ప్రపంచ శాంతికి అతిపెద్ద ప్రమాదకారి: చైనా దుందుడుకు
బీజింగ్: అమెరికా హౌస్ స్పీకర్ న్యాన్సీ పెలోసి- తైవాన్లో పర్యటిస్తోన్న నేపథ్యంలో చైనా దుందుడుకు చర్యలకు పూనుకుంది. ఆమె పర్యటనను ముందు నుంచీ వ్యతిరేకిస్తూ వచ్చిన ఈ డ్రాగన్ కంట్రీ కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకుంటోంది. ద్వీపదేశం తైవాన్ను చుట్టుముట్టింది. వైమానిక, నౌకా దళంతో ప్రత్యేకంగా డ్రిల్ను మొదలు పెట్టింది. న్యాన్సీ పెలోసీ తైపేలో అడుగు పెట్టిన కొద్దిసేపటికే చైనా.. తన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాలతో ఈ యుద్ధ సన్నాహకాలను చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
చైనాకు చెందిన త్రివిధ దళాలూ ఈ డ్రిల్లో పాల్గొంటోన్నాయి. ఆర్మీ, నౌకా, వైమానిక దళాలు తమ శక్తి సామర్థ్యాలను చాటుతున్నాయి. చైనా ఉత్తర ప్రాంత గగనతలం, నైరుతి, ఈశాన్య ప్రాంతాల్లో గల సముద్ర జలాల్లో ఈ డ్రిల్ కొనసాగుతోంది. ఆయా ప్రాంతాలన్నీ తైవాన్కు అతి సమీపంలో ఉన్నవే. మొత్తంగా తైవాన్కు అతి సమీపంలో అయిదు చోట్ల ఈ డ్రిల్స్ మొదలయ్యాయి. ఒకరకంగా న్యాన్సీ పెలోసీ పర్యటిస్తోన్న సమయంలో చైనా.. తన యుద్ధ సామాగ్రితో తైవాన్ను చుట్టుముట్టినట్టయింది.
కన్వెన్షనల్ మిస్సైల్ టెస్ట్ సైతం చేపట్టినట్లు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఈస్టర్న్ థియేటర్ కమాండ్ అధికార ప్రతినిధి సీనియర్ కల్నల్ షి యి తెలిపారు. జాయింట్ బ్లాకేడ్స్, సీ అస్సాల్ట్, ల్యాండ్ అటాక్స్, ఎయిర్ సుపీరియారిటీ.. వంటి అత్యాధునిక యుద్ధ సామాగ్రితో ఈ డ్రిల్ నిర్వహిస్తోన్నట్లు పీఎల్ఏ ఈస్టర్న్ థియేటర్ కమాండర్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గు ఝాంగ్ వివరించారు. ఓ సంపూర్ణమైన యుద్ధ సన్నాహకంగా అభివర్ణించారు.
అక్కడితే ఆగలేదు డ్రాగన్ కంట్రీ. దౌత్యపరంగానూ తక్షణ చర్యలకు దిగింది. పెలోసీ తైవాన్ పర్యటన పట్ల నిరసన తెలియజేసింది. చైనాలోని అమెరికా రాయబారులు, హై కమిషనర్లు, దౌత్యాధికారులకు ఏకకాలంలో సమన్లను జారీ చేసింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ మంత్రి గ్ఝీ ఫెంగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ కొద్దిసేపటికే చైనాలోని అమెరికా రాయబారి నికొలస్ బర్న్స్తో సమావేశం అయ్యారు.
ప్రజాస్వామ్య స్వయం ప్రతిపత్తి గల ద్వీపదేశంలో అమెరికా జోక్యాన్ని తాము సహించబోవట్లేదని తెలిపారు. తైవాన్ను తమ దేశంలో అంతర్భాగంగా భావిస్తున్నామని స్పష్టం చేశారు. తైవాన్లో అమెరికా జోక్యం చేసుకోవడాన్ని తాము చూస్తూ ఊరుకోబోమని తేల్చి చెప్పారు. న్యాన్సీ పెలోసీ పర్యటనను అమెరికా స్వయం కృతాపరాధంగా భావిస్తున్నామని వ్యాఖ్యానించారు. అమెరికా ప్రపంచ శాంతికి అతిపెద్ద ప్రమాదకారిగా పరిణమించిందని ఆరోపించారు.