పాకిస్తాన్ పెద్ద తలనొప్పి: డొనాల్డ్ట్రంప్ సంచలన వ్యాఖ్య
వాషింగ్టన్: న్యూక్లియర్ ఆయుధాలు కలిగిన పాకిస్తాన్ చాలా చాలా కీలకమైన సమస్య అని అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి రిపబ్లికన్ తరఫున రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ అన్నారు. దేశంలోని పరిస్థితులను నియంత్రిచుకోవాల్సిన అవసరం పాక్కు ఎంతో ఉందన్నారు.
అణ్వస్త్ర సామర్థ్యం కారణంగా అది కీలక దేశమని డొనాల్డ్ ట్రంప్ విస్కాన్సిన్లో నిర్వహించిన ఓ సమావేశంలో చెప్పారు. ఇటీవల పాకిస్థాన్లోని లాహోర్లో ఈస్టర్ రోజున జరిగిన ఆత్మాహుతి దాడిలో 74 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు.
ఈ ఘటన నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ గురించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇస్లామిక్ తీవ్రవాదం అరికట్టేందుకు తాను అందరి కన్నా బాగా కృషి చేయగలనని చెప్పారు. అణ్వస్త్ర సామర్థ్యం గల పాకిస్థాన్ పొరుగున ఉన్న కారణంగా ఆఫ్ఘనిస్థాన్లో అమెరికా బలగాలు ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ విషయమై డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల క్రితం సంచలన ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఆ దాడులను తన ట్వీట్లో ఆయన ఖండించలేదు. కానీ ఆ సమస్యను ఒంటరిగానే పరిష్కరించనున్నట్లు తెలిపారు. అయితే, తాజాగా విస్కన్సిన్లో వచ్చే నెల 5న రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ ప్రైమరీ జరుగనున్న సందర్భంగా ట్రంప్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ పాకిస్థాన్పై మరోసారి ఈ విధంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాక్లో అణ్వాయుధాలు ఉన్నాయని, కాబట్టి అమెరికాకు కూడా అది కీలకమైన దేశమన్నారు. పాకిస్థాన్ అత్యంత ప్రమాదకర దేశమని డొనాల్డ్ ట్రంప్ గతంలో కూడా పేర్కొన్నారు. పాక్ ప్రపంచంలోనే అత్యధిక ప్రమాదకర దేశమని, ఆ దేశం నుంచి అణ్వాయుధాలను తొలగించాలని ట్రంప్ పలుసార్లు మండిపడ్డారు.