ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ.. అమెరికా- ఇరాన్ యుద్ధం వేళ
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఏమాత్రం తగ్గడం లేదు. ఇరాన్- అమెరికా మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తో భేటీ అయ్యారు. కిర్గిస్థాన్ రాజధాని బిష్ కేక్ లో జరుగుతున్న 26 వ షాంగై సహకార సదస్సు(SCO) లో భాగంగా ఇరు దేశాధినేతల మధ్య ఈ భేటీ జరిగింది.
ఇరాన్- అమెరికా మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత ప్రధాని మోదీ- మసూద్ పెజెష్కియాన్ మధ్య సమావేశం జరగడం ఇదే తొలిసారి. అయితే ఇరు దేశాల నేతలు ఈ భేటీలో ఏం చర్చించారన్న దానిపై క్లారిటీ లేదు. కానీ ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్మూజ్ జలసంధిపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. హార్మూజ్ జలసంధిని మూసివేయండంతో ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే.
ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరాన్- అమెరికా మధ్య యుద్ధం ప్రారంభం కాగా అప్పటినుంచి ఇరాన్ తో ప్రధాని మోదీ టచ్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమెరికా- ఇరాన్ మధ్య సంధి చర్చలతోనే యుద్ధానికి శాంతి యుతంగా ముగింపు పలకాలని భారత్ తన వైఖరిని చెబుతూ వస్తోంది. అలాగే మిడిల్ ఈస్ట్ లో సుస్థిరత ఉండాలని.. ప్రపంచ వాణిజ్య వ్యవస్థకు ఎలాంటి ఆటంకం కలగొద్దని భారత్ స్పష్టం చేస్తూ వస్తోంది. ఇక జూన్ 30 న చివరిసారిగా ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ సంభాషించారు. అమెరికా- ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య ఉన్న అన్ని సమస్యలను శాంతియుతమైన చర్చల ద్వారానే ముగింపు పలకాలని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. అలాగే ఇరాన్ లోని భారతీయుల భద్రత విషయంలో ఆ దేశాధ్యక్షుడు పెజెష్కియన్ కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
#WATCH | Bishkek, Kyrgyzstan: Prime Minister Narendra Modi holds a bilateral meeting with Iranian President Masoud Pezeshkian.
— ANI (@ANI) August 31, 2026
(Source: ANI/DD News) pic.twitter.com/BEDua6jPKE
ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తాజా భేటీకి కొన్ని గంటల ముందే ఇరాన్ కు చెందిన లారక్ ఐలాండ్ లోని మిలిటరీ రాకెట్ లాంచింగ్ స్టేషన్స్ పై అమెరికా దాడులు చేసింది. హార్మూజ్ జలసంధిలో ఇరాన్ సైన్యం సీ మైన్స్ ను అమర్చుతోందని అమెరికా ఆరోపణలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే దాడులు జరిపినట్లు స్పష్టం చేసింది. అటు ఇరాన్ సైతం అమెరికాపై ప్రతీకార దాడులు చేపట్టింది.

యూఏఈ, జోర్డాన్ లోని అమెరికా సైన్యం బేస్ క్యాంప్స్ లక్ష్యంగా దాడులు చేసింది. ఈ మేరకు హార్మూజ్ వద్ద అమెరికా డ్రోన్స్ ను తమ సైన్యం కూల్చివేసిందని ఇరాన్ ప్రకటన చేసింది. ఇక ఎస్సీఓ సమావేశానికి బయల్దేరే ముందు అమెరికాకు మరోసారి ఇరాన్ అధ్యక్షుడు మసూజ్ పెజెష్కియాన్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా ఎలాంటి దాడులకు పాల్పడినా గట్టిగా బదులు చెప్తామన్నారు. ఈ మేరకు పశ్చిమాసియాలో పరిస్థితి మరింత అధ్వానంగా మారుతుందని హెచ్చరికలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications