట్టి హెచ్చరిక జారీ చేశారు. భారత్లోని వైమానిక స్థావరం పఠాన్ కోట్ పైన ఉగ్ర దాడి విషయమై ఒబామాను ఒక వార్తా సంస్థ ప్రశ్నించగా ఆయన పైవిధంగా స్పందించారు.
భారత్ చాలాకాలంగా ఎదుర్కొంటున్న ఉగ్ర సమస్యకు మరో ఉదాహరణగా ఈ సంఘటనను పేర్కొనవచ్చునని వ్యాఖ్యానించారు. ఈ సంఘటనపై దర్యాప్తునకు పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ను ఒప్పించడం చాలా గొప్ప విషయమని, ఈ విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ విజయవంతమయ్యారని కితాబిచ్చారు.
ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో ఇరు దేశాల నేతలు చర్చించడం హర్షణీయమన్నారు. భారత్ - అమెరికా స్నేహ సంబంధాలను మరింత అభివృద్ధి చేసుకుంటామన్నారు. అమెరికా కూడా ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటోందని, ఈ సమస్యను మట్టుబెట్టేందుకు భారత్తో కలిసి పనిచేస్తామన్నారు.

ఉగ్రవాదంపై పోరులో తన చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు పాకిస్థాన్కు ఇది మంచి అవకాశమన్నారు. తమ భూభాగంలో ఉగ్రకార్యకలాపాలకు పాల్పడుతున్న ముష్కర ముఠాలపై పాకిస్థాన్ కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందేనని, ఉగ్రవాదుల స్వర్గధామాలపై ఆ దేశం ఎంతమాత్రం ఉపేక్ష ప్రదర్శించినా క్షమార్ఙం కాదన్నారు.
ఉగ్రవాదులను చట్టం ముందుకు తీసుకురావాల్సిందేనని స్పష్టం చేశారు. ఉగ్రవాదం, భారత్-అమెరికా సంబంధాలు, వాతావరణ సదస్సుతోపాటు పలు అంశాలకు సంబంధించిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.
పఠాన్కోట్ ఘటన అనంతరం పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్తో సమన్వయానికి ప్రధాని మోడీ చేసిన కృషి అభినందనీయమన్నారు. ఈ విషయంలో ఇరుదేశాల ప్రధానులు సానుకూల దృక్పథాన్ని కనబరుస్తున్నారన్నారు. పఠాన్కోట్ దాడిని మేం ముక్తకంఠంతో ఖండించి భారత్కు బాసటగా నిలిచామన్నారు.
ఈ ఘటనలో మరింత నష్టం జరగకుండా పోరాడిన భారతీయులకు చేతులెత్తి నమస్కరిస్తున్నానని, బాధితులు, వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ఒబామా అన్నారు. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు ఆవశ్యకతను ఇలాంటి ఘటనలు నొక్కిచెబుతాయన్నారు. పాకిస్థాన్లో ఉగ్రవాదం బలోపేతం కావడం ఆ దేశానికి కూడా ముప్పేనని షరీఫ్ గ్రహించారని, ఆయన చర్యలు ప్రారంభించారని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications