ప్రభుత్వ ఉద్యోగులపై పాకిస్తాన్ ప్రధాని తొలి బాంబు: ఇకపై 10 గంటల పని వేళలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రిగా కొత్తగా బాధ్యతలను స్వీకరించిన షెహబాజ్ షరీఫ్.. తన తొలి నిర్ణయాన్ని ప్రకటించారు. అస్తవ్యస్తంగా తయారైన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడంలో భాగంగా కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై సంతకం చేశారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు సైతం వెలువడ్డాయి. తక్షణమే అవి అమల్లోకి వస్తాయని షెహనాజ్ కార్యాలయం పేర్కొంది. ఈ ఉత్వర్వుల ప్రకారం.. ఇకపై ప్రభుత్వ ఉద్యోగులందరూ రోజులో 10 గంటల పాటు పని చేయాల్సి ఉంటుంది.

వారంలో ఆరు రోజుల పని..
అన్నిచోట్లా ఉన్నట్లుగానే పాకిస్తాన్లోనూ ఇప్పటిదాకా ఎనిమిది గంటల పని వేళలు ఉండేవి. ప్రభుత్వ కార్యాలయాలు వారంలో అయిదు రోజులు మాత్రమే పని చేసేవి. రెండు వీక్లీ ఆఫ్స్ ఉండేవి. ఇప్పుడా పరిస్థితిని పూర్తిగా మార్చివేశారు కొత్త ప్రధాని షెహబాష్ షరీఫ్. వారంలో అయిదు రోజుల పని వేళలను రద్దు చేశారు. ఇకపై ఆరు రోజుల పాటు పని చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. రెండు వీక్లీ ఆఫ్స్లో కోత పెట్టారు. ఇకపై అక్కడ వారంలో ఒకే రోజు సెలవు ఉంటుంది.

10 గంటల పని వేళలు..
దీనితోపాటు- ప్రభుత్వ కార్యాలయాలన్నీ 10 గంటల పాటు పని చేయాల్సి ఉంటుంది ఈ తాజా ఉత్తర్వుల ప్రకారం. ఇదివరకు ఎనిమిది గంటల పని వేళలను షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం పొడిగించింది. అదనంగా రెండు గంటలను జత చేసింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రభుత్వ కార్యాలయాలు పని చేస్తాయి. ప్రభుత్వ ఉద్యోగుల సెలవులపైనా కఠిన నిర్ణయాలను తీసుకుంది. సెలవులపై వెళ్లదలిచిన వారు దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తమ పైఅధికారులకు అందజేయాల్సి ఉంటుంది.

రెండు వీక్లీ ఆఫ్స్కు కోత..
ఇకపై దేశంలో వారంలో రెండు వీక్లీ ఆఫ్స్ వ్యవస్థ ఉండబోదని, ఒకే సెలవు ఉంటుందని ప్రధానమంత్రి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసినట్లు సమా న్యూస్ తెలిపింది. అలాగే- ప్రభుత్వ కార్యాలయాలన్నీ రోజూ 10 గంటల పాటు పని చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగుల పని వేళలను పెంచడం వల్ల ఉత్పాదకత పెరుగుతుందని ప్రధానమంత్రి కార్యాలయం భావిస్తోందని స్పష్టం చేసింది. రోజువారీ కార్యాకలాపాలు మరింత పెరుగుతాయని, ఫలితంగా రొటేషన్ వ్యవస్థ మెరుగుపడుతుందని అంచనా వేసింది.

మోడీకి థ్యాంక్స్..
ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ ప్రభుత్వం కుప్పకూలిన తరువాత- పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా షరీఫ్ ప్రధానమంత్రిగా అపాయింట్ అయ్యారు. ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేసిన రోజే ఆయన బాధ్యతలను స్వీకరించారు. తాజాగా- తన సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై సంతకం చేశారు. ప్రమాణ స్వీకారం తరువాత తనను అభినందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ట్వీట్కు షరీఫ్ రిప్లై ఇచ్చారు. కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications