సౌత్ కొరియా పరిశోధనల ఫలితం: భారత్ లాంటి దేశాలకు గొప్ప ఊరట
సియోల్: ఒకసారి కరోనావైరస్ బారిన పడి కోలుకున్న వ్యక్తి మరోసారి కరోనా బారిన పడితే అతని నుంచి ఇతరులకు వ్యాధి వ్యాపించే అవకాశం లేదని కొరియన్ సెంటర్స్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ అండ్ ప్రీవెన్షన్(దక్షిణ కొరియా) స్పష్టం చేసింది.

ఇతరులకు కరోనా సోకే ప్రమాదం లేదు..
కరోనా నుంచి కోలుకుని మరోసారి ఆ వ్యాధి బారినపడ్డ 285 మందిని దక్షిణ కొరియాకు చెందిన పరిశోధకులు పరిశీలించారు. కరోనా బారినపడి తిరిగి కోలుకున్నవారు మళ్లీ కరోనా బారిన పడినప్పటికీ వారి నుంచి ఇతరులకు కరోనా సోకే ప్రమాదంలేదని కనుగొన్నారు. ఈ మేరకు బ్లూమ్ బర్గ్ నివేదికలో వెల్లడించారు.

ఇండియా లాంటి దేశాలకు ఇది గొప్ప ఊరట
కరోనా నుంచి కోలుకున్న వారికి తిరిగి ఆ వ్యాధి వచ్చినప్పటికీ వారి శరీరంలో కరోనా వైరస్ బతికే అవకాశం లేదని తెలిపారు. వారిలో ఎక్కువగా చనిపోయిన కరోనావైరస్ లే ఉండే అవకాశం ఉందని, అందుకనే వారి నుంచి ఇతరులకు వ్యాధి సోకే అవకాశం లేదని వివరించారు. లాక్డౌన్ నిబంధనలను సడలించాలనుకునే ఇండియా లాంటి దేశాలకు ఈ పరిశోధన ఎంతో ఊరట కలిగిస్తోంది. ప్రస్తుతం భారతదేశంలో మే 31 వరకు లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, అనేక సడలింపులను ప్రకటించారు. రాష్ట్రాలు మరిన్ని సడలింపులను ఇస్తున్నాయి.
Recommended Video

ప్రపంచ వ్యాప్తంగా 3 లక్షల దాటిన మరణాలు
కాగా, ప్రపంచ వ్యాప్తంగా 4,895,033 మంది ప్రజలు కరోనా బారినపడ్డారు. 320,192 మంది మరణించారు. 1,909,433 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక సౌత్ కోరియాలో ఇప్పటి వరకు 11,078 కేసులు నమోదుకాగా, 263 మరణాలు సంభవించాయి. 9,938 మంది కోలుకున్నారు. ఇక భారతదేశంలో 1,03,886 కరోనా కేసులు నమోదు కాగా, 3212 మంది మరణించారు. 59,812 మంది కరోనా బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. 40,856 మంది కోలుకున్నారు.












Click it and Unblock the Notifications